13, నవంబర్ 2023, సోమవారం

శ్రీ సూర్య దేవాలయం

 🕉 మన గుడి : నెం 238


⚜ గుజరాత్ : మోధేరా






⚜ శ్రీ సూర్య దేవాలయం


💠 ఈ సృష్టిలో సకల జలాచర జీవాలకు మూలం ఆదిత్య భగవానుడే.

సూర్యుడంటే ఒక మండుతున్న గోళమే కాదు... మానవాళి మనుగడకు ప్రతిరూపం. అనునిత్యం మనకు ఆ వెచ్చదనం తగలకపోతే అనేక రుగ్మతల బారిన పడవలసి వస్తుంది మన దేహం. అందుకనే  ప్రపంచంలోని వివిధ దేశాలలో దేవునిలాగే స్తుతిస్తున్నారు. తరతరాల భారత సంప్రదాయం ప్రకారం తొలితరం మానవులు సూర్యుడినే తమ అధిదేవునిగా కొలిచేవారు. ఉదయం లేవగానే సూర్యనమస్కారాలు చేయడం వలన కలిగే ఉపయోగాలను వేల సంవత్సరాల క్రితమే మన వాళ్లు తెలుసుకోగలిగారు. శాస్త్ర పరిశోధనలు కూడా ఉదయం సూర్యుని నులివెచ్చని కిరణాలలో ప్రసరించే వెలుగులో ఎన్నో ఆయురారోగ్యదాయకాలున్నాయని చెబుతున్నారు. 


💠 అహ్మదాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలోనున్న 'పుష్పవతి' నది ఒడ్డున ఈ మోడేరా దేవాలయం ఉంది. 

ఈ ఆలయాన్ని 1022-1063లో చక్రవర్తి భీమ్ రావ్ సోలంకి-నిర్మించారు. 

1025-1026 ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుపక్కలనున్న ప్రాంతాలను విదేశీ అక్రమణదారుడైన మహమ్మద్ గజనీ తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది.

గజనీ ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు. సోలంకీ సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే 'అహిల్వాడ్ పాటణ్ కూడా తన గొప్పతనాన్ని, వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది. తమ పూర్వవైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరికపు కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 


💠 సోలంకి కుటుంబీకులు సూర్య వంశస్థులు. వారు సూర్యుడ్ని తమ కులదేవతగా కొలిచేవారు కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుడ్ని కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. 

ఈ విధంగా మోడేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది. భారతదేశంలో 3 సూర్యదేవుని ఆలయాలున్నాయి. 

వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం, రెండవది జమ్మూలోనున్న మార్తాండ్ ఆలయం మరియు మూడవది మనం చెప్పుకుంటున్న గుజరాత్ లోని మోడేరాకు చెందిన సూర్య మందిరం. 


💠 ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశేషం ఒకటుంది. అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఉపయోగించకపోవడం విశేషం. ఇరానీ శిల్పకళ శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమ్ రావ్ నిర్మించారు. ఇందులో తొలిభాగం గర్భగుడి కాగా రెండవది భూ మండపం. మందిరం గర్భగుడి లోపల పొడవు 51 అడుగుల 9 అంగుళాలు. అలాగే వెడల్పు 25 అడుగులు 8 అంగుళాలుగా నిర్మించడం జరిగింది. మందిరంలోని సభా మండపంలో 52 స్తంభాలున్నాయి. 

ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు చెక్కారు.


💠 రామాయణం,. భారతంలోని ప్రధానమైన విషయాలను కూడా చెక్కారు. 

స్తంభాల కింది. భాగంలో చూస్తే అష్టకోణాకారంలోను అదే పైభాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి. తొలి సూర్యకిరణం ఈ ఆలయ గర్భ గుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు. 

సభామండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది. దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామమడుగు అని పిలుస్తారు. 


💠 అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్యమందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. మందిరంలోని విగ్రహాలను తునాతునకలు చేసేశాడు. ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది.


🔅 పౌరాణిక చరిత్ర 🔅


💠 స్కందపురాణం మరియు బ్రహ్మపురాణాల ననుసరించి ప్రాచీనకాలంలో మోఢరా చుట్టు ప్రక్కలనున్న ప్రాంతాలను 'ధర్మారణ్య' అని పిలిచేవారు. 

శ్రీరామ చంద్రుడు రావణుడిని సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు, బ్రహ్మ హత్యాపాపం నుంచి బయట పడేందుకు పవిత్రమైన స్థానం చూపించమని వశిష్టుడిని అడిగాడని పురాణాలు చెబుతున్నాయి. 

అప్పుడు వశిష్ట మహర్షి 'ధర్మారణ్య’ వెళ్ళమని శ్రీరామచంద్రునికి సలహా ఇచ్చాడు. 

ఆ క్షేత్రమే మోధేరా పేరుతో పిలవబడుతోంది.


💠 రోడ్డు మార్గం : 

మోఢరా సూర్యదేవుని ఆలయం అహ్మదాబాద్ నుండి  102 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి బస్సు మరియు టాక్సీల సౌకర్యం ఉంది.

కామెంట్‌లు లేవు: