_*మార్గశిర మాసంలో గురువారం మార్గశిర లక్ష్మివార వ్రతం , వ్రత విధానం – సమర్పించవలసిన నైవేద్యములు – వ్రత కథ*_
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
ఒకనాడు నారదుడు , పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారూ ఇళ్ళను గోమయం (ఆవుపేడ)తో అలికి , ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటుస్నానం చేసి , కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి. 4 వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి , లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా , వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో *"మహర్షి ! ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి ? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతుహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి"* అన్నారు. *గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీ దేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు"* *మహనీయ , ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా ? చేస్తే ఎవరు చేశారో , వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి"* అనగా , పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు.
ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో *"స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను"* అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృతభూషితయై భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రహ్మణ స్ర్తీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటిముందుకు వచ్చి *"అవ్వా ! ఈ రోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ. ఇల్లు గోమయంతో అలికి ముగ్గుపెట్టలేదేంటి ?"* అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ *"అమ్మా ! ఆ వ్రతం ఏమిటి? ఏలా చేయాలి ? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను"* అని అడుగగా మహలక్ష్మీ మందహాసంతో ఈ విధంగా పలికింది.
*"మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి , ఇల్లు గోమయంతో అలికి , ముగ్గులు పెట్టి , లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో , బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని , దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలతపాత్రను ఉంచి , పసుపునీటితో కడిగిన పోకచెక్క(వక్క)ను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని , కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్ర మీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి , ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదటపాలు నైవేధ్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా , నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవెధ్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం".*
లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. *"రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిధి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవెధ్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని , పదిమందిని పిలిచి ఈ వ్రతం చేయాలి , పసుపుకుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది.
*ఈ వ్రతం మాత్రమే కాదు , మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి , పొయ్యి బూడిద తీయకపోయిన , ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా , మడివస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో , కొడుతుందో , ఇల్లువాకిలి చిమ్మదొ , అంట్లుకడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి , సంతానానికి హాని కలుగుతుంది. అదే విధంగా గురువారం ఉడకని పదార్ధాలు , నిషిద్ధ పదార్ధాలు తినే ఇంట , ఆశుభ్రప్రదేశాలలో తిరగడం , అత్తమామాలను ధూషించడం , సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు , తరువాత కాళ్ళు , చేతులు , ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ , ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా , అసంధర్భంగా , గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మీ ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో , గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ ఉంటుంది. ఏ స్ర్తీ గురువారం దానధర్మాలు , పూజలు చేయదో , భర్తతో గోడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం , అమావాస్యా , సంక్రాంతి(ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది)తిధులలో నిషిద్ధ పదార్ధాలను తినే స్త్రీ యమపురికి(నరకానికి) పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధపదార్ధములను తినకుండా , నక్తం(ఒంటిపూట , ఒకపొద్దు) ఉంటుందో , లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహా పాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర , దక్షిణం దిక్కులకు కూర్చుని(ముఖం పెట్టి) భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకునూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు , మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట , భర్త మాట వినని స్త్రీ ఇంట , దైవంయందు , బ్రాహ్మాణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి , పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇళ్ళు స్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీ దేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుంది"* అని లక్ష్మీ దేవి ఆ ముసలి బ్రాహ్మణస్త్రీకి లక్ష్మీ దేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది.
ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహ్యించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేదస్త్రీ ప్రతి రోజు ఇల్లును గోమయంతో అలికి , ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి , లక్ష్మీ దేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి , ధూపం వేసి , నైవెధ్యాలు పెట్టి , పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మినే ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీ ఆమె ఇంట పాదాలు మోపింది. *"ఓ భక్తురాలా ! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో , ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీ దేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాకా ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి "నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకలసంపదలను అనుభవుస్తావు. మరణం తరువాత వైకుంఠాని చేరుతావు" అని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి , విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు , భోగబాగ్యాలు , ఐదుగురు కూమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది"* అంటూ మహర్షి పారాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మీ చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి.
*మార్గశిర లక్ష్మివార వ్రతం:*
మార్గశిర మాసంలో వచ్చే గురువారం /లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను *మార్గశిర లక్ష్మివార వ్రతము* అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల ఋణ సమస్యలు తొలగి , శ్రేయస్సు , సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.
*ఈ సంవత్సరమందు మార్గశిర లక్ష్మివారముల తేదీలు:*
డిశంబర్ 9 వ తేదీ గురువారం
డిశంబర్ 16 వ తేదీ గురువారం
డిశంబర్ 23 వ తేదీ గురువారం
జనవరి 30 వ తేదీ గురువారం
*మార్గశిర లక్ష్మివార వ్రత విధానం:*
మార్గశిర లక్ష్మివార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీపూజ మరియు వరలక్ష్మి పూజ వలే ఉన్నప్పటికిని… అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది.
మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి , తలస్నానం చేయవలెను (తలంటు కుంకుడు /శ్యాంపుతో చేయరాదు). ప్రత్యేకించి పూజ ముగిసే వరకు , తలకు నూనే రాసుకొనుట , దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.
*‘ఆదౌ పూజ్యో గణాధిపః’* అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం , లక్ష్మీ అమ్మవారికి అధాంగ , షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ , కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి.
లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.
*మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:*
1 వ గురువారం – పులగం
2 వ గురువారం – అట్లు , తిమ్మనం
3 వ గురువారం – అప్పాలు , పరమాన్నము
4 వ గురువారం – చిత్రాన్నం , గారెలు
5 వ గురువారం – పూర్ణం బూరెలు
*మార్గశిర లక్ష్మివార వ్రత కధ:*
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి ని చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మిదేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది.
తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా ! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు.
తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతకగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది.
అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా ? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచేప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది.
నాలుగవ వారం ఈసారి అయినా చాలజాగ్రతగా ఉండమని చెప్పి సుశీల తల్లిని ఏ పని చేయకుండా ఉండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తనకొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా…. నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం , రెండవ వారం అట్లు , తిమ్మనం , మూడవ వారం అప్పాలు , పరమాన్నము , నాల్గవ వారం చిత్రాన్నం , గారెలు , పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది.
కథా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథ లోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.
*లక్ష్మీ అమ్మవారి మంగళ హారతి పాట:*
లక్ష్మీదేవ్మ - మంగళ హారతి ఇది గో
అనురాగంబులో - నిన్నువేడి తిని
క్షీర సాగర తనయా – ఆది లక్ష్మీ ప్రార్ధంచితిని || లక్ష్మీ
వనస బత్తాయా – దానిమ్మ ఖర్జూర
తేనెలూ రేటి – తీ పైన పండ్లు
కన్నతల్లి – కమలాఫలాలు
ఉంచినాఫమ్మ- దయాసేయవమ్మా || లక్ష్మీ
మల్లె పుష్పాలు – మందార పూలు
తెల్ల గన్నేరు – చెంగల్ప పూలు
పళ్ళేరములో- మధుపాయసాలు
తల్లి ఉన్నాయి – దయ సేయమ్మా || లక్ష్మీ
భక్తితో గొలిచేటి – నీ భక్త వరులం
నిజముగా – నిన్ను నమ్మేము నిరంతరం
శ్రీ హరి ప్రియమమ్ము కాపాడుమమ్మా
సకల సౌఖ్యాలు – చేకూర్చు మాతా ||
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి