7, నవంబర్ 2020, శనివారం

రామాయణమ్..117

 రామాయణమ్..117

అరణ్యకాండము ప్రారంభము

.

ప్రవిశ్య తు మహారణ్యం దణ్డకారణ్యమాత్మవాన్.

రామోదదర్శదుర్దర్షస్తాపసాశ్రమమణ్డలమ్.

.

బుద్ధిమంతుడు ,ఎవరూకూడ తేరిపారచూడసాధ్యముకాని వాడు ఎదిరింపశక్యము కాని వాడు అయిన రాముడు దండకారణ్యములో ప్రవేశించి మునుల ఆశ్రమ సముదాయాన్ని చూశాడు.

.

ఆ ముని వాటికలలో అన్ని మృగాలూ నిర్భయంగా సంచరిస్తున్నాయి.వాకిళ్ళు అన్నీ రంగవల్లులతో తీర్చిదిద్దబడి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమం చుట్టూ మధురఫలాలనిచ్చే ఎన్నో వృక్షాలు దట్టంగా ఏపుగా పెరిగి చూడటానికి మనోహరంగా ఉన్నాయి.

.

ఆ ఆశ్రమంలో బలిహోమాలతో దేవతాపూజలు,వేదఘోషలతో ప్రాంగణమంతా మారుమ్రోగుతూ బ్రహ్మలోకాన్ని తలపిస్తున్నది.

.

సూర్యుడితో సమానమైన తేజస్సుగల మహామునులంతా ఆ ఆశ్రమంలో నివసిస్తున్నారు.

.

వారందరినీ చూసి తన ధనస్సుకు ఉన్న నారి విప్పివేసి మెల్లగా వినయపూర్వమకముగా వారున్న వైపుకు రాముడు వెళ్ళాడు.

.

సీతారామలక్ష్మణులను కాంచినంతనే మునులు ఎదురేగి స్వాగతము పలికారు.

.

వారందరికీ ఒకటే ఆశ్చర్యం అబ్బ! ఎంత నయనమనోహరంగా ఉన్నాడు రాఘవుడు.

మంచి శోభతోకూడిన శరీర సౌష్ఢవము,సౌకుమార్యము,అద్భుత రూపసౌందర్యము చూసి రెప్పవాల్చకుండా తదేకంగా వారినే చూస్తూ ఉండిపోయారు ఆ ముని గణమంతా!

.

సీతారామలక్ష్మణులకు ఆశ్రమప్రాంగణంలో ఒక పర్ణశాలలో బస ఏర్పాటు చేసి ఆయనను సత్కరించి వినయపూర్వకముగా వేడుకున్నారు.,"రాఘవా,నీవే మాకు రాజువు రక్షకుడవు కావున సర్వదా తల్లిగర్భమును రక్షించినట్లు నీవు మమ్ములను రక్షించ వలెను ." అని పలికారు అందరూ.

.

వారి ఆతిధ్యము స్వీకరించి సూర్యోదయమైన వెంటనే మరల బయలు దేరాడు శ్రీ రాముడు.

.

అరణ్యమధ్యంలోకి ప్రవేశించారు.

అడవి ఈగలు రొదపెడుతున్నాయి,క్రూరమృగాలు గుంపులుగా తిరుగుతూకనపడుతున్నాయి.ఆ ప్రదేశంలో ఉన్న లతలూ వృక్షాలూ పాడుబడ్డట్టుగా కనిపిస్తున్నాయి.ఎక్కడా జలాశయమన్నదే కానరావడంలేదు.ఇంతలో ఎక్కడనుండో వస్తున్న భయంకరమైన అరుపులు పెడబొబ్బలతో అరణ్యమంతా మారు మ్రోగిపోతున్నది.

.

వారి ఎదురుగా పర్వతకాయుడైన ఒక రాక్షసుడు వికృతంగా అరుస్తూ నిలబడి ఉన్నాడు.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: