5, నవంబర్ 2020, గురువారం

మహా కాలభైరవ ఆవిర్భావం - క్షేత్రాలు*

 *శ్రీ మహా కాలభైరవ ఆవిర్భావం - క్షేత్రాలు*



*‘‘కాలభైరవా నమోస్తుతే –  కాశీ విశ్వేశ్వరా నమోస్తుతే”*


ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది.


*👉కాలభైరవ ఆవిర్భావం*

ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్తా వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు ‘నేను సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి’ అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు.


దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, మూడు నేత్రాలతో, త్రిశూలము, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు.


హుంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞమేరకు కారభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్యన ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు.


*‘నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం సోకింది. కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి.. అని శివుడు సలహా ఇచ్చాడు.*


*కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకుడు*


కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ను ప్రార్థించుతాడు.


అందుకు *‘‘కాలభైరవా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది"* అని సలహా మహావిష్ణువు ఇచ్చాడు.


దీనితో కాలభైరవుడు కాశీచేరుకున్నాడు. ఆయనకు బ్రహ్మహత్యాదోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశిలో పూడ్చి పెట్డాడు. బ్రహ్మ కపాలం పూడ్చి పెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని *‘కపాల మోక్ష తీర్థం’*


తర్వాత కాలభైరవుని చూసి శివుడు *‘కాలభైరవా! నీవు ఇక్కడే కొలుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.’* అని శివుడు పలికాడు. దీనితో  కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువు దీరి క్షేత్రపాలకునిగా పూజలందుకొంటున్నాడు.


*కాలభైరవ ఆరాధన*


కాశీక్షేత్రాన్ని దర్శించినవారు శ్రీకాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది.


కాశీ క్షేత్రానికి వెళ్లి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజానంతరం ఒక శునకమును కాలభైరవస్వామిగా భావించి  పసుపుకుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు.


ఈ ఏడాది డిసెంబరు 15వ తేదీన కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజించిన తరువాత షోడశోపచారాలతోను, అష్టోత్తరాలతోను శ్రీ కాలభైరవ స్వామిని పూజిస్తారు. మినపవడలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఒకపూట ఉపవాసం చేస్తారు.


*భైరవుని రూపాలు :…*

కాల భైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ

ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, శంబర భైరవ, మహా భైరవ, చండ భైరవ అనే రూపాలు కుడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలు కూడా ఉండడం విశేషం…. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.



*కాలభైరవాష్టకం పఠించడం పుణ్యప్రదం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ ‘కాలభైరవాష్టకం’ కూడా ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇలా కారభైరవాష్టమి నాడు శ్రీకాలభైరవ స్వామిని స్మరించడం, పూజించడం వల్ల సకల పుణ్యఫలాలు కలుగుతాయి. శ్రీకాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్నభయాలు దూరమవుతాయి. గ్రహ దోషాలు తొలగిపోతాయి.*


*🙏కాలభైరవాష్టకం:*


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||


కాల భైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కాని ఆయనకు చాలా విశిష్టత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపసానతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నయి. కాల భైరవుడిని కాశి క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాదించాలన్నా ముందుగా అయన అనుమతి తీసుకోవాలని "కాశి క్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాల భైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. హోమ కార్యాలలో అష్టాభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతింద్రమైన శక్తులని అయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి బెల్లం నైవేద్ద్యం పెడతారు. ఈశ్వరుడు ఆయుషును ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధీయుడైన కాల భైరవుడిని ఆరాదిస్తే ఆయుష్షు పెరుగుతుందని ప్రతీతి.


*🙏శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..*


*1. వారణాసి (ఉత్తరప్రదేశ్)*


కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు.


*2.ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :*


గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది. ఇక్కడి స్వామి విగ్రహం మద్యం (అల్కాహాల్) ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము.


*3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :*


ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పై కప్పుగా పెంకులతో కన్పిస్తుంది.


ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి..


1. వనభైరవుడు

2. జటాభైరవుడు

3. గధాభైరవుడు

4. తాండవభైరవుడు.


*4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :*


ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు 'మహాభైరవుడు' లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం.


నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి.


*5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణ లో కామారెడ్డి జిల్లా) :*


సుమారు 11 వ శతాబ్దంలో స్వామి వారి ఆలయం నిర్మించబడింది.


దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది.


ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది.


*6. రామగిరి (ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా) :*


ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి.  ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది.


*7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :*


ఎచ్చటా కానరాని సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు, ఒక శివలింగం, స్థానిక చెంచుల దేవుడైన నిరాకార 'బయన్న' దర్శనమిచ్చును.


*8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :*


ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా పైకి మెట్లు నిర్మించబడి, చుట్టూ మండపంతో ఓపేన్ ఎయిర్ లో భైరవుడు దర్శనమిస్తాడు..


*9. ఖాట్మండు (నేపాల్) :*


నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు..


అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తారు.


*10. భైరవకొండ (ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు జిల్లా) 


ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువై ఉంటారు. అమ్మవారికి శిరస్సు మాత్రమే ఉంటుంది. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 - 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.


*11. తిరువైసనల్లూరు (తమిళనాడులో కుంబకోణం) :*


ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.


*12. న్యూడిల్లి :*


ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.


*13.ధున్నాస్(ఉత్తరప్రదేశ్):*


ఇచ్చట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచ్చట నుండి కొంచెం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు.


*14. మున్నంగి (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లాలో) :*


స్వయంభువులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు.


*15. భైరవపాడు (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లా):*


స్వయంభువులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు.


*16. అధియమాన్ కొట్టాయ్ (కర్నాటక లోని ధర్మపురి జిల్లా) :*


9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.


*17. కచ్ఛాద్రి (కర్నాటకలోని కొల్లూర్ దగ్గర) :*


ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.


అందరం భక్తితో *" ఓం శ్రీ కాలభైరవాయ నమః  "* అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం. ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ భగవంతుడు.


*ఓం శ్రీ కాలభైరవాయ నమః*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: