29, జనవరి 2021, శుక్రవారం

మన మహర్షులు - 7

 మన మహర్షులు - 7


ఉదంక మహర్షి

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఉదంక మహర్షి భృగువంశంలో పుట్టాడు. గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు. 


చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ

మహర్షి చెప్పలేదు. ఉదంకుడు కూడ అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు. 


ఒకసారి అడవినుంచి కట్టెల మోపు తీసికొచ్చి కిందపడేసినప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకుని కట్టె పుల్లలతో పాటు ఊడి వచ్చేసింది. ఆ ఊడిపోయిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు అయ్యో! నా బాల్యం, యౌవనం అంతా ఇక్కడే గడిచిపోయింది. నా చదువు ముసలితనం వచ్చినా పూర్తవలేదని బాధపడ్డాడు.


గౌతమ మహర్షి ఉదంకుణ్ణి పిలిచి నాయనా ! బాధపడకు నీ గురుభక్తిని పరీక్షించాను నీ ముసలితనం పోయేలా చేస్తాను. అని చెప్పి తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు.


మన ఉదంకుడు అంతటితో ఊరుకున్నాడా.... స్వామీ ! మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. గౌతమ మహర్షి నీ గురుభక్తియే నాకు గురుదక్షిణ. ఇంకేమీ వద్దు నాయనా ! అన్నాడు. 


ఉదంకుడు గురువుగారి భార్యను అడిగాడు.... మిత్రసహుడు అనే మహారాజు భార్యకి కుండలాలు ఉన్నాయి, అవి నాకు కావాలి అనడిగింది ఆవిడ.


ఉదంకుడు బయలుదేరి మిత్రసహుడనే రాజు దగ్గరకి వచ్చాడు.


ఉదంకుడు మహారాజా ! నీ భార్య కుండలాలు నాకు ఇప్పించు. అవి నా గురువుగారి భార్యకి ఇవ్వాలి .అని అడిగాడు..


పరససాధ్వి అయిన రాణి ఉదంకుడు శుచియై వచ్చిన తర్వాత మాత్రమే దర్శనమిచ్చి ఆనందం గా తన కుండా లాలను తీసి ఇస్తుంది.


మిత్రసహమహారాజు ఉదంక మహర్షిని మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. భోజనం చేస్తుండగా అన్నంలో తలవెంట్రుకలు వచ్చాయి. 


ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడయిపోతావని శపించాడు. రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు. ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు. 


ఉదంక మహర్షి కుండలాల్ని ఒక పట్టుబట్టలో చుట్టుకొని తీసికెడుతున్నాడు. మధ్యలో ఆకలికి ఆగలేక ఒక చెట్టెక్కి ఆ మూటని ఒక కొమ్మ మీద పెట్టి పండ్లు కోసుకుంటున్నాడు ఆ మూట క్రింద పడిపోయింది


ఆ మూటని ఒక నాగరాజు తీసికుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టిని తవ్వడం మొదలెట్టాడు. ఇది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉదంకా ఆ కుండలాలు పాతాళలోకంలో ఉన్నాయి. నువ్వు పడుతున్నది అనవసర శ్రమన్నాడు. ఉదంకుడు ఎక్కడ ఉన్నా సరే అవి నా గురువుగారి భార్యకివ్వాల్సిందే అని మళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు.


అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి వున్నంత శక్తినిచ్చాడు. అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చేసింది. పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఉదంకుడు నాగుల్ని ప్రార్థించాడు.


ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళనీ, చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులనీ, పెద్ద గుఱ్ఱమెక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాడు. వాళ్ళు నీకేం కావాలో అడగమన్నారు


ఉదంక మహర్షి ఈ నాగులన్నీ నాకు వశమయిపోవాలన్నాడు. అయితే నువ్వు ఈ గుఱ్బం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు. ఉదంకుడు అలా చెయ్యగానే పాతాళలోకమంతా కూడ మంటలు వచ్చేశాయి. తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తెచ్చి ఉదంకుడకి ఇచ్చేసింది.


 ఉదంకుడు దివ్యాశ్వం  మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు. గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తిచేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది.


ఉదంక మహర్షి గురువుగార్ని దివ్యపురుషుడు, ఆరుగురు కుమారులు, తెలుపు నలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు స్త్రీలు వీళ్ళందరూ ఎవరు స్వామీ? అని అడిగాడు గౌతమ మహర్షి నాయనా ! ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు, ఆరుగురు


కుమారులున్నారే వాళ్ళు ఆరు ఋతువులు, ఆడవాళ్ళని ఇద్దర్ని చూశావు కదా! అది రాత్రి పగలు, ద్వాదశ చక్రం చూశావు కదా అది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గజ్జం. ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. 

ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమన్నాడు.


ఆ తర్వాత కాలం లో ఉదంకుడు జనమేజయ మహారాజుతో సర్పయాగం చేయించాడు. అస్తీక మహర్షి వచ్చి ఆ యాగం ఆపించి నాగుల్ని రక్షించాడు.


ఉదంక మహర్షి శివుడ్ని గురించి గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నువ్వు లోకం కోసం మంచి పనులు చేస్తూ జీవించు అని దీవించాడు ఉదంకుణ్ణి.


ఆ కాలంలో  ధుంధుడు అనే రాక్షసుడు   బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని, గంధర్వుల్ని., రాక్షసుల్ని అందర్నీ చంపేస్తున్నాడు. సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ వుండేవాడు. వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్దగాలి దుమారం లేపేది. అది వచ్చినప్పుడు ఏడు రోజులదాకా చెట్లు ఊగుతూనే ఉండేవి. అందరూ చాలా భయపడ్తున్నారని ఉదంక మహర్షి బృహదశ్వుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుణ్ణి చంపించమని అడిగాడు. బృహదశ్వుడి కొడుకు కువలాశ్వుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుణ్ణి చంపేశాడు

కామెంట్‌లు లేవు: