29, జనవరి 2021, శుక్రవారం

ఋచీక మహర్షి

 మన మహర్షులు -8



 ఋచీక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


మహానుభావుడైన ఔర్వుని కుమారుడే   మన ఋచీక మహర్షి.


ఋచీక మహర్షి బ్రహ్మచారిగా ఉండి గొప్ప తపశ్శక్తిని సంపాదించాడు. 


ఒకనాడు గాధి అనే రాజు కూతురు సత్యవతిని పెళ్ళి చేసుకునేందుకు నిశ్చయించుకొని గాధి రాజు దగ్గరికి వెళ్ళి తన కోరిక చెప్పాడు.


పాపం గాధిరాజు గారికి ఋచీక మహర్షికి తన కూతురు సత్యవతినిచ్చి పెళ్ళి చేయ్యాలంటే బాధగా అనిపించింది. కాని ఏం చేస్తాడు? మహర్షి అడగడానికి వచ్చాడంటే అదేదో భగవంతుడే సంకల్పించి వుంటాడనుకుని ఎందుకయినా మంచిదని ఒక షరతు పెట్టాడు మహర్షీ ! నువ్వు వాయువేగంతో సమానమైన వేగం వున్నవి, నల్లని చెవులు

తెల్లని శరీరాలు వున్న వెయ్యి గుర్రాలు తీసుకురా, అప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఋచీక మహర్షి సరేనని వెళ్ళిపోయాడు.


ఋచీక మహర్షి ఇలాంటి గుర్రాలు ఎక్కడ ఉంటాయో తెలియక తిరిగి, తిరిగి అవి వరుణదేవుడి దగ్గర ఉన్నాయని తెలుసుకున్నాడు.


 వెంటనే తన తపశ్శక్తితో వరుణలోకానికి వెళ్ళి వరుణుడికి వచ్చిన విషయం చెప్పాడు. 


వరుణదేవుడు ఋచీక మహర్షికి నమస్కారం చేసి, కబురు చేస్తే నేనే పంపించేవాడిని కదా! అని చెప్పి 'తురంగ తీర్థం'లో స్నానం

చేయించి వెయ్యి గుర్రాలు ఇచ్చి పంపాడు. 


వెయ్యి గుర్రాలను తీసుకుని గాధి మహారాజుకిచ్చి అతని కూతురు సత్యవతిని వివాహం చేసుకున్నాడు ఋచీక మహర్షి.


ఋచీక మహర్షి భార్యను తీసుకుని ఒక ఆశ్రమంలో ఉంటూ సంతానం కలగడానికి వేదమంత్రాలతో అగ్ని దేవుడికి ఆహుతి చెయ్యడానికి తయారు చేసిన అన్నం భార్యచేత తినిపించాలనుకున్నాడు


స్వామీ! నా తల్లికి కూడ ఒక కొడుకుని ప్రసాదించండి అంది సత్యవతి. ఈ అన్నం మేమిద్దరం తింటాము అని చెప్పింది.


 ఋచీక మహర్షి ఇద్దరికి విడి విడిగా పెట్టి పండ్లు మొదలయినవి తెచ్చుకోడానికి అడవికి వెళ్ళాడు.


ఆయన వచ్చేలోపు హడావిడి గా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఆ హావిర్భాగం తినేశారు... ఆ తొందరలో ఒకరిది మరొకరు తీసికొన్నారు..


ఋచీక మహర్షి ఇంటికి వచ్చి జరిగింది తెలుసుకుని భార్యని పిలిచి మంత్రజలం చల్లిన అన్నాన్ని, నేను చెప్పినట్లు కాకుండ మార్చుకుని తిన్నారు. నీకు క్షత్రియ థర్నాలున్న కొడుకు, నీ తల్లికి వేదాంతవేది, మహాతపస్సంపన్నుడు అయిన కొడుకు పుడతారు అన్నాడు.


 సత్యవతి భయపడి క్షమించమని భర్తని వేడుకుంది.


 ఋచీక మహర్షి జరగవల్సింది

జరిగిపోయింది. ఇది దైవ నిర్ణయం ఇంక చెయ్యగలిగింది ఏమీ లేదు అన్నాడు


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని అనే కొడుకు, ఆమె తల్లికి విశ్వామిత్రుడు అనే కొడుకు పుట్టారు. 


 ఋచీక మహర్షి సంసారం వదిలి పెట్టేసి భగవంతుడిలో చేరిపోవడానికి బయలుదేరాడు. 


వెడుతూ వెడుతూ సత్యవతికి శాశ్వతంగా నదీరూపంలో ఉండేలా వరం ఇచ్చాడు.


 ఆ నదే కౌశికీ నది. గొప్ప పుణ్య తీర్థంగా పేరు పొందింది


చదివేశారా... ఋచీక మహర్షి గురించి!


చూసారా మరి  పెద్దవాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే ఎన్ని అనర్ధాలు జరిగిపోతాయో ..


అందుకే చక్కగా పెద్దవాళ్ళు చెప్పినట్లు వినాలన్న మాట....


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: