14, జూన్ 2023, బుధవారం

శ్రీ సంజీవ రాయస్వామి ఆలయం

 🕉 మన గుడి : 


⚜ కడప జిల్లా : వెల్లాల


⚜ శ్రీ సంజీవ రాయస్వామి ఆలయం.



💠 కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి సమీపంలో గల వెల్లాల గ్రామంలో వెలసిన ఆంజనేయ స్వామి దేవాలయం చాల పురాతనమైన మరియు శక్తి వంతమైన దేవాలయం . 

ఈ దేవాలయాన్నే సంజీవరాయ స్వామి దేవాలయం అని కూడా అంటారు 


💠 శ్రీ ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాలలో ‘వెల్లాల’ ఒకటి. 


💠 ఆంజనేయస్వామి సంజీవ పర్వత ప్రదేశానికి వెళ్తూ.. మార్గ మద్యలో ఆగి నదిలో స్నానమాచరించి సూర్య భగవానుని ఆరాధించిన ప్రదేశంలో వెలసిన మహిమాన్విత అలయమే శ్రీ సంజీవ రాయస్వామి ఆలయం..


💠 ఇక్కడ హనుమంతుడు ‘సంజీవ రాయుడు’ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. 


⚜ స్థలపురాణం ⚜


💠 రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని మొక్క కోసం బయలుదేరిన హనుమంతుడు..... సాయంత్రం అయ్యేసెరికి స్వామి వారు సంద్యా వందనం కోసం ఇక్కడ కుందూ నది  దగ్గర ఆగి ఆ నదిలో స్నానం చేశారు... అందువలన ఆ గుండానికి హనుమంతు గుండం అనే పేరు వచ్చింది.

గుండం దగ్గర రాతిమీద స్వామివారి పాదముద్రలు కనిపిస్తాయి.


💠 అక్కడ నది దగ్గరలో  ఉన్న మహర్షులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని ఆ అంజనేయస్వామి వారిని మీరు కాసేపు ఇక్కడ వుండమనగా,ఆ స్వామి వారు నేను  ‘వెళ్లాలి .. వెళ్లాలి’ అంటూ హనుమంతుడు ఆతృతను కనబరిచారు. 

అందువలన ఈ గ్రామానికి ‘వెల్లాల’ అనే పేరు వచ్చిందని గ్రామస్థులు చెబుతుంటారు. 


💠 మహర్షుల అభ్యర్థన మేరకు ఆ తరువాత కాలంలో ఇక్కడ వెలసిన స్వామికి, 15వ శతాబ్దంలో కడప రాజ్యాన్ని పాలించిన  ‘హనుమంత మల్లు’ అనే రాజు  ఒకసారి వేటకు కుందూ నది సమీపంలో వెళ్ళారు.. వేట కు  వచ్చిన రాజు కు.. ఆరోగ్యం సహకరించలేదు

ఆరోగ్యం  బాగాలేక కొన్ని రోజులు ఈ అడవిలోనే కుందూ నది పరిసర ప్రాంతంలోనే నివాసం ఉన్నారు..


💠 ఆ రాజుకి   శ్రీ ఆంజనేయ స్వామి వారు కలలో కనపడి ..నేను ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నాను...నాకు ఒక ఆలయం కట్టించు అని చెప్పారు...దానికి ఆ రాజు అడవి అంత గాలించారు..చివరికి ఒక 3 అడుగుల స్వామి వారి రూపం దొరికింది..స్వామి వారి రూపం దొరకగానే ఆ రాజు ఆరోగ్యం బాగైంది..దాంతో

రాజు ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. 


💠 15 శతాబ్దం లో 3 అడుగులు ఉన్న విగ్రహం దినదినాభివృద్ది  పెరుగుతూ ఇప్పటికీ 16 అడుగులకు(సుమారుగా) చేరింది..అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూపం పెరుగుతూ వచ్చింది..


💠 ఈ ఆలయంతో పాటు ఇక్కడ 

 శ్రీ చెన్నకేశవస్వామి, 

 శ్రీ భీమలింగేశ్వరస్వామి, 

 శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవాలయాలు ఉన్నవి. 

ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులు కొలువుదీరినా సంజీవరాయునికున్న వైభవం చాలా గొప్పది.


💠 సంజీవరాయుని దర్శనం కోసం ఎన్నో ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. గ్రహదోషాలను తొలగిస్తాడని, దీర్ఘవ్యాధి బాధలనుండి దూరంచేస్తాడని, కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం.


💠 ఇక్కడ నిత్య పూజలతో పాటు, పండుగ పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. హనుమ జయంతి నాడు ప్రత్యేక ఉత్సవాలను జరిపిస్తారు.


💠 ప్రొద్దుటూరు నుండి 24 km, కడప నుండి 75km , అళ్ళగడ్డ నుండి 28 km, మైదుకూరు నుండి 40km

కామెంట్‌లు లేవు: