శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 27)
(పరశురాముడు - 4)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
----
(5-4-'26 పోష్టు తరువాయి భాగము)
కార్తవీర్యార్జునుడు రాజు కాబట్టి, రాజవధ పాపం అన్న తండ్రి మాటను మన్నించి,ఆయన ఆజ్ఞానుసారం ఒక సంవత్సరం దీక్షతో తీర్థ యాత్రలు చేసి, పరశురాముడు తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.
ఒక రోజు జమదగ్నిమహర్షి భార్య, రేణుకాదేవి, గంగానదీ తీరంలో,అప్సరసలతో కూడి జలక్రీడలాడుతున్న గంధర్వ రాజు చిత్రరధుని చూచింది.
కొన్ని క్షణములు, మనస్సు చలించి,చిత్రరథుని మీది కోరికతో, ఆమె మన్మథ వికారానికి లోనైంది.
దివ్య దృష్టితో అది గ్రహించాడు జమదగ్నిమహర్షి.
పాతివ్రత్య నియమాలతో అత్యుత్తమ స్థితి సాధించిన రేణుకాదేవిని, తాత్కాలిక మానసిక వ్యభిచార దోషంతో అధోలోకాలలో పడకుండా సంస్కరించడం కోసం, జమదగ్ని మహర్షి ఆమె శిరస్సును ఖండించమని తనపుత్రులను ఆజ్ఞాపించాడు.
అయితే ఆ ఘోర కృత్యం చేయడానికి వారంతా నిరాకరించారు.
తల్లిని,సోదరులను కూడా సంహరించమని జమదగ్ని, అప్పుడే అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చిన పరశురాముని ఆదేశించాడు.
తండ్రి యొక్క తపఃప్రభావము తెలిసిన పరశురాముడు, వెంటనే తండ్రి ఆజ్ఞ నెరవేర్చాడు.
ప్రీతి చెందిన జమదగ్ని పరశురాముని వరము కోరుకొమ్మన్నాడు.
తల్లిని, సోదరులను బ్రతికించమని, వారెవ్వరికీ తాము సంహరింపబడి,తిరిగి బ్రతికామన్న స్మృతి ఉండకూడదని, పరశురాముడు తండ్రిని వరం అడిగాడు.
జమదగ్ని ఆ వరము ఇవ్వగానే, రేణుకాదేవితో సహా,మరణించిన ఆమె నలుగురు పుత్రులు నిద్రనుండి లేచినట్లు లేచారు.
వారెవ్వరికి జరిగినదేమీ గుర్తులేదు.
అటు, కార్తవీర్యార్జునుని సంహారమైన సంవత్సరం తరువాత కార్తవీర్యార్జునుని పది వేలమంది పుత్రులు, మాహిష్మతీ పట్టణంలో తిరిగి కలుసుకున్నారు.
వారందరు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేనప్పుడు, మూకుమ్మడిగా వారు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి,
శాంతంగా ధ్యానంలో ఉన్న ఆ మహర్షి మీద దాడి చేసారు.
అడ్డువచ్చిన రేణుకా దేవిన తోసి వేసి, బ్రహ్మర్షి, పరమ శాంత స్వభావుడు అయిన జమదగ్ని మహర్షిని పరమ దారుణంగా సంహరించారు.
ఆ మహర్షి శిరస్సును ఖండించి పట్టుకు పోయారు.
పతివ్రతయగు,రేణుకాదేవి, శిరోవిహీనమైన జమదగ్ని కాయాన్ని ఒడిలో పెట్టుకొని, "రామా! రామా!" అంటూ బిగ్గరగా విలపించ సాగింది.
ఇరవై యొక్కమార్లు ఆమె అలా విలపించగా,
ఆమె రోధనధ్వని విన్న పరశురాముడు, పరుగు,పరుగున వచ్చి, ఆ దృశ్యం చూచి నిశ్చేష్టుడు అయ్యాడు.
పరమ శాంతుడు,తపఃపరాయణుడు అయిన తన తండ్రి ఆ విధంగా సంహరింపబడటం చూసి, పరశురాముడు దుఃఖం ఆపుకోలేక పోయాడు.
బిగ్గరగా రోదించాడు.
కొద్ది సేపటికే ఆయన శోకం తీవ్ర క్రోధంగా మారింది.
ఆ క్రోధం వెల్లువలాగా పెల్లుబికింది.
" పరిపాలకులైన క్షత్రియులకు వివేకజ్ఞానం నశించింది.
వారి అధర్మ వర్తనకు ఇది పరాకాష్ట.
అందువల్ల ఈ క్షత్రియజాతిని మొత్తం నాశనం చెయ్యాలి"
అని నిర్ణయం తీసుకున్నాడు.
తండ్రి దేహమును సోదరులకు అప్పజెప్పి తాను గండ్రగొడ్డలి ధరించి, బ్రహ్మర్షి హత్య అయిన మరుక్షణమే శోభావిహీనమైన ఆ మాహిష్మతీ పట్టణానికి ఒంటరిగా వెళ్ళాడు.
భయంకరమైన యుద్ధంలో,తా నొక్కడే కార్తవీర్యుని పుత్రులు పదివేలమందిని సైన్యముతో సహా సంహరించాడు.
ఖండింపబడిన వారందరి శిరస్సులు నగరం మధ్యలో ప్రోగు పెట్టాడు.
అది ఒక పెద్ద కొండవలె కనిపించింది.
వారి రక్తము ఒక నది వలె ప్రవహించింది.
పరశురాముని క్రోధం అంతటితో శమించ లేదు.
ఆనాటి పాలకులందరూ క్షత్రియులే కాబట్టి వారందరినీ భూమండల మంతా వెతికి వెతికి సంహరించాడు.
భూమండలమంతా పరశురాముని స్వాధీనం అయింది.
శ్రీమద్భాగవతంలో శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు.
శ్లో//హేతుం కృత్వా పితృ వధం,క్షత్రే౽మంగలళకారిణి/
త్రిస్సప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షత్రియాం ప్రభుః/
సమంతపంచకే చక్రే శోణితోదాన్ హ్రదాన్నృప//
(ఓ పరీక్షిన్మహారాజా!తండ్రి వధను, నిమిత్తంగా చేసుకొని, క్షత్రియులు అత్యాచార పరులైనందున,ఇరవైఒక్క మారులు, భూమండలమంతా వెతికి,వెతికి ఆ పరశురామప్రభువు సకల క్షత్రియ సంహారము చేశాడు.
కురుక్షేత్ర మందలి సమంత పంచకము నందు వారి రక్తజలముతో అయిదు సరస్సులను నిర్మించాడు).
తండ్రి తలను తెచ్చి దర్భలయందు ,మొండెముతో అతికించి,యజ్ఞము చేసి, సర్వదేవాత్మకుడయిన విష్ణుమూర్తిని ఆరాధించాడు.
కశ్యపుడు మొదలైన ఋత్విక్కులకు, సమస్త భూమినీ దానం చేశాడు.
సరస్వతీ నది యందు అవభృథస్నానము చేసి, సమస్త పాపములనుండి విముక్తుడై,మేఘములు తొలగిన సూర్యునివలె ప్రకాశించాడు.
పరశురాముని పూజలు అందుకొని, జమదగ్నిమహర్షి, సప్తర్షిమండలములో ప్రవేశించి అక్కడ ఏడవ మహర్షి అయినాడు.
చిరంజీవి అయిన పరశురాముడు, సిద్ధ, చారణ, గంధర్వాదులైన దేవ గణములతో,కీర్తింపబడుతూ మహేంద్ర పర్వతముపై తపోదీక్ష వహించాడు.
శ్లో//ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః/
అవతీర్య పరం భారం భువో౽హన్ బహుశో నృపాన్//
(విశ్వాత్ముడు, జగన్నాథుడు, అయిన శ్రీహరి భగవానుడు ఈ విధముగా భృగువంశమునందు,పరశురాముడై అవతరించి భూమికి అమితభారముగా పరిణమించిన రాజులను సంహరించాడు)
(సశేషం)
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
6-4-'26.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి