12, సెప్టెంబర్ 2020, శనివారం

మీరూ మీరూ చూసుకోండి

*ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి!*

"విశ్వనాధ సత్యనారాయణ" వారు స్కూలు టీచరుగా వారి ఊరికి దగ్గరగా ఉన్న గ్రామంలో పని చేస్తుండేవారు. అప్పటి వారి జీతం ఇరవై ఒక్క రూపాయలు. విశ్వనాధ వారు పోషించేది తొమ్మిదిమందిని: తల్లి, తోబుట్టువులు, వారి పిల్లలు, ముగ్గురు తమ్ముళ్ళు. రాబడి తక్కువ. ఒకనాటి రాత్రి వారి అమ్మగారు పార్వతమ్మగారు వచ్చి, “నాన్నా, బియ్యం రేపటికి నిండుకున్నవి. చాట అప్పుపుట్టే తీరు లేదు.” అన్నారు. విశ్వనాధ వారు “సరేలే అమ్మా! “ అన్నారు.

పాపం మరుసటి రోజు స్నానాదికాలు ముగించుకుని బయటకు వెళ్లారు. ఆ రోజుల్లో శని, ఆదివారం రెండూ సెలవుదినాలు. ఉదయం వెళ్లి రాత్రి పదిన్నరకు తిరిగి వచ్చారు. ఆరోజుల్లో బ్రాహ్మణుల ఇళ్ళలో ముందు ఒక నీళ్ళ తొట్టి, దాని మీద ఒక కర్ర తో చేసిన మూత ఉండేది .పెరట్లో మరొక నీళ్ళ తొట్టి మూతతో ఉండేది. బయట నుంచి రాగానే ముందు కాళ్ళు కడుక్కుని ఇంటి లోకి ప్రవేశించటం పద్ధతి . భోజనం అనంతరం పెరట్లో ఉన్న తొట్టి వద్ద కాళ్ళు కడుక్కోటం ఆచారం.
విశ్వనాథవారు వచ్చీ రావటంతోటే పద్ధతి ప్రకారం బయట కాళ్ళు కడుక్కోకుండానే సరాసరి వంటింట్లోకి వెళ్లి చూశారు. పొయ్యిలో పిల్లి లేవలేదు. గొప్ప ఖేదానికి గురయ్యారు.

అప్పుడు పాదప్రక్షాళనం చేసి, ముఖం కడుక్కుని “మా స్వామి“ అనే శతకం వ్రాయటం మొదలు పెట్టారు. 'మా స్వామి' లోని మొదటి రెండు పద్యాలు రామాయణ కల్పవృక్షానికి నాంది.
పది, పదిహేను పద్యాలు వ్రాసిన తర్వాత ఒక పద్యంలో అంటారు,
*“మా నాన్నగారికి, నీకు లావాదేవీలు ఏమున్నాయో నాకు తెలియదు. ఏమైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి. నన్నిలా కష్ట పెడితే మాత్రం నేను ఊరుకునేదిలేదు. ఆహితాగ్ని పెట్టెలో ఉన్న నీ బంగారు లింగాన్ని తెగనమ్ముతాను. రెండు బస్తాల బియ్యం, దినుసులు తెచ్చుకుంటాను”* అని వ్రాస్తుండగా,

తలుపు తడుతున్న శబ్దం అయింది. తల్లి పార్వతమ్మ గారు తలుపు తెరిచారు. బండి తీసుకుని వచ్చిన వ్యక్తి “అమ్మా, కపిలేశ్వరపురం నుంచి రావి సూరయ్య గారు తమకు ఇవ్వమని రెండు బస్తాల బియ్యం , కందిపప్పు మూట, బెల్లపు బుట్ట, నెయ్యి పంపించారు. ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే ఆ బస్తాలు పంచలో పెడతాను“ అన్నారు. అది విశ్వనాధ వారి భక్తి , నిర్భీతి, వారి కున్న దైవానుగ్రహం!🙏

(శ్రీ విశ్వనాథ వారి జయంతి సందర్భంగా...)

*ఓం నమఃశివాయ*

కామెంట్‌లు లేవు: