13, నవంబర్ 2023, సోమవారం

ప్రథమాధ్యాయము

 

Kartika Puranam - 1


ప్రథమాధ్యాయము


శ్లో!! వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే!

యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!!

ఋషయ ఊచుః


శ్లో!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే!

శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!!


తా!! నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు సూతుని ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమని అడిగిరి.

సూతుడు శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ కార్తీకమహాత్మ్యమును వశిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవారు జననమరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురని ఈ విధముగా చెప్పాను.

ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనకమహారాజు గృహమునకు చేరెను. అంత జనకమహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుండి దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసి సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనము ఇచ్చి వికసించిన తామరపువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త జంతువులయందు దయగలవాడును, బాలసూర్య సమాన కాంతిగలవాడును, సమస్త సుగుణ సంపన్నుడు అగు మునికి భక్తి భావముతో ఇట్లని విన్నవించెను.

బ్రాహ్మణోత్తమా! మీదర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యమింకేమియు లేదు. ఇప్పుడు మా పితరులందరును తృప్తినొందినారు. మహాత్ములయొక్క దర్శనము సంసారులకు దుర్లభము. ఇప్పుడు మీరాక నాకు శుభములకు కారణమైనది అనగా వశిష్ఠమహర్షి వికసించిన ముఖముగలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో రాజోత్తమా! నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఇంటివద్ద యజ్ఞము జరుగును. దానికి తగిన ద్రవ్యము ఇవ్వవలసినదిగా అడిగాడు.

ఆ రాజు మునీశ్వరా! యజ్ఞమునకు కావలసిన ద్రవ్యమును ఇచ్చెదను. కాని వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీవలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చెడి సూక్ష్మధర్మములను నాకు చెప్పుము. మునీశ్వరా! ధర్మజ్ఞా కార్తీకమాసము సమస్త మాసములకంటెను, సమస్త ధర్మములకంటె ఎట్లు అధికమైనదో దానిని వినగోరితిని నాకు చెప్పుమని అడగగా

వశిష్ఠుడు ఇట్లు పల్కెను. రాజా! పూర్వ పుణ్యమువలన సత్వశుద్ధి గలుగును. సత్వశుద్ధి గలిగిన పుణ్యమార్గమందు అభిలాషగలుగును. లోకోపకారార్థమై నీవడిగిన మాట చాలా బాగున్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును. సత్త్వగుణము కలుగును. రాజా! సూర్యుడు తులారాశియందుండగా కార్తీకమాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసినను అవి అక్షయములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీకవ్రతమును తులాసంక్రమణము = సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని, కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని, ఆరంభించి నెలరోజులు చేయవలెను. ఆరంభమందు ఓ దామోదరా! నేను కార్తీకవ్రతము ఆరంభించుచున్నాను. దానిని నిర్విఘ్నముగా పూర్తిచేయుము అని సంకల్పము చేసి కార్తీకస్నానమారంభించ వలెను. కార్తీకమాసమునందు సూర్యోదయ సమయమున కావేరీనదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగుతుంది. సూర్యుడు తులారాశిని ప్రవేశించినతోడనే మూడులోకములను పవిత్రముజేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులందును, దిగుడు బావులందును, నూతులందును, చిన్నకాలువలందును హరి నివసించియుండును. కార్తీకమందు వ్రతము అన్ని వర్ణముల వారు చేయవచ్చును.

బ్రాహ్మణుడు కార్తీకమాసమందు గంగకుబోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళుచేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రములచేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలెను. తరువాత దేవర్షిపితృతర్పణ మాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచికట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానమాచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనముచేసి గాయత్రీజపము చేయవలెను. స్త్రీలు గౌరీజపము చేయవలెను. తరువాత ఔపాసనముగావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలోనుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రమమందు షోడశోపచారములతో పూజించవలెను. తరువాత కార్తీక పురాణమును పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వేదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనముగావించి, తరువాత పురాణకాలక్షేపమును చేయవలయును. సాయంకాలముకాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి, విష్ణ్వాలయమునందుగాని, శివాలయమునందుగాని, తన శక్తి కొలది దీపములుబెట్టి భక్ష్యభోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణుస్తోత్రమును గాని శివస్తోత్రమునుగాని పఠించి నమస్కారములాచరించవలయును. ఎవడు కార్తీకవ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తివర్జితమైన వైకుంఠమును బొందుచున్నాడు. పూర్వజన్మార్జితములున్ను ఈ జన్మార్జితములున్ను అయిన సమస్త పాపములు కార్తీకవ్రతమాచరించిన యెడల నశించును. బ్రాహ్మణుడుగాని, క్షత్రియుడుగాని, వైశ్యుడుగాని, శూద్రుడుగాని, ఋషీశ్వరుడుగాని, స్త్రీలుగాని భక్తి శ్రద్ధలతో కార్తీకవ్రతమును జేసిన యెడల వానికి పునరావృత్తిలేని వైకుంఠమునొందుదురు. ఎవ్వడు కార్తీకవ్రతమాచరించు వానిని చూచి సంతోషించునో వానియొక్క పగటికాలమందు ఆచరించిన పాతకము నశించును. ఇందుకు సందేహము లేదు.


ఇతి స్కాందపురాణ కార్తీకమహాత్మ్యే ప్రథమాధ్యాయ సమాప్తః

కామెంట్‌లు లేవు: