-------------------- భగవద్గీత. -------------------
తృతీయోధ్యాయ: కర్మ యోగము.
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।
ప్రతిపదార్థ:
ఇంద్రియాణి — ఇంద్రియములు; పరాణి — ఉన్నతమైనవి; ఆహుః — అనబడును; ఇంద్రియేభ్యః — ఇంద్రియముల కంటే; పరం — ఉన్నతమైనవి; మనః — మనస్సు; మనసః — మనస్సు కంటే; తు — కానీ; పరా — ఉన్నతమైనది; బుద్దిః — బుద్ధి; యః — ఏదైతే; బుద్ధే — బుద్ధిని మించి; పరతః — మరింత ఉన్నతమైనది; తు — కానీ; సః — అది (ఆత్మ).
తాత్పర్యము :
స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.
వివరణ:
ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన పరికరముల వివిధ స్థాయిలను, శ్రీ కృష్ణుడు విశదీకరిస్తున్నాడు. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారయింది; దానికన్నా ఉన్నతమైనవి ఐదు జ్ఞానేంద్రియములు (రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దముల అనుభూతిని గ్రహించేవి); ఇంద్రియముల కన్నా మించినది మనస్సు; మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణా శక్తి కలిగిన బుద్ధి; కానీ ఈ బుద్ధి కన్నా మించినది దివ్య ఆత్మ.
ఈ అధ్యాయపు చిట్టచివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మనము కామాన్ని కూకటి వేళ్ళతో పీకివేయటానికి ఇక ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి