శివుడాజ్ఞ
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ఇది ఇప్పటి మాట కాదు మన తాత ముత్తాతలనుండి వస్తున్న నానుడి. నిజానికి ఈ చరాచర జగత్తుని మొత్తాన్ని నిర్మించేది, నడిపించేది, నిర్ములించేది ఆ పరమ శివుడే. నా దృష్టిలోకి వచ్చిన ఒక సంఘటన ఇక్కడ పొందుపరిచ ప్రయత్నిస్తాను.
చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక యదార్ధ గాధ.
నా మిత్రుడు వాళ్ళ తండ్రిగారు మరియు వారి బంధువర్గం కొంతమంది ఒక మెటాడోర్ వ్యాను ( ఇంతకుముందు ఉండేవి ఇప్పుడు అవి లేవు. అందులో 7-8 మంది ప్రయాణించే సదుపాయం ఉండేది.) తీసుకొని తీర్థ యాత్రలకు వేళ్ళ సంకల్పించారు. కాగా వారికి అందులో ఒక సీటు కాళీగా ఉండటంతో ఆ సీటుని నింపాలని మా స్నేహితుని తమ్ముని రమ్మని అన్నారు. దానికి అతను నాన్న నేను 10వ తరగతి పరీక్షలకు చదువుకుంటున్నాను కదా నేను చదువు వదిలి పెట్టి రాలేను అని జవాబు చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకా మెటాడోరులో ప్రయాణించే ఇతర బంధువులు చాల్లెరా నీ చదువు నీవు ఒక 4-5 రోజులలో నీ చదువు ఏమి పాడుకాదు సరదాగా అందరము వెళదాము ఆ సీటు ఎందుకు కాళీగా వదలటం రమ్మని బలవంతం చేశారు. పెద్దవాళ్ళ మాటలను కాదనలేక చివరి ఘడియల్లో బట్టలు సర్దుకొని వాళ్లతో ప్రయాణానికి సిద్దపడి వ్యాను ఎక్కాడు. వారి ప్రయాణం మొదలైయిన్ది . రెండు మూడు రోజులు చూడదలచిన ప్రదేశాలన్నీ చూసి చివరకు శ్రీశైలం నుండి వాళ్ళ వ్యానుతిరుగు ప్రయాణానికి బయలుదేరింది. శ్రీశైలం కొండలమీదినుంచి వ్యాను వస్తూవుంటే మధ్యలో డ్రైవరు అదుపు తప్పి వ్యానుని కంట్రోలు చేయలేకపోవడంతో వ్యాను బోల్తా పడ్డది . అందరికి గాయాలు అయ్యాయి కానీ మన 10 వ తరగతి చదువుతున్న మా స్నేహితుని తమ్ముడు మాత్రమే అక్కడికి అక్కడే మరణించాడు. విధి యెంత బలీయమైనదో చుడండి. ఇంట్లో చక్కగా పరీక్షలకు చదువుతున్న కుర్రవాడు యాత్రకు రానన్నా వినకుండా వాళ్ళ పెద్దవాళ్ళు బలవంతంగా తీసుకొని వెళితే దాని పర్యవసానంగా అతని మృత్యువు అతనిని కబళించింది. వాడి మాట విని వాడిని ఇంట్లోనే వదిలి వేసినా బాగుండేది అని కుర్రవాని తల్లిదండ్రులు బాధపడ్డారు . కానీ మరణించిన కుమారుడు తిరిగి వస్తాడా చెప్పండి.
"జాతస్య మరణం ధ్రువం". జన్మించిన వానికి మరణం తథ్యం. కానీ ఎప్పుడు ఎవరు, ఎక్కడ మరణిస్తారో కేవలం ఆ పరమేశ్వరునికి మాత్రమే తెలుస్తుంది.
సాధకులమైన మనము నిత్యం ఆ పరమశివుని పాదాలను శరణు చొచ్చటం తప్ప ఈ జన్మలో చేయవలసిన వేరొక పని లేదు.
ఓం తత్సత్
శాంతి శాంతి శాంతిః
ఇట్లు
మీ
భార్గవ శర్మ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి