24, జనవరి 2024, బుధవారం

అంతరార్థం

 🌸  *ఖాళీ .. అంతరార్థం*  🌸


వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.

అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.

అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.

రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.


ఒకరు గురువుగారిని అడిగారు ....దైవీశక్తిని నేను చవి చూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి  ఇలా చెప్పారు


500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.... నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది.


ప్రత్యక్షానుభవం కలుగుతుంది..

కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని చేయడం వలన కలుగుతుంది...అన్నారు.

అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ,

ప్రాక్టికల్ గా సాహసం చేయలేకపోయాడు.


ఈ ఘట్టం విని ఓ గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు.

అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్ష చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా ప్రాక్టికల్ గా చేసి దైవీశక్తిని అనుభవించాడు.


తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు.....

కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...

కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు.

అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక.

* * *

 వాస్తవానికి ప్రతి ఒక్కడు ఈ భూమ్మీదకు దిగంబరంగానే వచ్చాడు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు...


తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందాడు..తిరిగి అందరినీ, అన్నిటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతాడు.


"ఖాళీ" అవడం తథ్యం....

కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే

"మెలకువలో నిద్ర".

భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."

నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.

"ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర.


భగవద్గీత చరమశ్లోకంలో-

సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు.

సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నాడు.


ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.

"ఖాళీ" అనేది పరానికి సంబంధించినది

* * *

"నేను లేని స్థితి సర్వసమ్మతము"

"తాను ఆహారమగుటయే"

అని భగవాన్ ఉన్నది నలుబదిలో ప్రస్తావించిన వాక్యాలు ఈ "ఖాళీ" ని ఉద్దేశించినవే.

* * *

శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.

కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు,


అర్థరాత్రి...

ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని)

ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.


పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.


రాత్రయినా, పగలయినా వారిలో స్థితిభేదం ఉండదు.

వారు సదా "ఖాళీ"గానే ఉంటారు.


కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.

వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.

అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం.


మాట్లాడుతూ వున్నా సరే

మౌనంగా ఉండగలిగే స్థితికి ఎదగాలి.


కరచరణాదులతో పని చేస్తూ వున్నా సరే

అచలంగా ఉండగలిగే స్థితిని అలవరచు కావాలి


నిజానికి తాను "ఖాళీ" అయిపోతే....

ఆ ఖాళీ ఖాళీగా ఉండదు...

ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.

ఇదే "ఖాళీతత్త్వరహస్యం".


అదే ఇది....

ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం.

ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం.

ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.

కామెంట్‌లు లేవు: