22, జులై 2020, బుధవారం

*స్వర్గమా.... భగవత్ అనుగ్రహమైన మోక్షమా*

_తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే_

స్వర్గలోకముల వుండే సుఖభోగములు తాత్కాలికమైనవని, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అక్కడికి పంపించబడిన జీవులకు, స్వర్గ లోక భోగములు అనుభవించిన తరువాత వారి పుణ్యం అంతా ఖర్చయిపోతుంది, అప్పుడు వారు, తిరిగి భూలోకానికి పంపించబడుతారు. ఈ విధంగా స్వర్గాది లోకములు పొందినా కూడా, దాని వల్ల ఆత్మ యొక్క సనాతన అన్వేషణ నెరవేరదు. మనందరమూ అనంతమైన పూర్వ జన్మలలో ఎన్నో సార్లు అక్కడికి వెళ్లి వచ్చాము, కానీ అనంతమైన ఆనందము కోసము ఆత్మ కున్న కోరిక తీరలేదు. అన్ని వైదిక శాస్త్రాలు ఈ విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి.

తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే
క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చలితః (భాగవతం 11.20.26)

"స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు."

స్వర్గహు స్వల్ప అంత దుఖదాఈ (రామాయణం)

"స్వర్గ ప్రాప్తి అనేది తాత్కాలికమైనది మరియు తర్వాత దుఖాలను తెచ్చేది."

ఎలాగైతే ఫుట్బాల్ బంతి, మైదానం అంతటా ఒక చోటి నుండి ఇంకో చోటికి తన్నబడుతుందో, మాయ అనేది, జీవాత్మను, భగవత్ విముఖం అవటం చేత అలాగే తన్నుతున్నది. కొన్ని సార్లు నిమ్న లోకాలకు వెళుతోంది, కొన్నిసార్లు ఉన్నత లోకాలకు వెళుతుంది. ఈ క్రింది మరియు పై లోకాల్లో తనకు లభించిన ఈ బహు విధములైన రూపములలో కేవలం మానవ రూపం మాత్రమే భగవత్ప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది. అందుకే దేవతలు కూడా మానవ జన్మ కోసమే పరితపిస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి. దీనితో వారు స్వర్గ లోకానికి వెళ్ళిన తప్పుని సరిదిద్దుకుని, ఈ సారి భగవత్ ప్రాప్తికై ప్రయత్నిద్దామనుకుంటారు.

దుర్లభం మానుషం జన్మ ప్రార్థయతే త్రిదశైరపి (నారద పురాణం)

"మనుష్య రూపంలో జన్మ చాలా చాలా అరుదు (దుర్లభము). దేవతలు కూడా దీన్ని కాంక్షిస్తారు." అందుకే శ్రీ రామ చంద్రుడు కూడా అయోధ్యావాసులకి ఇలా ఉపదేశం ఇచ్చాడు.

బడే భాగ మానుష తను పావా, సుర దుర్లభ సబ గ్రంథంహి గావా (రామాయణం)

"ఓ అయోధ్యావాసులారా, మీరందరూ మానవ జన్మ లభించినందుకు ఏంతో ఏంతో అదృష్ట వంతులు, ఇది చాలా చాలా దుర్లభమైనది మరియు స్వర్గ లోకవాసులు కూడా కోరుకునేది." 

*దేవతలే ఈ మానవ జన్మను ఇంతగా కోరుకుంటున్నప్పుడు మరి ఇక మనం మాత్రం ఆ స్వర్గ లోకాలని కోరుకోవటం ఏమి ప్రయోజనం? అందుకే, మనం పరమేశ్వరుడి పై భక్తి ద్వారా భగవత్ ప్రాప్తి కై నిమగ్నమవ్వాలి.*

కామెంట్‌లు లేవు: