30, ఏప్రిల్ 2025, బుధవారం

పరశురామజయంతి

 🔯 *రేపు పరశురామజయంతి* 🔯


*అగ్రతశ్చతురో వేదాః పృష్ఠతస్సశరం ధనుః౹*

*ఇదం బ్రాహ్మ్యమిదం క్షాత్రం శాపాదపి శరాదపి॥*


‘ఇది భగవాన్‌ పరశురాముడి వ్యక్తిత్వానికి అద్దం పట్టే శ్లోకం.

పరశురాముడి ముందు భాగాన-అంటే ముఖంలో నాలుగు వేదాలు, వెనుక వైపున అంటే వీపు మీద బాణాలూ, విల్లూ. 

ఇదే బ్రాహ్మణత్వం! ఇదే క్షాత్రం! శాపాలు పెట్టడంలోనూ, శరాలను సంధించడంలోనూ! విడమరిచి చెప్పుకోవాలంటే... పరశురాముడిలో వేద విజ్ఞానం ఉంది. శపించే శక్తీ ఉంది. అది బ్రాహ్మణ లక్షణం. ఆయన వెనక వైపున విల్లూ, బాణాలున్నాయి. శరసంధానం చేసి తునుమాడే శక్తీ ఉంది. అది క్షత్రియ లక్షణం. 

అంటే పరశురాముడిలో బ్రాహ్మణత్వమూ, క్షత్రియత్వమూ పెనవేసుకుని ఉన్నాయన్నమాట! 

వేదవిజ్ఞానఖని అయిన బ్రాహ్మణుడిలాగా ఆయన శపించి, తపింపజేయగలడు. ధనుర్విద్యానిపుణుడైన క్షత్రియుడిలాగా శరపరంపర చేత పరలోకానికి పంపనూగలడు. భగవాన్‌ పరశురాముడిలో ఈ రెండు లక్షణాలూ మహా తీక్షణమైనవే. ద్విముఖమైన ఈ విశిష్ఠతతో బాటు ఆయనలో మరెన్నో విశిష్ఠతులున్నాయి.


పరశురాముడు శ్రీరామచంద్రుడి కన్నా ముందు జన్మించాడు. 

రామావతార సమయంలో ఉన్నాడు. రామావతారం ముగిసిన తర్వాత కూడా ఉన్నాడు. శ్రీకృష్ణావతార కాలంలో కూడా ఆయన ఉన్నాడు. 

అంటే రామాయణ కాలమైన త్రేతాయుగంలోనూ, భారత భాగవతాల కాలమైన ద్వాపర యుగంలోనూ పరశురాముడు సజీవంగా ఉన్నాడు. ఆయనకు రామయణంతోనూ మహాభారతంలోనూ ప్రత్యక్ష సంబంధంఉంది. పరశురాముడు శ్రీమహావిష్ణువు యొక్క ఆరవ అవతారం. ఆయన భృగువంశంలో అవతరించాడు. అందుకే ఆయనకు భార్గవరాముడు అనే నామధేయం కూడా ఉంది. భృగు వంశానికి మూల పురుషుడు. బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన భృగువు. భృగు మహర్షి భార్య పులోమ. ఆమె హిరణ్యకశ్యపుడి కూతురు. పులోమా భృగుమహర్షి దంపతుల కుమారుడు చ్యవనుడు. చ్యవనుడికి ఇద్దరు భార్యలు. సుకన్య ప్రథమ పత్ని. ద్వితీయ పత్ని ఆరుషి. ఔర్వుడు చ్యవనుడి పుత్రుడు. తల్లి ఆరుషి. తల్లి యొక్క ఊరువు(తొడ) నుండీ జన్మించిన కారణంగా చ్యవన పుత్రుడికి ఔర్వుడు అనే సార్థక నామధేయం లభించింది. ఔర్వునికి ఒక కుమారుడు కలిగాడు. ఆయన పేరు ‘రుచీకుడు’.రుచీకుడు విశ్వామిత్ర మహర్షి అక్కగారైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. సత్యవతీ రుచీక దంపతులకు జన్మించిన వాడే జమదగ్ని. జమదగ్ని భార్య రేణుక. జమదగ్నీ రేణుకల పుత్రుడే పరశురాముడు.

కామెంట్‌లు లేవు: