12, జులై 2023, బుధవారం

మాయమయ్యే మహాస్వామి

 మాయమయ్యే మహాస్వామి


కుంభకోణం సమీపంలోని కుగ్రామంలో ఒక మండువా ఇంటిలో శ్రీవారు బసచేసి ఉన్నారు. స్వామివారిని దర్శించడానికి మన దీక్షితులుగారు పరిచారకులను అడిగి తెలుసుకును స్వామివారున్నారన్న గదిలోనికి ఓరవాకిలిగా మూసిఉన్న తలుపు తీసుకుని ప్రవేశించారు.


అక్కడ స్వామివారు కూర్చునే ఆసనం ఉన్నది. కమండలం ఉన్నది. కాషాయ ఖద్దరు శాఠీలున్నాయి. స్వామివారు కన్పించలేదు. బయటకు వెళ్లి ఉండవచ్చని గుమ్మం దగ్గరే కూర్చున్నారీయన. ఎంతసేపయినా అలికిడి లేదు. పరిచారకులు మాత్రం స్వామివారు గదిలో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు. 


గంట గడిచాక ఉండబట్టలేక దిక్షితులుగారు పరిచారకుణ్ణి “స్వామివారు ఎక్కడ?” అని అడిగారు. “లోపల జపం చేసుకుంటున్నారు కదా! మీరు వెళ్లి చూసివచ్చి మళ్ళి అడుగుతారేమ” న్నాడు పరిచారకుడు. లోపల లేరని తెగేసి చెప్పారు దీక్షితులు గారు. ఇద్దరూ కలిసి లోపలికి ప్రవేశించారు. ఆచమనం చేస్తూ స్వామి అగుపించారు. “ఇందాక నేను చూసినప్పుడు మీరు అదృశ్యమైనారు” అన్నారు దీక్షితులు గారు. స్వామీ సమాధానంగా చిరునవ్వు నవ్వారు.


ఈయనకోక్కరికే కాదు ఇటువంటి అనుభూతి. తెనాలి సీతమ్మగారు ఇటువంటి అనుభూతి పదే పదే చెప్పేవారు. దక్షిణాదిన ఒక గ్రామంలో దర్భపొదల మధ్య మేనా దింపి బోయీలు విశ్రాంతి తీసుకుంటున్నారు. పరిచారకులందరికి కునుకు పట్టింది. సీతమ్మ గారి భర్తకి స్వామివారిని తక్షణమే చూడాలన్న ఆవేశం పుట్టుకొచ్చింది. మేనా తలుపు తీసి చూశారు. 


లోపల స్వామీ కన్పించలేదు. అనుమానం వచ్చి హారతి వెలిగించి చూశారు. అబ్బే! స్వామి లేరు, పారిశాడులను బోయీలను లేపారు. మేనా తలుపు తీసి చూశామంటే వారేమంటారో అని “లోపల స్వామివారున్న అలికిడి లేదు చూడ”మన్నారు. వారు “తలుపులు మూసుకునే లోపల ఉంటారు. మీరు విశ్రాంతి తీసుకోండి” అని గట్టిగానే చెప్పారు.


సితమ్మగారికి, భర్తకి, పిల్లవానికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. భార్యాభర్తలు పిల్లవాడు మీనాకు చేరోకప్రక్కన కూర్చుని ధ్యానం చేస్తూ గడిపారు. మూడు గంటలకు పహారా వాళ్ళు, బోయీలు, పరిచారకులు నిద్రలేచి క్రొత్త కాగడాలు వెలిగించి “రామో రామయ్యా” అంటూ మేనా ఎత్తగానే తలుపు తీసి చిరునవ్వు నవ్వుతూ చేయెత్తి ఆశీర్వదిస్తున్నారు స్వామివారు. 


మహాభక్తురాలు సీతమ్మ. స్వామివారియెడ పుత్రప్రేమ. “రాత్రంతా మమ్మల్ని భయభ్రాంతుల్ని చేశారు. ఎక్కడికి అదృశ్యమైనారు” అని గట్టిగా అడిగింది. అంత తేలికగా పట్టుబడతారా స్వామివారు. 


వెన్నెల విరిసినట్లు చిరునవ్వులొలకబోశారు. మా స్వామివారి చిరునవ్వు సొగసులో ఎవరైనా సరే కొట్టుకొనిపోవలసినదే! ప్రశ్నించేందుకు ఆ క్షణంలో మనస్సు ఉండదు.


--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: