1, జనవరి 2021, శుక్రవారం

తంజావూరుబొమ్మ

 ఇంటింటా మన తెలుగు వారి బంగారు #తంజావూరుబొమ్మ


వంద మాటలు చెప్పలేనిది ఒక్క చిత్రం చెబుతుంది అంటారు. అందుకే ఇంటి అలంకరణలో అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడైనా చిత్రపటాలదే పైచేయి.  రంగులతో జీవకళ ఉట్టిపడేలా గీసిన సీతారాములు, వేంకటేశుడు, వినాయకుడు, యశోద కృష్ణ,  రాధాకృష్ణులు, రాజస్థానీ పల్లెపడుచు... ఇలా దేని అందం దానిదే. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆ చిత్ర పటాలన్నీ అచ్చమైన బంగారంతో మెరుస్తూ గృహాలంకరణ ప్రియుల్ని అలరిస్తున్నాయి. తమిళనాటే కాక మన తెలుగింటి పూజ గదులలో కూడా హారతులు అందుకుంటున్నాయి. బంగారంతో గీసిన చిత్రపటాలు అందంగా ప్రతి ఇంట్లో  కొలువుదీరుతున్నాయి. గృహప్రవేశం, పెళ్లిరోజు, పెళ్లి వేడుకల్లో సంపన్నులు ఇచ్చిపుచ్చుకునే కానుకల్లో అందమైన ఈ చిత్రాలదే అగ్రస్థానం. అత్యంత పలుచని బంగారు రేకుతో సునిశితమైన నైపుణ్యంతో ఏ చిత్రకారుడో కుంచెతో గీసినట్లే రేకుని చెక్కుతూ చేస్తోన్న ఈ చిత్రాలు ఓ పట్టాన చూపు తిప్పుకోనీయవు. దేవీదేవతల రూపాలతోబాటు జంతువులూ పక్షులూ చెట్లూ... ఇలా ప్రకృతి అందాలకీ బంగారు సొబగులు అద్దేస్తున్నారు కళాకారులు. ఆపై వీటిని బంగారు రంగు ఫ్రేముల్లో బంధించి ఆ పటం మొత్తం బంగారమేనా అన్న భ్రమని కలిగిస్తున్నారు. కొందరు అచ్చంగా 24 క్యారెట్ల బంగారురేకుతోనే చిత్రాలు గీయిస్తుంటే మరికొందరు బంగారుపూత పూసిన వెండి రేకులతోనూ ఈ పెయింటింగుల్ని రూపొందిస్తున్నారు. వాతావరణ మార్పులకి ఫ్రేముకి ఉండే రంగు కొద్దిగా మాయొచ్చేమోగానీ లోపలి గీసిన పెయింటింగు మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరదు సరికదా, ధగధగా మెరిసే ఆ సువర్ణ పటాన్ని హాల్లోని ఓ గోడకు తగిలిస్తే చాలు... ఇంటికి వచ్చినవాళ్లు అక్కడే ఆగి అలా చూస్తుండిపోతారు. బంగారమా... మజాకానా..!


చరిత్ర

భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక చారిత్రక ప్రదేశాల్లో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా కర్ణాటక సంగీతానికి చేసిన సేవలకూ,  తంజావూరు చిత్రలేఖనానికి (పెయింటింగ్) చాలా ప్రసిద్ధి. ఇంకా వీణ, తంజావూరు బొమ్మలు, తవిల్‌ ఇక్కడి ప్రముఖమైన విషయములు. రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి బృహదీశ్వరాలయము ఇంకా ఇక్కడి విజయనగర కోట కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడనే ప్రఖ్యాత సరస్వతీ మహల్‌ గ్రంథాలయము ఉంది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన రాజధాని కేంద్రం. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు. 


తంజావూర్ చిత్రలేఖనాలు మన దక్షిణ భారతానికే సొంతమైన ప్రాచీన సంప్రదాయ కళ...భారతీయ చిత్రలేఖన చరిత్రలో తంజావూరుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తంజావూరు కృష్ణదేవరాయ యొక్క సోదరుడు మరియు వారసుడు అచ్యుతారాయ (1529–42) పాలనలో స్థాపించబడింది. అత్యంత విజయవంతమైన తంజావూర్ నాయక పాలకుడు అయిన రఘునాథ, కళలను, కళాకారులను గొప్పగా  పోషించడమే కాక, తంజావూర్ కళాకారుల కోసం  ప్రత్యేకమైన పాఠశాలను స్థాపించడంలో సహాయపడ్డాడు. తరువాత తంజవూర్ శైలి చిత్రాలను మరాఠాల క్రింద అభివృద్ధి చేశాడు. ఈ పాఠశాల యూరోపియన్ పద్ధతుల ద్వారా బాగా ప్రేరణ పొందింది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం వరకు తమిళనాడులో అత్యంత ప్రాచుర్యం పొందింది. 


క్రీ.శ 1565 లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం ఫలితంగా ఆ సామ్రాజ్య చిత్రకారులు మధురై, తంజావూరు ప్రాంతాలకి వలస వెళ్ళారు. వారిలో కొందరు తంజావూర్ నాయకుల ఆధ్వర్యంలో పనిచేశారు. నాయక రాజులు ప్రధానంగా శాస్త్రీయ నృత్యం సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఈ కాలంలో బాగా ప్రోత్సహించారు. తదనంతరం, తంజావూర్ నాయకులను ఓడించిన మరాఠా పాలకులు ఈ కళాకారుల వ్యక్తిగత అభిరుచులను గ్రహించారు.ఇది ప్రత్యేకమైన తంజావూర్ శైలి చిత్రలేఖనాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడింది. దేవాలయాలను అలంకరించడంతో పాటు తంజావూరు కళాకారులు మరాఠా రాజులు మరియు ప్రభువుల ప్రధాన భవనాలు, ప్యాలెస్‌లు, చట్రామ్‌లు మరియు నివాసాలను చిత్రించడం,  అలంకరించడం ప్రారంభించారు. ఈ చిత్రాలలో  11 వ శతాబ్దపు చోళ గోడ చిత్రాలు బృహదీశ్వర ఆలయంలో ఉన్నాయి. అలాగే నాయక రాజుల కాలం నుండి వచ్చిన చిత్రాలు 16 వ శతాబ్దానికి చెందినవి. 


మన తెలుగువారి హస్తకళ

తంజావూరు కళాకారుల పూర్వీకులు మన తెలుగు వారు కావడం మనకెంతో గర్వకారణం. ఈ కళాకారులు ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజులు, నాయుడులుగా గుర్తించారు. వారు తెలుగులోనే  మాట్లాడేవారు. కళాకారులు వాళ్ళ ఆసక్తి, ఆవశ్యకత ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వివిధ విషయాలపై వైవిధ్యమైన నాణ్యత కల చిత్రాలను విస్తృతంగా  అందించారు. అప్పటి కళాకారులకి ఈ హస్తకళ చాలా పవిత్రమైనది. వీరిలో చాలామంది  వారి చిత్రాలకు ఎప్పుడూ సంతకం చేయలేదు. సి. కొండయ్య రాజు ( C. Kondiah Raju) కోవిల్పట్టికి చెందిన ప్రసిద్ధ క్యాలెండర్ కళాకారుడు, రాజు సమాజం నుండి ఆధునిక కాలంలో కళాకారుడిగా పేరు తెచ్చుకున్న ప్రముఖ వారసులలో ఒకరు.


తయారుచేసే విధానం

తంజావూర్ చిత్రాలు స్పష్టమైన రంగులు, మెరిసే బంగారు రేకులు, గాజు పూసలు, విలువైన రత్నాలతో పొదగబడి ఉంటాయి. తంజావూర్ పెయింటింగ్ కి సాధారణంగా అరబిక్ జిగురు, కలప (టేకు) తో అతికించిన కాన్వాస్‌ ఉపయోగిస్తారు. కళాకారుడు కాన్వాస్‌పై ప్రధాన చిత్రం పెన్సిల్ తో గీసాక సుద్ద పొడి లేదా సున్నపురాయి పేస్ట్ తో ఆ చిత్రంపై పూత పూసి ఎండబెడతారు. స్తంభాలు, తోరణాలు, సింహాసనాలు, దుస్తులు మొదలైన ఎంచుకున్న ప్రదేశాలలో బంగారు పూత వేసి రకరకాల రంగుల రత్నాలు పొదుగుతారు. చివరగా మిగిలిన చిత్రాన్ని రంగులు స్కెచ్‌తో దిద్దుతారు. ఈ విధంగా అందమైన తంజావూరు చిత్రం పూర్తి అవుతుంది. పరిమాణం, వాడిన వస్తువులని బట్టి ధర నిర్ణయిస్తారు. వీటి ధర అధికమే అయినా ప్రస్తుతం గిరాకీ కూడా బావుంది. శిక్షణలో ఉన్నవారికి ఆసక్తి ఉన్నవారికి కేవలం మక్కుతో ఉన్న ఫ్రేములు కూడా లభ్యం అవుతున్నాయి.


చిత్రాల సేకరణ

చెన్నై గవర్నమెంట్ మ్యూజియం,  తంజావూర్ ఆర్ట్ గ్యాలరీలో తంజావూర్ చిత్రాల చక్కటి సేకరణలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌లోని బ్రిటిష్  విక్టోరియా & ఆల్బర్ట్ మ్యూజియమ్‌లలో సాంప్రదాయ శైలులలో పెద్ద తంజావూర్ పెయింటింగ్‌లు ఉన్నాయి. కోపెన్‌హాగన్ యొక్క నేషనల్ మ్యూజియంలో 17 వ శతాబ్దపు తంజావూర్ చిత్రాల చక్కటి సేకరణ ఉంది.  1806 లో ప్రచురించబడిన ఓరియంటల్ డ్రాయింగ్స్ అనే పుస్తకంలో బ్రిటిష్ చరిత్రకారుడు చార్లెస్ గోల్డ్ ప్రకారం టాంజోర్ పెయింటింగ్స్‌ను 'మూచీస్ లేదా ఆర్టిస్ట్స్ ఆఫ్ ఇండియా' చిత్రించారు. 


ప్రస్తుతం

తంజావూర్ పెయింటింగ్స్ నేటి వరకు కూడా కొనసాగుతున్నాయి. ఎగ్జిబిషన్లు, వర్క్‌షాప్‌లు మరియు శిక్షణా శిబిరాలు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు సంస్థలచే క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.  సాంప్రదాయ విషయాలతో పాటు, విస్తృతమైన ప్రజాదరణ పొందిన ఆధునిక ఇతివృత్తాలు తంజావూర్ చిత్రాలలో చిత్రీకరించబడుతున్నాయి. ఈ సాంప్రదాయిక కళ ఇంకా తన పట్టును కొనసాగించడం సంతోషకరమైన పరిణామం. తంజావూర్ పెయింటింగ్స్ శైలి మరియు సౌందర్యం చాలా మంది సమకాలీన కళాకారులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి.

#TanjorePaintings

కామెంట్‌లు లేవు: