30, సెప్టెంబర్ 2023, శనివారం

పూజగదిలో దేవతామూర్తులు -*

 *పూజగదిలో దేవతామూర్తులు -*


చిన్నకథ


అదో చిన్న పల్లెటూరు. పట్టుమని పది బ్రాహ్మణ కొంపలు కూడా లేవు. ఉన్నవాళ్లందరికీ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో వాటిని వదలలేక అక్కడే స్థిరపడి పోయారు. శాస్త్రిగారు ఆ ఊరి పండితులు. పరమ నిష్ఠాగరిష్టుడు. వాళ్ళ తాతముత్తాతల నుంచి వస్తున్న శివపంచాయతనం వుండేది. శాస్త్రిగారు రోజూ నమక చమకములతో శివునికి అభిషేకముచేసి శ్రద్దగా పూజచేస్తూ వుండేవారు. ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి.


అమ్మగారికి వంటలు చేయడం బాగా వచ్చు. ఆమె వండిన పదార్థం తినని వాడు ఆ ఊరిలోనే ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. వారికి అష్టైశ్వర్యాలూ ఉన్నాయి. తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు చూసుకుంటూ అక్కడి ప్రజలలో తలలో నాలుక అయి పోయాడు.


పూజగదిలో సామాను సిద్ధం చేస్తోంది శ్రద్ధాదేవి. ఆయన పక్కన కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. పూజా మందిరం లోని వస్తువులు, బొమ్మలు అన్నీ పాతబడి పోయాయి. వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుపు రావడం లేదు. "ఈ సారి తీర్థం లో అన్నీ కొత్త బొమ్మలు, సామాన్లు కొనుక్కుందాము శ్రద్ధా!" అంటున్నాడు భార్యతో..


సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చాడు. ఆయన రూపురేఖలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. తొలుత ఆయనను చూసి భయపడింది శ్రద్ధాదేవి. అంతలో ఆ వచ్చిన అతిథి 'అమ్మా! నాకు కొంచెం అన్నం పెడతావా, ఆకలి అవుతోంది' అని గట్టిగా అడిగాడు.


'అలాగే స్వామీ! ఇదిగో సిద్ధం చేసేస్తున్నాను. పిండి వంట (గారెలు) సిద్ధం చేస్తున్నాను. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి స్వామీ' అని సమాధాన పరచింది ఆ ఇల్లాలు. శర్మగారు చదువుకుంటున్న భాగవతం పక్కన పెట్టి ఆయనను ఇంటిలోనికి రమ్మన్నాడు.


రాలేను, ఇక్కడే ఈ అరుగుమీద కూర్చుంటాను. ఇక్కడే నాకు భోజనం పెట్టండి' అన్నాడు ఆ స్వామి. సరేనన్నాడు శర్మగారు. వంట అవుతోంది. ఆమె వీలయినంత తొందరగా చేసి పెట్టాలనే ఉద్దేశ్యంతో కంగారు పడుతోంది. పిండివంట మొదలు పెట్టింది. గారెలు వేసి పూర్తవగానే భోజనానికి సిద్ధం కమ్మంది.


బయట అరుగుమీదే నేలంతా శుభ్రం చేసి పెద్ద అరటి ఆకు వేసి, వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది. భోజనం మొదలు పెట్టాడు స్వామి. ఒక్కొక్క పదార్థామూ దగ్గర ఉండి అపర అన్నపూర్ణా దేవిలా వడ్డిస్తోంది ఆమె. మీరు అక్కడ కూర్చోండి అమ్మా! శర్మగారు వడ్డిస్తారులే' అన్నా వినకుండా ఆమే వడ్డిస్తోంది.


వండి వడ్డించిన పదార్థాలన్నీ సుష్టుగా తిని విశ్రాంతి తీసుకోకుండానే బయలుదేరడానికి సిద్ధమయ్యాడు స్వామి. ఆయన ప్రవర్తనకు ఆశ్చర్యపోయారు శర్మ గారు. వృద్ధాప్యంలో లేడు, కానీ వంటినిండా - జడలు కట్టిన పొడవైన జుట్టుతో - చూడడానికి వికృతంగా ఉన్నాడు, భాషలో కూడా మర్యాద లేదు, తినే పద్ధతికూడా సభ్యతగా లేదు, తిన్న తరువాత ఎవరూ కూడా విశ్రాంతి తీసుకోకుండా వెళ్లిపోరు. ఈయన ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకొన్నాడు.


ఒక్క మాట స్వామీ! మీరు ఎక్కడి వారు? ఇక్కడికెందుకు వచ్చారు? నా ఇంట భోజనానికి వచ్చి లోనికి రాకుండా బయట కూర్చుని ఎందుకు తింటానన్నారు? తిన్న వెంటనే ఎందుకు వెళ్లిపోదామనుకుంటున్నారు? దయచేసి చెప్పండి" అన్నారు శర్మగారు.


నేనెవరో నీకు చెప్పినా నీకు అర్థం కాదిప్పుడు. ఈ వీధిలో వెళ్తుండగా మీ మాటలు వినిపించాయి. పూజకు సామాను సిద్ధం చేసుకుంటూ మీ మాటలు వినపడుతున్నాయి. ఇక్కడైతేనే నాకు మంచి భోజనం దొరుకుతుంది అని అనిపించింది. అందుకే ఇక్కడ ఆగి భోజనం చేశాను. ఇంతకంటే నేనేమీ చెప్పలేను' అంటూ వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్లిపోయాడు ఆ స్వామి.


ఏమీ అర్థం కాలేదు ఆ దంపతులకు. సరే భోజనం ముగించారు. ఎందుకో ఓ సారి వారి పూజగదిలోని సామానును మళ్ళీ చూసుకున్నారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ వస్తువులన్నీ మెరిసిపోతున్నాయి. ఇంతక్రితమే కదా వాటిని ఎంత తోమినా మెరుపు రావడం లేదు అనుకున్నాము. ఆ స్వామి 'మీ మాటలు విని భోజనానికి వచ్చాను' అన్నాడు. అంటే ఆ స్వామికి ఆ పూజ గదిలోని సామగ్రిని తీయివెయ్యడం ఇష్టం లేదన్న మాట.


అంటే నేను రోజూ కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్తలు చెప్పడానికి వచ్చాడన్నమాట. సామగ్రిని మార్చేస్తాననే మాట ఆయనకు ఇష్టం లేదన్నమాట. అందుకే లోనికి రాలేదు" అనుకొని వెంటనే బయటకు వచ్చి ఆ చుట్టుపక్కల చూశాడు. స్వామి కనపడలేదు. ఆ వీధుల్లో ఉన్నవారిని అడిగాడు. అందరూ కూడా ఆయనను చూడలేదనే చెప్పారు.


శాస్త్రిగారి గుండె గుభేలుమన్నది. అప్పుడు అర్ధమైనది. ఇంట్లో పూజా మందిరములోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో, వాటివలనే గదా ఇన్నాళ్లూ ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు! ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని అనుకోని తన పూజామందిరము లోనికి వెళ్లి ఆ పరమశివుని విగ్రహం ముందు ప్రణమిల్లి, కృతజ్ఞతతో


*“ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః”* అని చెంపలువేసుకొన్నాడు. భగవంతునిపై నమ్మకము శ్రద్ధ అవసరము. పూజా మందిరములో వున్న విగ్రహాలు ఎంత పాతవైనా, అరిగిపోయినా వాటిని ముందు వెనుకా ఆలోచించకుండా తీసివేయ్యకూడదు. మన *తాత ముత్తాతలు* పూజించినవి అవి.


వాటిలో ఎంతో మంత్ర శక్తి దాగి వుంటుంది. వాటిని పారేయకండి. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి, అవి చైతన్య వంతమౌతాయి. మిమ్మల్ని మీకుటుంబాన్ని కాపాడుతాయి. ఒకవేళ ఆ వస్తువులు మరింత జీర్ణమై (అరిగి) పోతే (బంగారు, వెండి విగ్రహాలు) వాటిని కరిగించి, లేదా మార్చి అవే విగ్రహాలు మళ్ళీ కొనుక్కోండి.


అలాగే ఫోటోలు గానీ, పాత్రలు గానీ పాడయిపోతే మంచిరోజు చూసి వాటి తో బాటుగా అవే వస్తువులు కొత్తవి కొని, రెండింటినీ కలిపి ఒకటి, రెండు రోజులు పూజ చేసుకొని, ఒక శుభ దినాన వాటిని తీసుకెళ్లి ప్రవహించే నదిలో గానీ, సముద్రంలో గానీ విడిచిపెట్టండి. రహదారి పక్కన ఉంచరాదు. వాటిపై జంతువులు మలమూత్రములు విసర్జించే ప్రమాదం ఉంది. లేదా దొడ్డిలో లోతుగా గొయ్యి తీసి వాటిలో పాతిపెట్టండి.


*నా జీవితంలోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు!"* అని ఎప్పుడూ అనుకోండి.


*నేను శక్తిని అడిగాను - భగవంతుడు నాకు కష్టాన్నిఇచ్చి శక్తిని పొందమన్నాడు.*


*నేను సంపదను అడిగాను - భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.*


*నేను ధైర్యాన్ని అడిగాను - భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యంవహించమన్నాడు.*


*నేను వరాలు అడిగాను - భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.*


*నేను ఆయన ప్రేమను అడిగాను - భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు*.


*నేను జ్ఞానాన్ని అడిగాను - భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.*


*నేను పురోగతి అడిగాను - భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.*


*నేను లోకానికి మంచి చేసే భావన అడిగాను - భగవంతుడు ఇబ్బందులు కల్పించి వాటిని అధిగమించమన్నాడు.*


*నేను నన్ను మరచి పోకుండా సదా కాపాడు అని అడిగాను - భగవంతుడు భాధలు ఇచ్చి ఆయనను గుర్తుంచుకోమన్నాడు.*


*నేను చేసిన పాపాలు క్షమించమని అడిగాను - భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.*


అలా జీవితంలో *నేనుకోరుకున్నదేదీ పొందలేదు. కానీ నేను కోరుకున్నదానికంటే అతి గొప్పవి నాకు ప్రసాదించాడు ఆ పరమాత్మ.*


ఈవిధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటన నుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.

చివరకు ఏది జరిగినా నామంచికే అని అర్ధం చేసుకున్నాను.


*ఓం నమోభగవతే వాసుదేవాయ*

కామెంట్‌లు లేవు: