19, అక్టోబర్ 2025, ఆదివారం

ఐదు పండుగల కథ !

 * త్రయోదశి:* వాడుకలో ధన త్రయోదశి అంటూ, ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం.

కానీ ఈ రోజు "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీభగవాన్"

జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృతభాండంతో అవతరించాడు.

2. *నరకచతుర్దశి:* 

నరకయాతనల నుండి రక్షించ మని యముడి ప్రీతి కొరకు, పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి, మిగతా ఐఅన్ని దీపాలను వెలిగించాలి.

నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు.

ప్రాగ్జ్యోతిషపురం (నేటి అస్సాం) ను పాలించిన 'నరకుడు' నరరూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు. 

కానీ దేవికి వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అద్భుశక్తులను

సంపాదించి దేవతలను కూడా ఓడించాడు.

వాడు ప్రతీ *అమావాస్య*- *పౌర్ణమికి* నవయౌవన లైన రాజ కన్యలను దేవికి బలి ఇచ్చేవాడు. కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెఱసాలలో వేలాది అందమైన మహిళలు (రాజకన్యలు) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తితో జనించాడు.


శ్రీకృష్ణభగవానుడు - సత్యభామ (భూదేవి అవతారం) తో కలసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగ డైంది కావున ఇది 'నరక చతుర్దశి.'


3. *దీపావళి:* 

రావణసంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభసందర్భంగా దీపావళి జరుపు కోవటం, నరకుని బాధలనుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం.

దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూపం - జ్ఞానస్వరూపం. అందుకే మనం దీపావళిరోజు లక్ష్మీపూజలు చేస్తాము.

వ్వాపారులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.

4. *బలిపాడ్యమి:* 

వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దాన మడిగాడు.

వామనవటువుకు దాన మిచ్చాడు బలి, "ఇంతింతై వటుడింతై నభోరాశిపై నల్లంతై" అన్నట్లుగా ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు,' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు! సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి, మన మంతా సుఖశాంతులతో వుండా లని ఆశీర్వదించి వెళతా డట . ఇదీ ఆయనకు వామను డిచ్చిన వరం.


5. *యమ ద్వితీయ:*

సూర్యభగవానునికి యముడు, శనిదేవుడు ఇద్దరు పుత్రులు, యమున అనే ఒక పుత్రిక.

యముడు - యమున ఇద్దరూ అన్నాచెల్లెళ్లు కదా ! తన పని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మానుసారం వారి వారికి తగిన శిక్షలు విధించే పని) లో పడి పాపం చెల్లె లింటికి వెళ్లటం లేదు యముడు.

చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా! అని. కార్తిక శుద్ధ విదియ {మంగళవారం} రోజు తీరిక చేసుకుని తన చెల్లె లింటికి వెళ్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు.

చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది యమున - ఎవరైతే ఈ రోజు చెల్లెలి ఇంటికి వెళ్లి చెల్లెలికి కట్నం, కానుక లిచ్చి వాళ్లింట్లో భోజనం చేసి వస్తారో, వారికి యముని బాధలు లేకుండా చేయి అని.

ఈ యమునమ్మే యమునానది! కృష్ణ భక్తురాలు! *భగినీహస్తభోజనం* పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ

ఇప్పటికీ జరుపుకుంటారు. దీన్నే రామ ద్వితీయ, భ్రాతృ ద్వితీయ అనీ అంటారు.


ఇదీ ఐదు పండుగల కథ !

కామెంట్‌లు లేవు: