ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, ఏప్రిల్ 2026, ఆదివారం
విలువల సంక్షోభాన్ని
సావడి కబుర్లు -7
వందేమాతరం
ఈరోజు సహోద్యోగి శ్రీ కొణకంచి వెంకట సుబ్రహ్మణ్యం గారు "ఉఫోరియా" చిత్ర సమీక్ష రాస్తూ సామాజిక పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. నిజమే, నేటి సమాజాన్ని పరిశీలిస్తే మనసుకు కలిగే భావన ఒక్కటే, ఆవేదన. అభివృద్ధి, ఆధునికత, స్వేచ్ఛ అనే పదాలు మన జీవన విధానాన్ని మారుస్తున్నప్పటికీ, వాటి వెనుక దాగి ఉన్న విలువల సంక్షోభాన్ని మనం గమనించకపోతున్నాం.
అభివృద్ధి పేరుతో ముందుకు పరుగులు తీస్తున్న మనిషి, విలువలను వెనక్కి నెట్టేశాడు. సమాజం అన్ని దిక్కుల నుంచి బంధాలను తెంచుకుంటూ ప్రత్యేకంగా యువత హక్కులు అనే పేరుతో స్వేచ్ఛను విచ్చలవిడితనంగా అలవాటు చేసుకుంటోంది. ఈ పరిణామం ఒక్క వ్యక్తి లేదా ఒక వర్గానికి సంబంధించినది కాదు. ఇది మొత్తం సమాజ నిర్మాణంలో ఏర్పడిన అసమతుల్యతకు ప్రతిబింబం. ఈ విశృంఖలత్వం ఒక భయంకర దావానలంలా నిశ్శబ్దంగా కాని వేగంగా సంస్కారమనే పచ్చని వనాన్ని దహించేస్తోంది. ఈ దావాగ్నిని ఆర్పకపోతే, రేపటి సమాజం విలువల రహితంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరిది బాధ్యత? ఎవరు బాధ్యత వహించాలి?.
సమాజం అనే నిర్మాణం కుటుంబం, విద్య, సమాజం మరియు సాంస్కృతిక వాతావరణం అనే నాలుగు స్థంభాలపై నిలబడింది. ఈ నాలుగు చోట్లా బలహీనతలు ఏర్పడినప్పుడు, దాని ప్రభావం ప్రత్యక్షంగా యువతపై పడుతుంది. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, విద్యలో నైతికతకు ప్రాధాన్యం తగ్గిపోవడం, మరియు సమాజంలో వినోదం పేరుతో అసంబద్ధ ప్రభావాలు పెరగడం, సంస్కృతి సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి యువతను దారి తప్పిస్తున్నాయి. ఫలితంగా, స్వేచ్ఛకు హద్దులు లేకుండా పోతున్నాయి.ఆత్మ నియంత్రణ అనే గుణం క్రమంగా కనుమరుగవుతోంది.
ఈ పరిణామం ఒక్కరోజులో రాలేదు. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, ఉత్తీర్ణత మాత్రమే అర్హతగా వచ్చిన విద్యా విధానాల్లో మార్పులు, సాంఘిక మాధ్యమాల ప్రభావం అధికం కావడం, స్వేచ్ఛను బాధ్యతల నుండి వేరు చేయడం. ఫలితంగా యువతలో అహంకారం పెరిగింది, ఆత్మ నియంత్రణ తగ్గింది.
ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది కుటుంబంలో పెద్దల పాత్ర. గతంలో పెద్దలు కుటుంబానికి మార్గదర్శకులు, సంస్కారాలకు ప్రతీకలు, అనుభవానికి నిలయాలుగా ఉండేవారు. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. నా బాధ్యతలు నేను నిర్వహించాను. ఇక ఎవరి కుటుంబాల వారివి. నా శేష జీవితాన్ని నాకు అనుకూలంగా, ఎవరికీ అడ్డం లేకుండా నా అభిరుచులకు అనుగుణంగా జీవిస్తాను అన్న దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఆధునిక కాలంలో వానప్రస్థంగా భావించబడుతున్నప్పటికీ, శాస్త్రాలు చెప్పిన వానప్రస్థ ధర్మం ఇదికాదు. ఇది ఆధునిక కాలం తనకు అనుకూలంగా నిర్వచించుకున్న వానప్రస్థం. బాధ్యతారాహిత్యానికి వేసుకున్న ఒక చక్కని ముసుగు.
మన ధర్మశాస్త్రాలు నిర్వచించిన చతుర్వర్ణ ఆశ్రమాల్లో వానప్రస్థం ఒకటి. భౌతిక ఆసక్తుల (ధనం, కుటుంబం) నుంచి విముక్తి. అంటే ఎవరు గదిలో వారు కూర్చొని "కృష్ణా రామా" అనుకోవడం కాదు. శాస్త్రాలు అంతవరకే నిర్వచించలేదు, సమాజానికి మార్గదర్శకత్వం వహించడం, తదుపరి తరానికి విలువలను అందించడం, అనుభవాన్ని పంచుకోవడం అనే పవిత్ర కర్తవ్యం వానప్రస్థం. అంటే సమాజం పట్ల పెరిగిన మరింత బాధ్యత. అది సమాజంలో ఆధ్యాత్మిక మరియు సంస్కార చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించే బాధ్యత. మన పరిధిలో కూర్చుని ఉండటం కంటే, మనం సమాజానికి అందించిన రేపటి తరాన్ని (పిల్లలు, యువత) సరైన సంస్కార మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం ప్రకారం, కుటుంబంలో పెద్దవారు (వృద్ధులు) కుటుంబానికి, సమాజానికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే *లోకాన్ని వదిలేయడం కాదు, లోకానికి మార్గం చూపడం వానప్రస్థం.*
*తస్మిన్ గృహే భవతి యదా బాల్యం వృద్ధతా ధ్రువా ।*
*తస్య తత్కార్యమాచార్యః ప్రవర్తేత సదా గురుః ॥*
మనుస్మృతిలో చెప్పినట్లు కుటుంబంలో వృద్ధులు గురువులుగా మారి మార్గదర్శకత్వం వహించాలి. శాస్త్రవాక్యాలు కూడా ఇదే విషయాన్ని బలంగా తెలియజేస్తున్నాయి. కుటుంబంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి. కేవలం మాటలతో మాత్రమే కాదు, ఆచరణతో చూపించే మార్గదర్శకత్వమే నిజమైన ఉపదేశం.
రామాయణంలో దశరథ మహారాజు తన పిల్లలకు ధర్మాన్ని నేర్పించిన విధానం వల్లే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడిగా ఎదిగాడు. సమాజానికి రక్షకుడు అయ్యాడు. పెద్దలు తమ ఆస్తిగా సంస్కారం కూడా పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే, పిల్లలు "అధర్మ మార్గం"లో పడతారు. అందుకే
పెద్దల సమయోచిత మార్గదర్శనం లేకపోవడమే మహాభారతంలో కౌరవుల వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు,
నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఇదే లోపాన్ని సూచిస్తున్నాయి. సాంకేతికత ఒక వరంగా మారాల్సింది, కానీ అది కొంతవరకు వ్యసనంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం, అసభ్య కంటెంట్, మాదకద్రవ్యాల ఆకర్షణ ఇవన్నీ యువతను నిశ్శబ్దంగా దారి తప్పిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 2025లో 30% యువత డ్రగ్స్ ప్రభావంలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత సమస్యలు కావు, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదకర సంకేతాలు. రేపటి తరాన్ని సంస్కారయుతంగా పెంచడం మన ధర్మం. అప్పుడే మన సమాజం ధర్మభూమిగా మారుతుంది.
మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. ఈ సమస్యకు ఒకే వ్యక్తితో పరిష్కారం రాదు, ఇది సమిష్టి బాధ్యత అని తెలుసుకోవాలి.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల బాధ్యత అత్యంత కీలకమైంది. పిల్లలకు మంచి విద్య, సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే తల్లిదండ్రుల కర్తవ్యం కాదు. వారికి సంస్కారం, విలువలు, నైతికత అనే బలమైన పునాది అందించాలి. పిల్లలతో సమయం గడపడం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, మంచి చెడుల మధ్య తేడాను తెలియజేయడం, స్వేచ్ఛకు పరిమితులు నిర్ధారించుకోవడం నేర్పించాలి. ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యతలో భాగం. ఆస్తి కంటే గొప్పది సంస్కారం. అది ఉంటేనే వ్యక్తి సమాజంలో నిలబడగలడు.
పెద్దలు మార్గదర్శనం చేస్తే, తల్లిదండ్రులు సంస్కార బోధన చేయాలి. గురువులు జ్ఞానంతో పాటు నీతి బోధన చేయాలి, సమాజం మంచి వాతావరణం కల్పించాలి. ఈ నాలుగు స్థంభాలు బలంగా నిలబడితేనే యువత సరైన మార్గంలో నడుస్తుంది. మనము రేపటి తరానికి ఏమి ఇస్తున్నామో ఆలోచించాలి.
చివరగా, మనం మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. రేపటి తరానికి మనం ఏమి అందిస్తున్నాం?. కేవలం సౌకర్యాలనేనా, లేక విలువలతో కూడిన జీవన విధానమా? భవిష్యత్తు సాంకేతికతపై కాదు, సంస్కారం మీద నిలబడుతుంది. సంస్కారం ఉన్న చోటే సమాజం నిలుస్తుంది. అది లేకపోతే అభివృద్ధి కూడా అర్థరహితమవుతుంది, సమాజం కూలిపోతుంది అన్న వాస్తవానికి గ్రహించాలి.
మనందరం కలిసి బాధ్యతగా ఆలోచించి, ఆచరించినప్పుడు మాత్రమే ఈ విశృంఖలత్వాన్ని నియంత్రించగలం. అప్పుడే మన సమాజం మళ్లీ ధర్మం, నీతి, సంస్కారం ఆధారంగా నిలిచే ధర్మభూమిగా వికసిస్తుంది.
ఆలోచిద్దాం, అడుగు ముందుకు వేద్దాం.
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849795167
*భక్తి ఎలా వుండాలి???*
*భక్తి ఎలా వుండాలి???*
భగవంతుడు భావ ప్రియుడు మాత్రమే,
బాహ్య ప్రియుడు కాదు...
ఈరోజు మన భక్తి అంతా బాహ్యమైనదే,
ఎంత అలంకరించామా,
ఎన్ని వంటలు చేసామా, ఎంతమంది మనలను పోగిడారా అనే ఆలోచనే ...
ఇదంతా అహంకార భక్తి ...
శ్రీకృష్ణుడి వద్దకు ఒకనాడు సత్యభామ బంగారుతట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచింది...
" ఇవి నా తోటలో పండిన పండ్లు, ఈ జాతి మరి ఎక్కడనూ లేదు" అని వాటిని గూర్చి గొప్ప గా వర్ణించినది...
కృష్ణుడు ఒక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ఇవి సారహీనములని చప్పరించి పడవేసెను...
ఇంతలో "గుబ్బి" అనుఒక గొల్లపిల్ల దోసిటలో కొన్ని పండ్లు తెచ్చి "స్వామీ!! ఇవి అల్ల నేరేడుపండ్లు,
స్వామి వలె శ్యామసుందరములు, అందువలన నాకు మిక్కిలి ప్రియములు"!!..
"దయతో గైకొని అనుగ్రహింపవలెను. " అనుచూ పాదముల మ్రోల వ్రాలినది...
కృష్ణుడు వాటి రుచిని అడుగడుగునా మెచ్చుకొనుచూ, అన్నియూ తిని వేసెను.
నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములు విలువ కలవి, రుచి కలవి... ఐన నేమి?!
ఆమె అహంభావము స్వాతిశయము మూలమున భగవానుని దృష్టి లో అవి రసహీనము లైనవి...
గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణుకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి...
అందుకు వాటినే స్వీకరించాడు,
ఈరోజు భగవంతుడు మనము చేసే పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఎన్ని స్వీకరిస్తున్నారో మనకే అర్థం కావాలి...
స్వస్తి.....✍
*_శుభమస్తు_*
🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍
సమస్త లోకా సుఖినోభవంతు
ఆచార్యుడు అంటే.. ?
ఆచార్యుడు అంటే.. ?
గురువంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ‘‘ఆచార్యః గురూనాం శ్రేష్టః’’ – ఆచార్యుడిని గురువులందరిలోకి శ్రేష్టుడంటారు. అంటే ఎవడు ఆచారాన్ని కలిగున్నాడో ఆయన ఆచార్యుడు. నీవు ఏ విషయాన్నయినా చదువుకుని ఉండవచ్చు. అది విద్యార్థులకు బోధిస్తూ ఉండవచ్చు. ఒకడు నృత్యం నేర్చుకుంటాడు, శిష్యులకు చెపుతూ ఉంటాడు. ఒకడు వాద్యపరికరాన్ని మోగించడంలో నిష్ణాతుడు. సంగీతంలో, విలువిద్యలో, లెక్కలు చెప్పడంలో.. అలా వారివారి రంగాల్లో పాండిత్యం సంపాదించి దానిని శిష్యులకు బోధిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. కేవలం ‘నీవు ఏం చెబుతున్నావు, ఏ స్థాయిలో చెపుతున్నావన్న దాన్నిబట్టి నీవు ఆచార్యుడివి కాలేవు’ అంటుంది శాస్త్రం.
బోధించే విషయం ఏదయినా ధర్మశాస్త్రం, వేదం బాగా తెలిసున్నవాడై, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడే ఆయన ఆచార్యుడు అని పిలవబడతాడు. నీకు ధర్మశాస్త్రం తెలిస్తే జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, పదిమందికి నీవు ఆదర్శవంతుడవయితే, ‘ఆయనలా బతకండి’ అన్న శిష్టాచారానికి నీవు ప్రమాణమైతే అప్పుడు మాత్రమే నీవు ఆచార్యుడివి. విలువిద్య నేర్పిన ద్రోణుడిని ద్రోణాచార్య అన్నారు. అయితే కేవలం ఆయన విలువిద్య నేర్పినందుకు అలా అనలేదు, విద్య నేర్పేటప్పుడు పాత్రత చూసాడు, ధర్మబద్ధంగా నడుచుకున్నాడు కనుక ద్రోణాచార్యుడయ్యాడు...
*కీర్తి మూర్తులు
🙏🌹 *కీర్తి మూర్తులు* 🌹🙏
మనిషిని సంతోష పెట్టే అనేక లౌకిక విషయాల్లో *కీర్తి ఒకటి*. మనిషి సహజంగానే *కీర్తి కాముకుడు*. ఎవరికైనా కీర్తి వస్తే వారు *ఎంతగానో ఆనందిస్తారు*. దాని నుంచి మరికొంత *స్ఫూర్తినీ పొందుతారు.* కీర్తి స్వభావం అటువంటిది. మంచి పనులు చేసినవారికి మంచి పేరు, తద్వారా కీర్తిప్రతిష్ఠలు తప్పక దక్కుతాయి. *మనం చేసే పనులను* బట్టే కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయనేది సత్యం.
*గురుస్థానంలో* ఉండి ప్రసిద్ధులైన ఎందరో ఋషులు మనకు కనిపిస్తారు. వ్యాసుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు... ఇలా చాలామంది లోకంలో గురుశ్రేష్ఠులై విలసిల్లారు. ఆధునిక కాలంలోనూ గురుపరంపర కొనసాగుతోంది. యథాశక్తి వారూ పేరుప్రతిష్ఠలు పొందుతున్నారు. మరికొందరు *వారికిష్టమైన పనిలో ప్రావీణ్యం* సంపాదిస్తారు. వారు *ఆ పనిలో నిష్ణాతులై* కీర్తి పొందుతారు. నలమహారాజు, భీమసేనుడు ఈ విధంగా పేరు గడించినవారే. వారు *పాకశాస్త్ర ప్రవీణులు*. లోకంలో నలభీమపాకమనే నానుడి ఉంది.
పాండవులు ఎప్పుడూ ధర్మం వైపే ఉన్నారు. వారు *ఊరికెప్పుడూ ఉపకారమే చేశారు.* సత్కార్యాలతో శాశ్వత కీర్తి గడించారు. అలాగే చేతికి ఎముక లేకుండా *దానం చేసిన* కర్ణుడు ఎనలేని కీర్తిని పొందాడు. *లోకహిత కరమైన కార్యాలు* చేయడం ద్వారా శిబిచక్రవర్తి, దధీచి మొదలైనవారు ఎంతో కీర్తినార్జించారు. మమ్మటుడు తన 'కావ్య ప్రకాశం' గ్రంథంలో కావ్యాలు రాయడం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇచ్చాడు. 'కావ్యం యశనే...' అంటూ, *కావ్యాలు రాయడం* వల్ల కీర్తి వస్తుందని చెప్పాడు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, భాసుడు మొదలైన మహాకవులు లోక *ప్రశస్తమైన కృతులు* రాసి ఎంతో కీర్తిని పొందారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గొప్ప *గొప్ప కావ్యాలు* రాసి ఘనమైన కీర్తి సంపాదించుకున్నారు. ఈ పరంపర నేటికీ కొనసాగుతోంది
సమాజంలో కొందరికి *దానం చేయడం* వల్ల కీర్తి దక్కుతుంది. ఇంకొందరికి *మంచి వ్యక్తిత్వం* వల్ల పేరుప్రఖ్యా తులు వస్తాయి. మరికొందరికి వారు చేసే సేవల ద్వారా కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. శ్రీమతి డొక్కా సీతమ్మ లాంటి వారికి *అన్నదానం* చేయడం వల్ల నిరుపమానమైన కీర్తిప్రతిష్ఠలు లభించాయి. స్వామి వివేకానంద లాంటివారు *ఉన్నతమైన వ్యక్తిత్వం* ద్వారా విశ్వవిఖ్యాత కీర్తి గడిం చారు. మదర్ థెరెసా కు ఆమె *సేవల ద్వారా* ఎనలేని పేరుప్రఖ్యాతులు వచ్చాయి. సమాజంలో ఇప్పుడూ ఎంతోమంది దాతృత్వం వల్ల ప్రఖ్యాతి పొందుతున్నారు.
*చిత్రలేఖనం* వంటి లలితకళలు సైతం కొందరికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టాయి. కేరళకు చెందిన రాజా రవివర్మ, తెలుగువారైన దామెర్ల రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు. సిద్ధేంద్రయోగి *నాట్యశాస్త్రం* వల్ల ప్రసిద్ధి చెందారు. ఇటువంటివారి కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం ప్రకాశిస్తుంటాయి. అయితే, సమాజం ఎప్పుడూ ఒకటి గమనించాలి. ఇంతమంది మహానుభావులు ఆయా రంగాల్లో అంతటి విజయాలు సాధించింది కేవలం కీర్తిప్రతిష్ఠలు పొందాలని కాదు. అది వారివారి ప్రతిభా వైదుష్యమని గ్రహించాలి. అర్హులైన వారందరికీ కీర్తి దక్కుతుంది. అర్హత ఉంటే ఎవరినైనా, ఎప్పుడైనా పేరు ప్రఖ్యాతులు వెతుక్కుంటూ వస్తాయి. అందులో *లోక కల్యాణ కారకమైన* పనులు చేసేవారిని *కీర్తి ప్రతిష్ఠలు* తప్పక వరిస్తాయి.
మనందరం కొంత సమయాన్ని *సమాజ సేవకై వినియోగిద్దాము*, కీర్తి మూర్తుల *సరసన స్థానం సంపాయిద్దాము.*
ధన్యవాదములు
*(సేకరణ)*
సహస్రనామ స్తోత్ర పారాయణకు
హిందూ ధర్మశాస్త్రాలలో, పురాణాలలో దేవతల **సహస్రనామ స్తోత్ర పారాయణకు** అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. నామ సంకీర్తన ద్వారా మనఃశుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయని అనేక గ్రంథాలు ఘోషిస్తున్నాయి.
వివిధ పురాణాల నుండి సహస్రనామ పారాయణ విశిష్టతను తెలుసుకుందాము
****************************************
* శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రము (గణేశ పురాణం)*
అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యః సురైరపి |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||
ఈ సహస్రనామాలను పఠించేవారికి చతుర్విధ పురుషార్థ సిద్ధులు (ధర్మ, అర్థ, కామ, మోక్షాలు) లభిస్తాయని, ముఖ్యంగా విద్యార్థులకు విద్య, ధనార్థులకు ధనం ప్రాప్తిస్తాయని గణేశ పురాణం ద్వారా తెలుస్తుంది.
****************************************
*శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామము (స్కంద పురాణం)*
శత్రు సైన్య వినాశార్థం భక్తానామభయాయ చ |సహస్రనామముద్గీతం షణ్ముఖస్య మహాత్మనః ||
శత్రువుల నుండి భయం ఉన్నప్పుడు, కోర్టు సమస్యలు లేదా కుజ దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య సహస్రనామ పారాయణ పరమౌషధంలా పనిచేస్తుంది.
****************************************
*దేవీ భాగవతం - గాయత్రీ సహస్రనామము*
సర్వపాపహరం పుణ్యం సర్వరోగనివారణం |
సహస్రనామపాఠాత్తు బ్రహ్మలోకే మహీయతే ||
ఈ సహస్రనామ పారాయణ సర్వ పాపాలను హరిస్తుంది, రోగాలను నయం చేస్తుంది. ఇది పఠించిన వారు అంతిమంగా బ్రహ్మలోకాన్ని పొందుతారు.
సంధ్యా వందన సమయంలో గాయత్రీ సహస్రనామ పారాయణ చేయడం వల్ల బ్రహ్మతేజస్సు పెరుగుతుందని చెప్పబడింది.
****************************************
*శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము (బ్రహ్మాండ పురాణం)*
సహస్రనామపాఠాచ్చ యత్ఫలం భవతి ప్రియే |
తత్ఫలం కోటిగుణితం భవేన్నామజపాత్సదా ||
ఇతర స్తోత్రాల కంటే సహస్రనామ పారాయణ విశిష్టమైనదని, అందులోనూ లలితా సహస్రనామ పారాయణ సర్వ పాపహరమని చెప్పబడింది. "సకృదేవ పఠేద్యస్తు సర్వపాపైః ప్రముచ్యతే" ఒక్కసారి పఠించినా సర్వ పాపాలు తొలగిపోతాయని దీని అర్థం.
****************************************
*శ్రీ శివ సహస్రనామ స్తోత్రము (లింగ పురాణం / మహాభారతం)*
ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం వీర్యం బలం తథా |
శివనామ జపాదేవ సర్వమేతన్న సంశయః ||
ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, పరాక్రమం మరియు బలం.. ఇవన్నీ శివ సహస్రనామ పారాయణ వల్ల నిస్సందేహంగా లభిస్తాయి.
****************************************
*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము (మహాభారతం - అనుశాసనిక పర్వం)*
భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన ఈ స్తోత్రం అత్యంత ప్రామాణికమైనది. దీని ఫలశ్రుతిలో పారాయణ ప్రాముఖ్యత ఇలా
య ఇదం పఠేన్నిత్యం భక్త్యా శ్రద్ధాసమన్వితః |
యుజ్యేతాత్మసుఖక్షాంతి శ్రీధృతిస్మృతికీర్తిభిః ||
ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ ఈ నామాలను పఠిస్తారో, వారు ఆత్మసుఖం, శాంతి, ఐశ్వర్యం, ధైర్యం, జ్ఞాపకశక్తి మరియు కీర్తిని పొందుతారు.
ఇందులో "న వాసుదేవ భక్తానామ్ అశుభం విద్యతే క్వచిత్" అని చెప్పబడింది. అంటే భగవంతుని నామాన్ని స్మరించేవారికి ఎన్నడూ అశుభం కలగదు.
***************************************
*శ్రీ రామ సహస్రనామ స్తోత్రము (పద్మ పురాణం)*
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||
వేయి నామాలను పఠించడం వల్ల కలిగే ఫలితం కేవలం "రామ" అనే నామాన్ని మూడు సార్లు పఠించడం వల్ల కలుగుతుందని దీని అర్థం. ఇది సహస్రనామాల యొక్క శక్తిని, నామ సంకీర్తన సులభతను తెలియజేస్తుంది.
****************************************
*శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రము (బ్రహ్మ పురాణం)*
మహాలక్ష్మిని స్తుతించే ఈ సహస్రనామ పారాయణ దారిద్ర్య నిర్మూలనకు అత్యంత శక్తివంతమైనదని చెప్పబడింది.
దారిద్ర్య దుఃఖ శమనం సర్వైశ్వర్య ప్రదాయకమ్ |
సహస్రనామ పఠనాత్ లక్ష్మీః సాక్షాత్ ప్రసీదతి ||
ఈ సహస్రనామ పఠనం వల్ల దారిద్ర్యం, దుఃఖం శమిస్తాయి. సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇది పఠించేవారిపై లక్ష్మీదేవి సాక్షాత్కరించి అనుగ్రహిస్తుంది శుక్రవారం నాడు లేదా పౌర్ణమి నాడు ఈ పారాయణ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.
****************************************
*శ్రీ సూర్య సహస్రనామము (భవిష్య పురాణం)*
నమః సూర్యాయ శాంతాయ సర్వరోగనివారిణే |
ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేవ జగత్పతే ||
సూర్య సహస్రనామ పారాయణ వల్ల చక్షు రోగ నివారణ (కంటి వ్యాధులు తగ్గడం) మరియు చర్మ వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని భవిష్య పురాణ ప్రోక్తం. "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని ఆర్యోక్తి.
****************************************
*వరాహ పురాణం - భూదేవి సహస్ర నామ స్తోత్రం*
నామ సంకీర్తనం తస్య సర్వదోషవినాశనం |సహస్రనామ తుల్యం హి నామ ఏకం హరేః స్మృతం
||
కలియుగంలో భూమిపై నివసించే మనుషులకు భగవంతుని నామమే రక్ష అని, సహస్రనామ పారాయణ చేయడం వల్ల భూమికి సంబంధించిన దోషాలు (వాస్తు దోషాలు వంటివి) కూడా తొలగిపోతాయని వరాహ పురాణం చెబుతోంది.
****************************************
*స్కంద పురాణం - గంగా సహస్రనామము*
గంగేతి నామ జపతో యోజనానాం శతైరపి |
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||
గంగా సహస్రనామాన్ని పఠించడం వల్ల వందల యోజనాల దూరంలో ఉన్నా కూడా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని స్కంద పురాణం పేర్కొంది.
****************************************
*శ్రీ శ్యామలా సహస్రనామము (సౌభాగ్య లక్ష్మీ కల్పము / బ్రహ్మాండ పురాణం)*
కవిత్వదమ్ చౌదారమ్ చ సర్వసౌభాగ్యదాయకమ్|పఠేత్సహస్రనామేమం వాగ్దేవ్యాః ప్రీతిదాయకమ్ ||
విద్యార్థులు, కళాకారులు ఈ నామాలను పఠించడం వల్ల వాక్శుద్ధి, సృజనాత్మకత పెరుగుతాయి. ఇది బుద్ధిని ప్రకాశింపజేస్తుంది.
***************************************
*నృసింహ సహస్రనామ స్తోత్రము (నృసింహ పురాణం)*
సర్వరోగ ప్రశమనం సర్వపాప వినాశనమ్ |
శత్రుసంహారకం చైవ నృసింహనామ కీర్తనమ్ ||
గ్రహ పీడలు, శత్రు బాధలు, అకాల మృత్యు భయం ఉన్నవారు ఈ నామాలను పారాయణ చేయడం వల్ల వజ్రకవచంలాంటి రక్షణ లభిస్తుంది.
****************************************
*శ్రీ దక్షిణామూర్తి సహస్రనామము (ఆకాశ భైరవ కల్పము)*
అజ్ఞాన తిమిరచ్ఛేదం జ్ఞానదీప ప్రకాశకమ్ |సహస్రనామ సంకీర్త్యా దేవాచార్యః ప్రసీదతి ||
అజ్ఞానం అనే చీకటిని (తిమిరం) నశింపజేసేది (ఛేదనం) జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేది భగవంతుని వేయి నామాలను (సహస్రనామాలను) సంకీర్తన చేయడం ద్వారా దేవతలకు గురువైన వారు లేదా ఆ పరమాత్మ సంతోషించి అనుగ్రహిస్తారు.
****************************************
"సహస్ర" అంటే వెయ్యి అని మాత్రమే కాదు, "అనంతం" అని కూడా అర్థం. భగవంతుని అనంతమైన గుణాలను, శక్తులను స్తుతించడమే సహస్రనామ పారాయణ ఉద్దేశం. ఇది కేవలం పుణ్యం కోసమే కాకుండా, మన అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం.
అష్టోత్తర శతనామ పారాయణ (108 నామాలు)
సాధారణంగా ప్రతి నిత్య పూజలో "అష్టోత్తరం" తప్పనిసరి. నవగ్రహాల యొక్క ప్రభావం మనపై ఉండడం వల్ల, 9 గ్రహాలు మరియు 12 రాశుల కలయిక (9 \times 12 = 108) ద్వారా కలిగే దోషాలను తొలగించుకోవడానికి 108 నామాలు పఠిస్తారు.
అవకాశం లేనపుడు ** (108), **త్రిశతి** (300), మరియు **సహస్రనామములు** (1000).
ఏదో ఒక పద్ధతి పారాయణ అర్చన చేయడం మంచిది.
***************************************
*అష్టోత్తరం 108 విశేషం*
*దేవీ భాగవతం*
అష్టోత్తర శతైర్నామభిః అర్చయేత్ పరమేశ్వరీమ్ |
సర్వపాప వినిర్ముక్తః సర్వకల్యాణభాజనమ్ ||
108 నామాలతో అర్చన చేయడం వల్ల తక్షణమే పాప విముక్తి కలిగి, సకల శుభాలు కలుగుతాయి. ఇది దైనందిన సాధనకు (Daily Practice) అనువైనది.
నారద పురాణం
అష్టోత్తర శతం నామ్నాం సర్వపాప ప్రణాశనమ్ |యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్ ||
108 అనే సంఖ్య సూర్యుడు, చంద్రుడు మరియు భూమికి మధ్య గల దూరం యొక్క నిష్పత్తికి, అలాగే మనిషిలోని 108 ప్రధాన నాడీ కేంద్రాలకు (Nadi points) సంకేతం. అందుకే అష్టోత్తర పఠనం వల్ల శరీరం మరియు మనస్సు త్వరగా లయబద్ధం (Alignment) అవుతాయి.
*****************************************
*త్రిశతీ 300 విశేషం*
లలితోపాఖ్యానం త్రిశతి నామ పారాయణ (300 నామాలు)
సహస్రనామపాఠాచ్చ యత్ఫలం భవతి ప్రియే |తత్పల్యం కోటిగుణితం త్రిశత్యా జపతో భవేత్ ||
హయగ్రీవ స్వామి అగస్త్యుడితో ఇలా అంటారు
"ఓ అగస్త్యుడా! సహస్రనామ పారాయణ వల్ల కలిగే ఫలితం కంటే, త్రిశతి పారాయణ వల్ల కోటి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది."
దీనికి కారణం త్రిశతిలోని నామాలు *మూల మంత్రo* (15 అక్షరాల మంత్రం) తో కూడి ఉండడం. ఇది కేవలం నామ పారాయణమే కాదు, మంత్ర జపంతో సమానం.
***************************************
*సహస్ర( 1008) నామ పారాయణ విశేషం*
సహస్రనామ పారాయణ అనేది యజ్ఞం లాంటిది. "విష్ణు సహస్రనామ" ఫలశ్రుతిలో భీష్ముడు ఇలా అంటారు
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||
సహస్రనామాలను పఠించడం వల్ల పరమమైన తేజస్సు, తపస్సు మరియు బ్రహ్మజ్ఞానం లభిస్తాయి. ఇది సంపూర్ణ శరణాగతికి మార్గం.
****************************************
*బ్రహ్మ వైవర్త పురాణం*
నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తినీ |
తథాపి నరకే ఘోరే పతంతీత్యేతదద్భుతమ్ ||
భగవంతుని నామాలు ఉన్నాయి, వాటిని పఠించే శక్తి కలిగిన నాలుక ఉంది. అయినప్పటికీ మనుషులు ఘోరమైన నరకానికి (కష్టాలకు) గురవుతున్నారంటే అది విచిత్రం. అంటే, నోరున్న ప్రతి ఒక్కరూ ఈ సహస్ర, త్రిశతి లేదా అష్టోత్తర నామాలను పఠించి తీరాలని దీని ఆంతర్యం.
వీటన్నింటిలోనూ **"భక్తి"** అనేది ప్రధానాధారం. భక్తి లేకుండా చేసే సహస్రనామ పారాయణ కంటే, భక్తితో చేసే ఒక్క నామ స్మరణ మిన్న అని పురాణాలు ఘోషిస్తున్నాయి.
****************************************
*ప్రతీ సహస్ర నామాలలో అంతర్యం*
నామ రూపే లీలా ధామేత్యనుక్రమః |
చిత్తే స్ఫురంతి త్వనిశం భక్త్యా సంకీర్తనే కృతే ||
*నామ
భగవంతుని పేరు (ఉదా.. విష్ణు, లలిత, శివ). ఇది ధ్వని రూపం.
*రూప
ఆ నామాన్ని పఠిస్తున్నప్పుడు స్ఫురించే దైవ స్వరూపం (శంఖ చక్ర గదాధరుడు లేదా త్రినేత్రుడు).
*లీల ఆ దైవం చేసిన అద్భుత కృత్యాలు (ఉదా.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ).
*ధామ
ఆ దైవం నివసించే పరమపదం (వైకుంఠం, కైలాసం లేదా శ్రీచక్రాంతర్వర్తిని).
*పద్మ పురాణం - నామ చింతామణి*
నామ చింతామణిః కృష్ణశ్చైతన్య రసవిగ్రహః |
పూర్ణః శుద్ధో నిత్యముక్తోఽభిన్నత్వాన్నామ నామినోః ||
భగవంతుని నామం ఒక 'చింతామణి' వంటిది. అది చైతన్య స్వరూపం (రసవిగ్రహం). భగవంతుడికి, ఆయన నామానికి భేదం లేదు. కాబట్టి నామ పారాయణ చేసేటప్పుడు భక్తుడు ఆ దైవంతో ఏకమైపోతాడు. ఇదే సమాధి స్థితికి పునాది.
*సమాధి స్థితికి మార్గం క్రమ పద్ధతి*
సహస్రనామ పారాయణలో ఈ నాలుగు అంశాలు ఒకదాని వెంట ఒకటి ఎలా స్ఫురిస్తాయి అని శాస్త్రం
*నామ స్మరణ
నాలుకతో నామాన్ని పలకడం (శబ్ద బ్రహ్మ).
*రూప ధ్యానం
నామం వినబడగానే మనస్సులో దైవ రూపం స్థిరపడటం.
*లీల చింతన
ఆ దైవం యొక్క కళ్యాణ గుణాలు, లీలలు గుర్తొచ్చి హృదయం ద్రవించడం.
*ధామ ప్రాప్తి
సర్వం ఆ దైవమయంగా కనిపించే స్థిరమైన స్థితి (సమాధి).
***** నిత్యా ఆచరించే వారికి ఇహ సుఖం తో పాటు పరమ పదం కూడా తథ్యం******
****************************************శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏
*రాళ్ళబండి శర్మ*
సుమన మనోహర రామ*
*సుమన మనోహర రామ*
సుమన మనోహర రామ
సుందర వదనా రామ
రాజీవ లోచన రామ
రఘుకుల సోమా రామ
దశరథ నందన రామ
కౌసల్యా సుప్రజా రామ
సౌమిత్రి అగ్రజ రామ
వశిష్ఠ శిష్య రామ
కౌశిక మఖ రక్షక రామ
శివధనుర్భంజన రామ
సీతా కళ్యాణ రామ
పితృవాక్య పరిపాలక రామ
గహన విపినచర రామ
మాయా మృగ అనుసరణ రామ
మారీచ మర్దన రామ
జానకీ విరహ రామ
వాలి నిగ్రహ రామ
సుగ్రీవ రాజ్య ప్రదాత రామ
హనుమత్ సేవిత రామ
దశకంఠ సంహార రామ
అయోధ్యా పుర వాస రామ
పట్టాభిషేక రామ
రామ కోదండ రామ
సుమన మనోహర రామ
సుందర వదనా రామ
--
సునీల్ ఆకెళ్ళ
కుటుంబ సమస్యలు - విశ్లేషణ బ్రాహ్మణి దేవి - imp
సావడి కబుర్లు - 8
వందేమాతరం
కుటుంబ సమస్యలు - విశ్లేషణ
*సహృదయం సామనస్యం అవిద్వేషం కృణోమి వః ।*
*అన్యోన్యం అభిహర్యత వత్సం జాతమివాఘ్న్యా ॥*
_మన హృదయాలు ఒకటిగా ఉండాలి, మన భావనలు సమన్వితంగా ఉండాలి, పరస్పర ద్వేషానికి తావు ఉండకూడదు. ఒక ఆవు తన దూడను ఎంత ప్రేమగా ఆదరిస్తుందో అంత ప్రేమతో మనం ఒకరినొకరం ఆదరణతో ఉండాలి_ అంటూ అధర్వణ వేదం రూపంలో వేదమాత మానవ కుటుంబజీవనానికి ఇచ్చిన అద్భుతమైన ఉపదేశం ఎంతో విలువైనది. అదే నిజమైన కుటుంబ స్వరూపం.
కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో నివసించే రక్తసంబంధాల కలయిక కల వ్యక్తుల సమాహారం మాత్రమే కాదు. ఒకే హృదయస్పందనతో జీవించే మనసుల సమూహం. అది ప్రేమ, కర్తవ్య, త్యాగ, క్షమ, సహనం, గౌరవం అనే ఆరు స్తంభాలపై నిలిచే పవిత్ర జీవనవ్యవస్థ. రక్తసంబంధం కుటుంబానికి రూపాన్ని ఇస్తే, ప్రేమ దానికి ప్రాణాన్ని ఇస్తుంది. కర్తవ్యబోధన దానికి స్థిరత్వం ఇస్తుంది. క్షమ దానికి చిరకాలం నిలిచే విశ్వాసాన్నిస్తుంది.
ఒక విధంగా మనిషి జీవితంలో కుటుంబమే తొలి పాఠశాల. తల్లిదండ్రులే తొలి గురువులు. కుటుంబమే సంస్కార బోధన చేసే తొలి దేవాలయం. అందుకే మన సంస్కృతిలో గృహాన్ని “ఇల్లు” అని మాత్రమే కాక “గృహస్థాశ్రమం” అని గౌరవంగా సంబోధిస్తారు.
అయితే, ఇంత పవిత్రమైన బంధాలలో ఎందుకు కలహాలు ఏర్పడుతున్నాయి? ప్రేమతో కలిసిన మనసులు ఎందుకు దూరమవుతున్నాయి ?. కలిసి జీవించాలనే సంకల్పంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి సమాధానం వెతికితే మనకి మానవస్వభావంలోనే కనిపిస్తుంది.
కుటుంబ కలహాలకు ప్రధాన కారణం ప్రేమ, అపేక్షలు.
అపేక్షలు అతిగా పెరిగితే అవి బాధకు మూలమవుతాయి. “వారు నన్ను అర్థం చేసుకోవాలి”, “నేను అనుకున్నట్టే ప్రవర్తించాలి”, “నా మనసుకు అనుగుణంగా ఉండాలి” అనే మౌనమైన ఆశలు నెరవేరనప్పుడు అసంతృప్తి పుడుతుంది. ఆ అసంతృప్తి మెల్లగా మనసులో మంటగా మారి కలహాలకు కారణమవుతుంది.
దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు
*కామాత్ క్రోధోఽభిజాయతే క్రోధాత్ భవతి సంమోహః ।*
*సంమోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః ॥*
అంటూ, అతిశయమైన ఆశల నుంచే క్రోధం పుడుతుంది. క్రోధం వివేకాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు.
కుటుంబ కలహాలకు అపేక్షలు మొదటి కారణమైతే, రెండో ప్రధాన కారణం అహంకారం. ప్రేమ “మనము” అంటే, అహంకారం “నేను” అంటుంది. “నేనే ఎందుకు తగ్గాలి?”, “నా మాటే ఎందుకు వినకూడదు?”, “ప్రతి సారి నేనే ఎందుకు క్షమించాలి?” అనే భావనలు ఎప్పుడైతే మనసులో కలుగుతాయో, అవే కుటుంబంలో చీలికలకు తీసుకొని వస్తాయి. అంటే ప్రేమ తగ్గిన చోట అహం పెరుగుతుంది, అహం పెరిగిన చోట శాంతి నిలవడం కష్టం.
ఇక మూడవ కారణం సంభాషణలో లోపం.
కుటుంబాలు పెద్ద సమస్యల వలన కూలిపోవు, చిన్న అపార్థాలను పెద్దవిగా పెంచడం వలన కూలిపోతాయి. చెప్పవలసిన మాట చెప్పకపోవడం, వినవలసిన మాట వినకపోవడం, అర్థం చేసుకోవలసిన సందర్భంలో తీర్పు ఇవ్వడం, ఇవే అనేక బంధాలను దెబ్బతీస్తాయి. మాటలతో సరిచేయవలసిన చోట మౌనం దానిని మరింత కఠినతరం చేస్తుంది.
నాలుగవ ముఖ్య కారణం పోలికలు. “వారి ఇంట్లో ఇలా ఉంది”, “వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు”, “అతని భార్య ఇలా, ఆమె భర్త అలా.." వంటి పోలికలు కుటుంబాల్లో ఆనందాన్ని హరించి వేయడమే కాక అసంతృప్తిని పెంచుతాయి. పోలిక ఉన్నచోట కృతజ్ఞత ఉండదు, కృతజ్ఞత లేని చోట సంతోషం నిలవదు.
ఇక చివరిగా, ఐదవ కారణం క్షమాభావం లేకపోవడం.
తప్పులేని మనిషి ఉండడు. కలిసి జీవించాలంటే పరస్పరం లోపాలను అర్థం చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో భరించాలి కూడా. ప్రతి చిన్న పొరపాటును మనసులో దాచుకుంటూ పోతే, అది మనుషుల మధ్య సంబంధాన్ని లోపల్నుంచి క్రమంగా క్షీణింపజేస్తుంది. అందుకే *క్షమా వీరస్య భూషణమ్* క్షమించడం అనేది బలహీనత కాదు, బలం అంటారు.
ఇవే కాక, ఆర్థిక ఒత్తిడులు, సమయాభావం, బాహ్యప్రభావాలు, ధార్మిక విలువలు లేకపోవడం, పరస్పర గౌరవం తగ్గిపోవడం కూడా కుటుంబంలో కలహాలకు కారణం అవుతున్నాయి. ఆధునిక జీవనశైలి సౌకర్యాలను పెంచినా, హృదయాల మధ్య దూరాన్ని కూడా పెంచుతోంది. ఒకే ఇంట్లో నివసిస్తున్నా, మనసులు వేర్వేరు లోకాలలో విహరిస్తున్నాయి. కలిసి భోజనం చేసే అలవాటు తగ్గిపోవడం, మనసు తెలుసుకోవాలనే ఆలోచన లేకపోవడం, బాధ పంచుకునే సంస్కారం తగ్గిపోవడం, నావాళ్లు స్థానంలో నేను అనే భావం పెరిగిపోవడం కూడా కుటుంబ కలహాలకు కారణమవుతున్నాయి.
మరి దీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. మొదట కుటుంబంలో హక్కుల గురించి కాక బాధ్యతల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి.
“నాకు ఏమి దక్కింది?” అనే ప్రశ్న కంటే “నేను ఏమి ఇచ్చాను?” అనే ఆలోచన కుటుంబాన్ని కాపాడుతుంది.
రెండవది, ముఖ్యంగా వినడం నేర్చుకోవాలి. సంబంధాలు నిలవాలంటే ఎదుటివారి మాటను సమాధానం చెప్పడానికి కాక, అర్థం చేసుకోవడానికి వినాలి.
మూడవది గెలవడం కాదు బలపడడం ముఖ్యం అన్నది గ్రహించాలి. వాదనలో గెలిచి మనసును కోల్పోవడం మూర్ఖత్వం అవుతుంది. కుటుంబంలో “నేను గెలిచాను” అన్న భావం కన్నా “మన బంధం నిలిచింది” అన్న భావం గొప్పతనం తెలుసుకోవాలి. నాలుగవది, కలిసి ఆచరించే సంస్కృతి పెంపొందించుకోవడం.
ఇక ఐదవది, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవడం. కుటుంబ సభ్యులలోని మంచి లక్షణాలను ప్రశంసించాలి. ప్రశంసించని ప్రేమ క్రమంగా అలసిపోతుంది.
ఆరవది, ఆర్థిక ఒత్తిళ్లు. ధనం కుటుంబాన్ని పోషించడానికి సాధనంగా ఉండాలి కానీ అదే లక్ష్యమైపోతే సంబంధాలు బలహీనమవుతాయి. సంపాదన పెరిగినా సమయం, ప్రేమ, పరస్పర గౌరవం తగ్గితే కుటుంబంలో శూన్యత పెరుగుతుంది.
చివరిగా ముఖ్యమైనది, సహనాన్ని సాధనగా స్వీకరించాలి. కుటుంబంలో కొన్నిసార్లు సత్యం కన్నా శాంతి ముఖ్యమవుతుంది, తర్కం కన్నా ప్రేమ గొప్పదవుతుంది.
కౌరవ వంశం బాహ్య శక్తుల వల్ల కాదు, అంతర్గత ద్వేషం వల్లే నశించింది. ఇది కుటుంబాన్ని బాహ్య శత్రువులు కన్నా అంతర్గత విభేదాలే ఎక్కువ నాశనం చేస్తాయి అన్నదానికి మహాభారతమే మనకు గొప్ప ఉదాహరణ.
కలహాలు రావడం అసహజం కాదు, కానీ కలహాల కంటే బంధం గొప్పదని గుర్తుంచుకొని వాటిని అధిగమించడం సంస్కారం.
అంతిమంగా, కుటుంబం అనేది సంపూర్ణుల సమూహం కాదు, పరస్పర అపూర్ణతలను ప్రేమతో అంగీకరించిన మనుషుల పవిత్ర బంధం. ఇల్లు ఇటుకలతో నిర్మించబడితే, కుటుంబం హృదయాలతో నిర్మించబడుతుంది.
కుటుంబం నిలవాలంటే ఒకరినొకరు మార్చుకోవాలని కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించాలి.
మన సనాతన హిందూ సంస్కృతీ సంప్రదాయాల కుటుంబ ఐక్యతకు ఒక అందమైన మార్గదర్శక శ్లోకాన్ని ఋగ్వేదం
*సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్ ।*
అంటూ కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, పరస్పరం మనస్సులు తెలుసుకోండి, అని బోధించింది.
ఇదే ఆదర్శమైన కుటుంబ జీవనానికి అవసరమైన సూత్రం.
మృశి
(దశిక ప్రభాకర శాస్త్రి)
9849795167
11.04.2026
బ్రాహ్మణి దేవి -
*బ్రాహ్మణి దేవి - సృష్టి యొక్క ఆదిశక్తి*
సప్తమాతృకల పవిత్ర క్రమంలో మొదట నిలిచే దేవి బ్రాహ్మణి. ఆమె బ్రహ్మ దేవుడు యొక్క శక్తి స్వరూపిణి. సృష్టి అనే భావన రూపం దాల్చే ముందు మనసులో మెదిలే ఆ మొదటి ఆలోచన స్పూర్తి - అదే బ్రాహ్మణి తత్వం.
ఆమె కేవలం పురాణాలలో ఉన్న దేవత మాత్రమే కాదు; ప్రతి సృజనాత్మక ఆలోచనకు, ప్రతి జ్ఞానోదయానికి మూలమైన చైతన్యశక్తి.
ఐకానోగ్రఫీ మరియు ప్రతీకలు
బ్రాహ్మణి స్వర్ణవర్ణంతో, శాంతస్వరూపంతో, జ్ఞానమయ కాంతితో దర్శనమిస్తుంది. ఆమె రూపంలోని ప్రతి అంశం లోతైన అర్థాన్ని కలిగి ఉంది.
నాలుగు ముఖాలు
బ్రహ్మలాగే బ్రాహ్మణికి కూడా నాలుగు ముఖాలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలను సూచిస్తాయి. సర్వ విద్యల మూలం, జ్ఞానానికి ఆదిప్రేరణ ఆమెనే అన్న సందేశం ఇందులో ఉంది.
హంస వాహనం
ఆమె వాహనం హంస. హంసకు నీటిలో కలిసిన పాలను వేరుచేసే శక్తి ఉందని ఉపమానం. అదే విధంగా బ్రాహ్మణి భక్తునికి మాయ (అసత్యం) నుండి సత్యాన్ని వేరుచేసే వివేకాన్ని ప్రసాదిస్తుంది.
కమండలువు మరియు జపమాల
కమండలువు - సృష్టి విత్తనాల ప్రతీక.
జపమాల - ధ్యానం, ఏకాగ్రత, జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చే సాధన.
మానసిక స్వచ్ఛతకు బ్రాహ్మణి సాధన
ఈ ఆధునిక కాలంలో మనసు ఎన్నో సమాచారాలతో, దృష్టి మరల్చే అంశాలతో నిండిపోతుంది. ఈ కల్లోలంలో బ్రాహ్మణి “దైవిక వడపోత”లా పనిచేస్తుంది.
ఆమె అనుగ్రహం వల్ల:
సృజనాత్మకత పెరుగుతుంది - కళాకారులు, రచయితలు, ఆవిష్కర్తలకు ప్రేరణ.
https://whatsapp.com/channel/0029Vailh8bGk1FuDeog9W21
మనస్సు పవిత్రమవుతుంది - చిత్తశుద్ధి, సాత్త్విక స్థితి కలుగుతుంది.
బుద్ధి వికాసం - అజ్ఞానాన్ని తొలగించి విద్యా, ఆధ్యాత్మిక రంగాల్లో పురోగతి.
దైనందిన జీవితానికి సందేశం
ప్రతి గొప్ప సాధనకు మూలం శాంతమైన, నియంత్రితమైన మనస్సు మరియు పవిత్ర సంకల్పం. బ్రాహ్మణిని ఆరాధించడం అంటే కేవలం జ్ఞానం కోరకడం కాదు; ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసే సద్గుణాలను కోరుకోవడం.
ఆమె తత్వాన్ని ధ్యానిస్తే, అస్తవ్యస్తమైన ఆలోచనలు సుసంఘటిత దృష్టిగా మారి, మనలోని సామర్థ్యం సాకారమవుతుంది.
బ్రాహ్మణి అనేది సృష్టిని నిర్మించే శాంతమయ శక్తి - సమాజంలో సౌహార్దాన్ని, మనసులో స్పష్టతను నింపే ఆదిమాతృశక్తి.
https://whatsapp.com/channel/0029Vailh8bGk1FuDeog9W21
నైతికత లోపిస్తున్న యువత*
*నైతికత లోపిస్తున్న యువత*
****************************
*ఇరిగో చూడండి మన భావి భారత పౌరులు వీరు*
*కన్నవారి కోటి కలల ఆశాదీపాలు...*
*కొండల్ని సైతం పిండిని చేయగల సమర్ధులు*
*శక్తి యుక్తుల్లో అగ్రగణ్యులు*
*అయినా ఇదేం కర్మమో తెలియదు!*
*ఉరుకుపరుగుల దైనందిన జీవితంలో ఆటుపోట్లతో అలసిసొలసిన ముదిమితరం ఒకపక్క గుదిబండలాంటి సంసార సాగరాన్ని ఈదడానికీ ఇప్పటికీ పడిలేచే కేరటంలా తమవంతు చెమటలు చిందిస్తుంటే!*
*సాధనే తమ లక్ష్యమై*
*శోధనే తమ ధ్యేయమై*
*ప్రగతి పథంలో దేశాన్ని నడపవలసిన నేటి యువతరం మాత్రం మన్నుతిన్న పాములా మందకోడిలా.... సాగుతుందిలా*
*చరవాణి మోజులోపడి బానిసలైపోతున్న సోమరిపోతులు ఇంటింటికీ భారంగా తయారవుతున్నారిలా..,!*
*కుటుంబానికి చేయుత నివ్వవలసిన వయస్సు లో ఇలా వ్యసనపరులై బతకటమేమిటి కర్మ కాకుంటే! ?*
*ఉడుకురక్తం ఉప్పొంగుతున్నా చేతకాని చవటల్లా వండిపెడితే తిని కూర్చోవడమేమిటి బ్రతుకు అర్థం తెలియకుండా ! ?*
*వయసు కావరంతో కన్నవాళ్ళు కానరారు*
*ఉన్న ఊరు కంటికానదు*
*వీరికన్నా మృగాలు నయం*
*వాటి ఆహారం అవే కష్టపడి సాధించుకుంటాయి*
*దేశభక్తి లేదు పెద్ద చిన్న తారతమ్యం లేదు మంచి చెడుల విచక్షణ లేదు దుర్జన సహవాసాలతో దేశతిమ్మరులై తిరుగాడు మానవ మృగాలుగా తయారైనారు*
*ఓ..యువత మేలుకో ఇకనైనా మీరు మారకుంటే మహిలో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోవనుంది జాగ్రత్తసుమ్మి!!*
*....... 0......*
