17, నవంబర్ 2023, శుక్రవారం

దీపారాధన మహిమ*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*కార్తీకపురాణం - 4వ అధ్యాయము*

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*దీపారాధన మహిమ*


ఈ విధముగా వశిష్టుడు కార్తిక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొ౦దెదరని చెప్పుచుండగా జనకుడు 'మహితపస్విత ! తమరు తెలియజేయు యితిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసమున యేమేమి చేయవలయునో, యెవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు' అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి. 

జనకా! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన యందు అతి ముఖ్యము.  దీని వలన మిగుల ఫలము నొ౦ద వచ్చును. సూర్యాస్తమయ మందు, అనగా, సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబున౦దు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని  వైకుంఠ ప్రాప్తి నొ౦దుదురు.  కార్తిక మాసమందు హరి హరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, విప్ప నూనెతో గాని, యేది దొరకనప్పుడు  అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను.  దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను, భక్తి పరులగాను  నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.


*శతృజిత్ కథ* 


పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి, తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చటకు పికెదుడను ముని పుంగవుడు వచ్చి ' పాంచాల రాజా! నీవెందుల కింత తపమాచరించు చున్నావు?  నీ కోరిక యేమి?'  యని ప్రశ్నించగా, ' ఋషిపుంగవా! నాకు అష్ఠ యిశ్వర్యములు, రాజ్యము, సంపదావున్ననూ, నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక, కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను' అని   చెప్పెను. అంత మునిపున్గవుడు' ఓయీ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల నీ కోరిక నేర వేరగలదు ' యని చెప్పి వెడలిపోయెను.


వెంటనే పాంచాల రాజు తన దేశమునకు, వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తిక మాసము నెలరొజులూ దీపారాధన చేయించి, దాన ధర్మాలతో  నియమాను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు, విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన నా రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముహూర్తమున నొక కుమారుని గనెను.  రాజ కుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రో త్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మములు జేసి, ఆ బాలునకు ' శత్రుజిత్' యని నామకరణ ము చేయించి అమిత గరాబముతో పెంచుచుండిరి.  కార్తిక మాస  దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తిక మాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను.  కాని, యవ్వనము  రాగానే దుష్టుల సహవాసము చేతను, తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలను బలాత్కరించుచు, యెదిరించిన వారిని దండించుచు తన కమావాంఛ తీర్చుకొనుచుండెను.

తల్లితండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల ప్రేమతో చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి.  శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదునని కత్తి పట్టుకుని, ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను.   ఆమె ఒక ఉత్తమ భార్య, మిగుల రూపవతి.  ఆమె అందచందములను వ ర్ణించుట మన్మధునికైననూ శక్యము గాదు.  అట్టి స్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై, కామవికారముతో నామెను సమీపించి తన కమవాంఛను తెలియచేసేను.  ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై, కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను అనుభవించెను. 


ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత, వారు ప్రతి దినము నర్థరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు, తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి, పసిగట్టి, బార్యనూ, రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి, ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.


ఇట్లుండగా కార్తిక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమున కలుసుకొనవలెనని నిర్ణయించుకొని, యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు, అంతకుముందే కత్తితో  సహా బయలు దేరి గర్భ గుడిలో దాగి యుండెను.  ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చు కొను సమయమున 'చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా,' యని రాకుమారుడనగా, ఆమె తన  పైట చెంగును చించి, అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో  రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త, తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ, ఆ రాజకుమారుని

ఖండించి, తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తిక శుద్ధ పౌర్ణమి, సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు  బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి.  అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు 'ఓ దూతలార! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు?  కామాంధకారముతో  కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల?  చిత్రముగా నున్నదే! అని ప్రశ్నించెను.  అంత యమకింకరులు ' ఓ బాపడ! ఎవరెంతటి  నీచులైననూ, యీ పవిత్ర దినమున, అంగ, కార్తిక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశించిపోయినవి.  కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు' అని చెప్పగా- యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు'  అలా యెన్నటికిని జరగనివ్వను.  తప్పొప్పులు యెలాగునున్నప్పటికీ మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా యందరికి  వర్తించ వలసినదే ' అని, తాము చేసిన దీపారాధన ఫలములో  కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను.  వెంటనే అతనిని కూడా పుష్పక విమాన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి. 

వింటివా రాజా!  శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికుల పాపములు పోవుటయేగాక, కైలాస ప్రాప్తి కూడా కలిగెను.  కాన, కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొందుదురు.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త  కార్తిక మహాత్యమందలి*

*నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.*

*ఉ || ఎల్ల శరీర దారులకు నీళ్ళను చీకటి నులిలోపలన్*

*ద్రెళ్లక ' మీరుమే' మను మతిభ్రమణంబున భిన్నులై*

*ప్రవర్తిల్లక సర్వమున్నతని* *దివ్యకళమయమంచు విష్ణు నందుల్లము జేర్చి తారడ వినుండుట మేలు నిశాచరాగ్రణి ||*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: