5, నవంబర్ 2020, గురువారం

తుంగభద్ర పుష్కరాలు

 *తుంగభద్ర పుష్కర సమాచారపు మెసేజ్ 1*

🌅💐🌹🌈☔🍇🔥📗🙏

*తుంగభద్రా నది పుష్కరములు.*


*తుంగభద్రమ్మ చెంతలో పుష్కరుడు తేదీ.20.11.2020 (శుక్రవారము) నాడు చేరి తేదీ.01.12.2020 (మంగళవారము) వరకు ఉంటున్నాడు.  జీవనదిగా పేరున్న "తుంగభద్రమ్మ '' పుష్కరాలకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.*


భారతదేశపు పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రములోని సహ్యాద్రి పర్వతముల మీదుగా ప్రవహించి *"గంగ మూల''* వద్ద మొదటగా తుంగ, భద్ర లు రెండు వేరు వేరు నదులుగా  పేరొంది అక్కడ నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రంలో *" కూడలి ''*  వద్ద ఒకటిగా కలిసి *" తుంగభద్ర నదిగా ''*  రూపాంతరము చెంది శృంగేరి , హౌస్ పేట్(తుంగభద్ర) రిజర్వాయర్లలో మజిలీ చేసి  హంపి మీదుగా ప్రవహిస్తూ బళ్ళారి జిల్లాలో ప్రవహించే *" హగరి ''*  నదిని కలుపుకొని అక్కడి నుండి 250 కిలోమీటర్లు ప్రవహించి , కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లోని కౌతాళం మండలము *" నదిచాగి ''*  అనే గ్రామము నుండి  ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టింది. 


అక్కడనుండి రామాపురం, మంత్రాలయం, నాగలదిన్నె ,గురజాల, సంఘాల, గుండ్రేవుల , ఈర్లదిన్నె, కే సింగవరం, *" కొత్తకోట రాఘవేంద్ర స్వామి మరియు గుంటి రంగస్వామి దేవాలయముల సమీపములో ''*  నుండి సాగుతూ  *" సుంకేసుల (కోట్ల విజయభాస్కర్ రెడ్డి) రిజర్వాయర్లో ''* సేదతీరి ఆర్. కొంతలపాడు, జి సింగవరం, మామిదాల పాడు, కర్నూలు నగరముల మీదుగా ప్రవహించి  *" అలంపూర్ క్షేత్రానికి ''*  ఆరు కిలోమీటర్ల దూరములో *" సంగమము ''* వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.ఈ నది మొత్తము ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దులలో దాదాపు 85 మైళ్ళ దూరము పప్రవహించుచున్నది.


*తుంగభద్రా నది ''*  అతి ప్రాచీనమైన మహానది. అత్యంత పురాతనమైనది అని చెప్పవచ్చు. ఇందుకు రామాయణ కాలముకంటే ముందుగానే నదీ ఉండేదిని చెప్పడానికి ఆధారాలున్నాయి.


 వాల్మీకి రామాయణములో *" శ్రీరాముడు ''* సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవునితో చెలిమి చేసిన *" ఋష్యమూక పర్వతము ''*  తుంగభద్రా నది తీరంలోని నేటి *" హంపి  క్షేత్రములో ''*  ఉన్నది.  రామాయణములో పేర్కొన్నందున తుంగభద్రా నది రామాయణ కాలముకంటె ముందునుంచే ఉన్నట్లు మనకు స్పష్టమవుతున్నది.


*తుంగభద్రా నది పరివాహక ప్రాంతములో అనేక " ఔషధ లక్షణములు '' గల వృక్షములు ఉన్నాయని  ఈ వృక్షముల మీదుగా ప్రవహించిన నీరు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నదని చెబుతారు. ఉత్తరాదిన స్నానమునకు " గంగ '' ఎంత ముఖ్యమైనదో, పవిత్రమైనదో దక్షిణమున "తుంగ '' అంతటి ముఖ్యమైన, ఔషధ లక్షణములుగల నీరు కలిగినదని ప్రఖ్యాతి పొందినది.*


*అందువలననే " గంగా స్నానము తుంగా పానము '' అనబడే నానుడి పుట్టినది.*


భారత కాలమానము ప్రకారము దేశము లోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయములో  వస్తాయి. బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్నంతకాలము ఆ నదిలో పుష్కరము ఉన్నట్లు లెక్క. ఒక సంవత్సర కాలముపాటు ఆయా రాశుల్లో ఉండటము జరుగుతుంది. ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగాను, సంవత్సరములోని చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగాను పిలుస్తారు. మొదటి, చివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడము జరుగుతున్నది.

కామెంట్‌లు లేవు: