18, అక్టోబర్ 2020, ఆదివారం

హసనాంబా దేవి ఆలయం

 ఆ దీపం కొండెక్కదు... నైవేద్యం పాడవదు!

హసనాంబా దేవి ఆలయం... మిగిలిన రోజుల్లో ఎంతో నిశ్శబ్దంగా ఉండే ఈ గుడి తలుపులు ఏడాదిలో పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే తెరచుకుంటాయి. ఆ కొద్ది సమయంలోనే అమ్మవారి చల్లని చిరునవ్వు తమపైన పడాలనే ఉద్దేశంతో భక్తులు ఎక్కడెక్కడినుంచో ఇక్కడకు వస్తారు. అదొక్కటే కాదు మరికొన్ని ప్రత్యేకతలూ ఉన్న ఈ ఆలయం కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఉంది.

మూడు రాళ్లరూపంలో కొలువైన హసనాంబాదేవి అంటే... చిరునవ్వులు చిందిస్తూ, తమ కష్టాలను పోగొట్టే దేవతగా భక్తులు భావిస్తారు. అమ్మ ఇక్కడ ఉండటం వల్లే జిల్లాకు కూడా హసన్‌ అనే పేరు వచ్చిందని అంటారు. ఈ ఆలయం తెరిచిన పది లేదా పన్నెండు రోజులు అయ్యాక గర్భగుడిలో పూలూ, నేతితో పెట్టిన దీపం, నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి ఆ తరువాత తలుపులు మూస్తారు. ఏడాది తరువాత మళ్లీ తలుపులు తెరిచేనాటికి కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే ఉంటుందట. అదే విధంగా పూలు కూడా మొదటిరోజు ఉంచినట్లుగానే తాజాగా కనిపించడం, నైవేద్యం కూడా ఏ మాత్రం పాడవ్వకుండా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని చెబుతారు. ఈ గుడిని 12 వ శతాబ్దంలో కట్టారని చరిత్ర చెబుతున్నా ఎవరు నిర్మించారనే దాఖలాలు మాత్రం లేవు.

స్థలపురాణం...

అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వడంతో తనకు మరణం లేకుండా ఉండేలా వరం ఇమ్మంటాడు. ఆ వరం వల్ల ప్రపంచాన్ని అల్లకల్లోలం చేయడం మొదలుపెడతాడు. ఇది తెలిసిన శివుడు యోగీశ్వరి అనే శక్తిని సృష్టిస్తాడు. అ శక్తి బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్తమాత్రికలతో కలిసి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ తరువాత సప్తమాత్రికలు కాశీ వెళ్లే ప్రయత్నంలో ఈ హసన్‌కి చేరుకుంటారు. ఈ ప్రాంతం నచ్చడంతో మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి ఈ ఆలయం ఉన్న ప్రాంతంలోని ఓ కొండలో మమేకం అయితే మరో ముగ్గురు దేవతలు దేవగిరి హోండ అనే ప్రాంతంలో ఉండిపోతారు. బ్రాహ్మి మాత్రం కెంచెమ్మన హాస్కోట్‌ పొలిమేరల్లో ఉందని అంటారు. అలా అప్పటినుంచీ ఈ ఆలయంలో అమ్మవారు మూడు రాళ్ల రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తోందట.

అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండటం వల్లే ఆమెను హసనాంబాదేవిగా పిలుస్తారట. అయితే... అమ్మ ఇక్కడ వెలసిన కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించి తనని ఏడాదికోసారి కొన్ని రోజులు మాత్రమే పూజించాలని చెప్పడంతో అప్పటినుంచీ అదే ఓ ఆచారంలా వస్తోందని ఆలయ నిర్వాహకులు చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించి మరో కథా ప్రాచుర్యంలో ఉంది. ఓ అమ్మవారి భక్తురాలిని ఆమె అత్త చిత్రహింసలు పెట్టేదట. అలా ఓ రోజు ఆ కోడలు గుడికి వచ్చినప్పుడూ అలాగే బాధపెట్టడంతో అమ్మకు కోపంవచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందనీ ఇప్పటికీ ఆ రాయి ఆలయంలోనే ఉందనీ అంటారు. ఏడాదికోసారి మిల్లీమీటరు చొప్పున జరిగే అమ్మ ఆ రాయిని చేరుకున్నప్పుడు కలియుగం అంతమవుతుందనేది స్థానికుల నమ్మకం. అదేవిధంగా మరోసారి నలుగురు దొంగలు ఈ ఆలయంలోని అమ్మవారి నగలు దొంగిలించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట. ఈ రాళ్లను కూడా స్థానికంగా ఉండే కల్లప్ప గుడిలో చూడొచ్చని అంటారు.

శివలింగాలూ...

అమ్మ చెప్పినట్లుగానే ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరచి బలిపాడ్యమి మర్నాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం, పూలు, దీపం సమర్పించి మూసేస్తారు. ఆలయం తెరచిన రెండోరోజు నుంచీ అమ్మను దర్శించుకునేందుకు వేలాది భక్తులు వివిధప్రాంతాల నుంచి తరలి వస్తారు. ఆలయం తెరిచిన సమయంలో ఇక్కడ జరిగే నిత్యపూజల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అదే విధంగా 101 శివలింగాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు.

ఎలా చేరుకోవచ్చు....

ఈ ఆలయం హసన్‌ జిల్లాలో ఉంది. విమానంలో రావాలనుకునేవారు మంగళూరు వచ్చి అక్కడి నుంచి ఆలయానికి క్యాబ్‌, బస్సుల ద్వారా చేరుకోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా రావాలనుకునేవాళ్లు మైసూర్‌, బెంగళూరు, మంగళూరు, చిక్‌మగళూరు... ఇలా ఎక్కడినుంచైనా రావొచ్చు. రైల్లో వచ్చేవారు అర్సికెరె స్టేషన్‌లో దిగి... అక్కడి నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆలయానికి బస్సులో చేరుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: