22, డిసెంబర్ 2020, మంగళవారం

*సప్త మాతృకలు

 *సప్త మాతృకలు*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*విశ్వ నిర్వహణ శక్తిని జగన్మాతగా దర్శించి, వేద పురాణాగమాలు ఆ శక్తి తాలూకు వివిధ కోణాలను వివిధ రూపాలుగా ఆవిష్కరించాయి. వాటి ఉపాసనా విధులను ఏర్పరచాయి. ఆ పద్ధతిలో 'సప్త మాతృకా' తత్వం ఒకటి.*



*శుంభునిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో, భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణించింది.*



*1. బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి',*


*2. విష్ణుశక్తి 'వైష్ణవి',*


 *3. మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి',*


 *4. స్కందుని శక్తి 'కౌమారి',*


 *5. యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి',*


 *6. ఇంద్రుని శక్తి (ఐంద్రి),*


 *7. అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి 'కాళి' (చాముణ్డా).*


 *-వీరిని 'సప్త మాతృకలు' అంటారు.*


 *ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు.*



*ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివ శక్తులు, నిజానికి ఒకే శక్తి తాలూకు వివిధ వ్యక్తీకరణలు.*



*1. బ్రాహ్మి:- అనంతాకాశంలో, హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర, అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వ శాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం.*



*2. వైష్ణవి:- విశ్వమందంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి ఈ తల్లి.*



*3. మహేశ్వరి:- ప్రతివారి హృదయంలో 'అహం' (నేను) అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. 'సర్వ భూత హృదయాల్లో ఈశ్వరుడే, శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు' అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం ఈ భావాన్నే చెబుతున్నది.*



*4. కౌమారి:- సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి కౌమారి.*



*5. వారాహి:- ఈ యజ్ఞ వరాహశక్తి అన్న ప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తినీ, అన్నపరిణామాన్నీ (మార్పునీ) తెలియజేసే సంకేతాలు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి.*



*6. ఐంద్రి:- జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి.*



*7. చాముణ్డా:- కథ ప్రకారం- రక్తబీజుడనే రాక్షసుని దేవి సంహరించే టప్పుడు, స్రవించే ప్రతి రక్తకణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే, 'చాముణ్డా' దేవి తన నాలికతో ఈ రక్తాన్ని పానం చేసింది. అప్పుడు ఆ అసురుడు హతమారి పోయాడు.*



*విషయ లంపటానికి సంకేతం రక్తబీజుడు. రకరకాల కామసంకల్పాలే రక్తకణాలు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర, అజ్ఞానశక్తులే అసురులు. వాటిని నిర్మూలించే సమాధిస్థితిలోని దివ్య చైతన్యం 'చాముణ్డా'.*



*ఏకం పరబ్రహ్మ తత్వం. అనేకం ప్రపంచ స్వరూపం. ఈ అనేకమే 'చమూ' (సేనలు). ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి. దీనినే 'చాముణ్డా' అని సంకేతించారు.*



*చండ, ముండ- అనే దనుజుల్ని సంహరించినందుకు 'చాముణ్డా'- అన్నారని మరో కథనం. యోగపరంగా చూస్తే- మూలాధారం నుంచి గ్రంథిని భేదించడం చండాసుర సంహారం. సహస్రార కమలంలో ప్రవేశించేటప్పుడు జరిగే భేదనం ముండాసుర సంహారం.*



*- ఈ విధమైన తాత్విక, యోగదర్శనాన్ని కావ్యకంఠ గణపతి ముని సంభావించారు (ఉమా సహస్రం).*



*మొత్తంగా పరిశీలిస్తే- 1.విశ్వాన్ని నడిపే శక్తులు, 2.యోగసాధనవల్ల మనలో మేల్కొనే దివ్యశక్తులు- వీటినే విభిన్న శక్తిరూపాలుగా పురాణాదులు ఆవిష్కరించాయని స్పష్టమవుతోంది. ఈ సర్వశక్తుల సమన్వయరూపిణి... సప్తమాతృకలు.*


🕉🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: