14, జనవరి 2024, ఆదివారం

భోగి పండుగ విశేషాలు



 భోగి పండుగ విశిష్టత.. 


భోగి పండుగ విశేషాలు తెలుసుకొనే ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. 


‣ పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. 

    దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, 

    ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. 

    మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం..


‣ "భుగ్" అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. 

    పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందనీ,  దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాధ.  

    శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాధ మనందరికీ తెలిసిందే.  అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. 

     కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే. 

    శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి, రైతుల పాలిట దైవాన్ని భూమికి దింపిన  రోజు ఇదే అనేది కూడా పురాణగాధ. 


    సాదారణంగా అందరు చెప్పేది - ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. 

    ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీయ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. 

    చలికాలం లో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషధంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీయ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen)  విడుదల అవుతుంది. ఈ ఔషద మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.


‣ కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పీలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దుండుగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.


‣ భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుసుకుందాం.


    భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల శిరస్సుల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతంలో పేరు. రేగి చెట్లు, రేగి పండు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అనీ, పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందనీ మన పెద్దల విశ్వాసం. 

    మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి.అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి అశీర్వదిస్తారు. 

    మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రాన ఆచార, సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.🙏🙏🙏

కామెంట్‌లు లేవు: