2, ఆగస్టు 2023, బుధవారం

చిత్రగుప్తుడి జననం

 నిత్యాన్వేషణ: 


చిత్రగుప్తుని జన్మ వృత్తాంతమేమిటి?

చిత్రగుప్తుడి జననం చాలా రకాలుగా వర్ణించబడి ఉన్నా ఆయన బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అనేది కథనాలన్నింటిలో కనిపించే ఉమ్మడి సారాంశం. బాగా ప్రాచుర్యం చెందిన కథ ప్రకారం బ్రహ్మ యమలోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరికి వచ్చే అనేక ఆత్మలను నియంత్రించ లేక అప్పుడప్పుడూ వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. బ్రహ్మ యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు కానీ ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు నిర్వహించడం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసే సరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం, కాగితం పట్టుకుని కనిపించాడు. చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు కాబట్టి ఆయనకు జన్మించిన వారసులను కాయస్థులు ఆని వ్యవహరిస్తారు.మొదటగా బ్రహ్మ మనసులో ఆలోచనగా మొదలై (చిత్ర), మిగతా దేవతలకు తెలియకుండా (గుప్తంగా) సృష్టించబడ్డాడు కాబట్టి అతని పేరు చిత్రగుప్తుడు అయ్యింది.

ఈ భూలోకంలో దుష్టశిక్షణగావించి ధర్మ స్ధాపన చేయదలిచాడు. పాపాలు చేసినవారిని కఠినంగా శిక్షించి నీతి నియమాలను కాపాడే భాధ్యతను యమధర్మరాజుకు అప్పగించాడు. కానీ ఈ లోకంలోని పాపుల సంఖ్య పెచ్చు పెరిగి విధి నిర్వహణ అసాధ్యం కాగా యమ ధర్మరాజు తనకొక సహాయకుని ఏర్పాటు చేయమని మొరపెట్టుకున్నాడు.

అప్పుడు పరమేశ్వరుడు ఒక బంగారు పళ్ళెంలో ఒక రూపాన్ని చిత్రీకరించాడు. ఆవిధంగా చిత్రం నుండి ఆవిర్భవించినవాడే చిత్రగుప్తుడు. పరమశివుడు చిత్రగుప్తుని కి మానవుల పాప పుణ్యాలు లెక్క కట్టి యమ ధర్మరాజు వద్దకి తీసుకుని వెళ్ళే బాధ్యతను అప్పజెప్పేడు.

చిత్రగుప్తుని పాప పుణ్యాల లెక్క ప్రకారం యమధర్మరాజు శిక్షలు విధించి వాటిని సక్రమంగా అమలుపర్చి ధర్మాన్ని పరిరక్షిస్తూంటాడు. అటువంటి ఒక గొప్ప భాధ్యతాయుతమైన విధిని నిర్వహించే చిత్రగుప్తుడు హిమాలయా పర్వతాలలో సుదీర్ఘకాలం తపస్సు చేసి అనేక శక్తులు సంపాదించాడు.

అటువంటి చిత్రగుప్తునికి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదిగా ప్రసిధ్ధి పొందిన కాంచీపురంలో ఒక దేవాలయం (నెల్లుక్కారర్ వీధిలో) నిర్మించబడి వున్నది. 9 వ శతాబ్దానికి చెందిన చోళరాజులు ఈ అపూర్వ ఆలయాన్ని నిర్మించారు.

కాంచీపురం ఒక్క చోటనే చిత్రగుప్తుని కి ప్రత్యేక ఆలయం వున్నది. మూడు అంతస్తుల రాజగోపురం గల ఈ ఆలయంలో చిత్రగుప్తుడు కుడిచేత ఘంటం, ఎడమచేత తాళపత్రాలు ధరించి ఆశీనముద్రలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు.

ఇక్కడ చైత్రమాసంలో చిత్రగుప్తునికి ఉత్సవాలు చేస్తారు. చైత్ర పౌర్ణమికి ముందు రోజు చతుర్దశినాడు చిత్రగుప్తునికి కర్ణకిదేవితో వివాహోత్సవం జరిపి పౌర్ణమినాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపుతారు. ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ కి సమీపమున రాజవీధిలో వున్నది.

కామెంట్‌లు లేవు: