3, ఏప్రిల్ 2021, శనివారం

నేను మళ్ళీ ఆలయానికి రాను"*

 *"నేను మళ్ళీ ఆలయానికి  రాను"*


ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రి తో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అంది.  "నేను ఇకపై ఆలయానికి రాను"


తండ్రి ఇలా అడిగాడు: "ఎందుకో నేను తెలుసుకోవచ్చా?"


ఆమె ఇలా అన్నది: " భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము, కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ  మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి , వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె


తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు, ఆపై ఇలా అన్నాడు: "సరే ... నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నాకోసం చిన్న పని చేయగలవా?" అన్నాడు  తండ్రి


ఆమె అన్నది: "చెప్పండి .. నాన్నగారు, ఏమిటది?"


తండ్రి ఇలా చెప్పాడు: "దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి వచ్చినా కూడా నీళ్ళు  ఏమాత్రం క్రింద పడకుండా రావాలి."  రాగలవా? అన్నాడు తండ్రి


కుమార్తె చెప్పింది: "ఓ ... తప్పకుండా నేను చేయగలను."

 

అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది:


"చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను"


అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలు అడిగాడు:


1. ఈసారి వెళ్లినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్ తో ఉండగా నీవు  చూశావా?


2.  ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్  చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూశావా?


3. ఎవరైనా యథార్థత లేకుండా కపటంగా జీవిస్తున్నారా?


ఆమె ఇలా చెప్పింది: "నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి  గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను, నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతావారిని నేను గమనించలేదు "


అతను ఆమెతో చెప్పాడు: "నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసినదిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయనగురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు, పైగా నీవంటి వారిని చూసి వారుకూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రతా సాధనా మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నతపథంలో నడిపిస్తాయి" .....


దేవాలయంలో గడప వలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది .....🙏 ఏకాగ్రత.....🙏సాధన ముఖ్యం ....🙏

కామెంట్‌లు లేవు: