5, నవంబర్ 2025, బుధవారం

ప్రతి ఫలం

 15, సెప్టెంబర్ 2024, ఆదివారం

ప్రతి ఫలం

 


 ప్రతి ఫలం 


కొన్ని సందర్భాలలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వవచ్చు.  ఇటువంటి దానికి నిదర్శనంగా శ్రీ ఆది శంకరుల ఒక వృత్తాంతం తెలుపుతారు. 


ఆది  శంకరుల వారు సన్యాసాశ్రమం సవీకరించిన తోలి రోజుల్లో అంటే ఇంకా స్వామి బాల్యంలోనే వున్నారు.  బిక్షాటన కొరకు ఒకసారి ఒక గుడిశముందు నిలబడి " భవతి బిక్షం దేహి" అని యాచించారట  కానీ ఆ గృహంలోనుంచి ఎంతసేపటికి ఎవ్వరు రాలేదు.   అయినా కానీ మన శంకరులవారు ఇంకా నిరీక్షిస్తూ ఆ గుడిసె ముందే ఉన్నారు.  కొంతసేపటికి ఒక పేదరాలు వణుకుతున్న చేతులతో స్వామికి లేదు అని చెప్పటానికి మనస్కరించక ఒక ఉసిరిక పండును మాత్రం ఆయన జోలెలో వేసిందట. ఆమె దైన్యతను గమనించిన శంకరాచార్యులవారు ఒకసారి ఆమె గుడిసెను సంపూర్ణంగా పరికించి చుస్తే మొత్తం ఇల్లంతా కాళీగా ఎటువంటి వస్తువులు లేకుండా  ఉండటం చూసి ఆమె కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నదని తెలుసుకున్నారు. 


ఆది శంకరాచార్యుల వారి  మనస్సు ఆర్ద్రతమైనదట. వెంటనే శంకరాచార్యులవారు మహాలక్షిని స్తుతిస్తూ స్తోత్రము చేశారట.  ఆయన స్తోత్రానికి ప్రసన్నమైన అమ్మవారు ఆయనకు ప్రత్యక్షం అయి నాయనా ఎందుకు నన్ను పిలిచావు అని అడిగింది.  దానికి శంకరులవారు అమ్మా ఇది నీకేమైనా న్యాయంగా ఉన్నదా ఈ సాద్వి మణి  దీనత్వం చూసి నీకు కొంచమైనా దయరాలేదా తల్లి అని వేడుకొన్నాడు. అప్పుడు అమ్మవారు నాయనా నేను ఏమి చేతును ఆమె గతజన్మలో పూర్తిగా పిసినారిగా వుంటూ ఎవరికి కూడా ఎటువంటి దానధర్మాలు చేయకుండా ఉండి పూర్తిగా పుణ్యరహితంగా ఉండటం వలన ఆమెకు ఈ జన్మలో ఈ దారిద్యం దాపురించింది అని అన్నది.   అమ్మా ఆమె ఏ పుణ్యము చేయలేదు సరే మరి ఆమె భర్త పుణ్యము వలన అయినా ఈమెకు కొంత ఊరట కలగాలి కదా తల్లి అని అన్నాడు. దానికి తల్లి నాయనా ఆమె భర్త ఈమెకన్నా ఎక్కువ పాపాత్ముడు . అందుకే వారిద్దరిని కలిపాడు పరమేశ్వరుడు.  ఇద్దరు ఒకరిని మించిన వారు ఇంకొకరు.  కాబట్టి వారు ఈ దారిద్యాన్ని అనుభవిస్తున్నారు అని అన్నారు అమ్మవారు. 


నాయనా ప్రస్తుత పరిస్థితుల్లో వారి దారిద్యాన్ని బాపటం ఆ పరమేశ్వరుని వశం కూడా కాదు వారు అంత పాపాత్ములు అని తల్లి ఉన్నసంగతి ఉన్నట్లు చెప్పింది.  అప్పుడు ఆలోచించటం శంకరులవారి వంతయినది శంకరులు అంటే సాక్షాత్తు శంకరులేకదా మరి శంకరాచారులవారు ఊరుకుంటారా.  తల్లి నీవు చెప్పింది నిజమే కావచ్చు  ఆ సాద్విమణి ఏ పుణ్యము గత జన్మలో చేసి ఉండకపోవచ్చు.  మరి ఈ జన్మలో విషయం ఏమిటి తల్లీ అని అమ్మవారిని మరల వినమ్రుడై అడిగాడు.  ఈ జన్మలోకూడా ఆమె ఏ రకమైన దానం చేయలేదు అని లక్ష్మీదేవి  బదులిచ్చింది. అప్పుడు శంకరులవారు ఒక్కసారి ఆమె గుడిశ మొత్తం పరికించి చూడు తల్లీ అని వేడుకున్నాడు.  మొత్తం చూసిన మహాలక్షి ఏమున్నది నాయనా అని అన్నది.  తల్లీ నేను చెప్పేది కూడా అదే ఆ సాద్వీమణికి ఇవ్వటానికి ఏమిలేకపోయినా నాకు ఒక ఉసిరిక పండును దానం చేసింది తల్లీ మరి ఆ దానఫలితాన్ని ఇవ్వవా అని మరల వేడుకొన్నాడు. అప్పుడు శంకరుని తెలివికి మెచ్చుకొనిన లక్ష్మీ దేవి ఆ ఇంట బంగారపు ఉసిరికాయలను వర్షించిందట దానితో ఆ పేదరాలి పేదరికం అంతా మటుమాయం అయిపొయింది. 


ఆది శంకరులు లక్షి అమ్మవారిని ప్రసన్నురాలిగా చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రముగా చాల ప్రసిద్ధి చెందింది.  ఈ స్తోత్రాన్ని భక్తితో రోజు పారాయణ చేసే భక్తులకు సిరి సంపదలు సమకూరుతాయని ప్రతీతి. త్రికరణ శుద్ధిగా అకుంఠిత దీక్షతో ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తే తప్పకుండా ఆ మహాలక్షి ప్రత్యక్షం అవుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటారు. .  


చూసారా సత్పురుషునికి చేసిన ఒక చిన్న దాన ఫలితంగా యెంత ఫలితం లభించిందో కదా.  కాబట్టి మనం ఎప్పుడూ సపాత్ర దానాన్ని చేయాలి. అంటే పాత్రనెఱిగి దానం చేయాలి.  దానం చేసేటప్పుడు దాన గ్రహీత మీరు చేసే దానానికి యోగ్యుడా కాదా అని నిర్ధారణ చేసుకొని మరి దానం చేయాలి. మీరు చేసిన దాన ద్రవ్యముతో దాన గ్రహీత ఏదైనా పాపపు కృత్యాలు చేస్తే మీకు దానఫలితంగా పుణ్య ఫలం రాకపోగా ఆ పాపంలో భాగం వస్తుంది. అంటే డబ్బులు ఇచ్చి మరి పాపాలను కొనుక్కోవటం అన్నమాట. 


మన పూర్వికులు అందుకేనేమో అన్నిదానాలలోకి అన్నదానం గొప్పది అని అన్నారు. అన్నదానం చేయటం  వలన రెండు విషయాలు అవగతం  అవుతాయి. ఒకటి అన్నం తిన్న దాన గ్రహీత ఇక నాకు చాలు అంటాడు అంటే అతను మీ దానంతో తృప్తి చెందుతాడు. కాబట్టి అతని తృప్తివలన మీకు దాని ఫలితంగా పుణ్యఫలం వస్తుంది.   ఇంకొక విషయం. మీరు పెట్టిన అన్నాన్ని మీ సమక్షంలోనే ఆరగిస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో అన్న దానం వలన పాపం రాదు.  ఏదానానికైనా పాత్రను యెరిగి దానం చేయాలి కానీ అన్నదానానికి మాత్రం ఆకలితోవున్న ఎవ్వరికైనా చేయవచ్చు. పుణ్య ఫలితం ఒకేవిధంగా ఉంటుంది.  అన్నదానం కేవలం మనుస్యులకు మాత్రమే చేయాలనీ నియమం లేదు. పశుపక్ష్యాదులకు కూడా చేయవచ్చు. నిత్యం పక్షులకు అన్నం పెట్టె వారికి ఈ జన్మలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కటి జీవితం కలుగుతుంది. వారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు.


కాబట్టి ప్రతివారు  ఇతర దానాలకన్నా అన్నదానమే శ్రేష్ఠము కావున అన్నదానాన్ని విరివిగా చేయటం శ్రేయస్కరం. . అన్నదానాన్ని ప్రోత్సహించండి. ఆలా అని రోజు ఒక్కరికే అన్నాన్ని పెట్టి మనుషులను ఏ పని పాట చేసుకొని సోమరులుగా తయారు చేయకూడదు.  


అన్నదానం తరువాత చెప్పుకోదగిన దానం విద్య దానం. ప్రతి విద్వంసుడు తాను సముపార్జించిన విద్యను పలువురికి దానం చేసి విద్యావంతులను చేయాలి.  విద్యావంతుడైన వాడు తన విద్యతో చక్కగా జీవితాంతం సంపాదించుకొని తానూ సుఖపడి పలువురిని సుఖపెట్టగలడు.  కాబట్టి విద్యాదానం చేయటం కూడా చాలా మంచి విషయం. 


ఓం తత్సత్ 


ఓం శాంతి శాంతి శాంతిః 


చేరువేల భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: