1, ఆగస్టు 2023, మంగళవారం

అంతరాత్మ దర్శనం....

 *అంతరాత్మ దర్శనం.....*



వాస్తవ ప్రపంచంలో తప్పు చేసేవాడొకడు. దాని మూలంగా బాధపడేవాడొకడు. దాని గురించి ఫిర్యాదిచ్చేవాడొకడు, బందించి తీసుకేల్లెవాడొకడు, కాపలాకాసేవాడొకడు, బోనులో నిలబెట్టేవాడొకడు, ప్రశ్నలడిగేవాడొకడు, సాక్ష్యం చెప్పేవాడొకడు, తీర్పిచ్చేవాడొకడు, దాన్ని అమలు పరిచేవాడొకడు. అని ఇంతమంది ఉంటారు.


అంతిమ సత్య ప్రపంచంలో మాత్రం ఇంతమంది ఉండరు. అక్కడ నీకు నువ్వే ముద్దాయివి. నీకు నువ్వే బాధితుడివి. నీకు నువ్వే ఫిర్యాదివి. నీకు నువ్వే రక్షకభటుడివి. నీకు నువ్వే చెరసాల అధికారివి. నీకు నువ్వే ప్రాసిక్యూటరువి. నీకు నువ్వే డిఫెన్సు లాయరువి. నీకు నువ్వే సాక్షివి. నీకు నువ్వే న్యాయమూర్తివి. అక్కడ నువ్వు తప్ప నీకింకెవ్వరు కనిపించరు. అదొక ఒంటరి లోకం. అందుచేత అది ప్రపంచంలోకెల్లా అత్యంత క్రూరమైన న్యాయస్థానం.


నూటికి 99.99 శాతం మంది మనుషులు (మనస్సులు) దాన్ని బ్రతికి ఉండగా కనీసము ఊహించలేరు. జరిగిన సంఘటనల తాలూకు గుప్తమైన స్మృతుల చిత్రాలు (దృశ్యాలు) గా మనస్సు యొక్క లోలోపలి పొరల్లో నుంచి సర్వసమగ్రంగా వెలికి తియ్యబడుతాయి. ఆ గుప్తమైన చిత్రాలు (సంఘటనలు) గుర్తుకు రావడానికి 'చిత్రగుప్తుడు' అని పేరు.


దేవుడు లేడనవచ్చు. శాస్త్రాలు అబద్దమనవచ్చు. కాని తానున్నాడు. తాను మాత్రం అబద్దం కాదు. తానూ కుట్ర కాదు. తానూ నిజం. అందుకే చేశాడు ఈశ్వరుడు ఈ ఏర్పాటు. ఆ ఒంటరి నిర్జయ న్యాయస్థానం. అక్కడ న్యాయ సూత్రాలంటూ ఏమి ఉండవు. నీకు నువ్వు ఏర్పరచుకున్న చట్టం ప్రకారమే నువ్వు విచారించబడతావు. నువ్వు గతంలో ఇతరులకు చెప్పిన నీతుల్ని బట్టి నువ్వు కూడ విచారించబడతావు.


నువ్వు బతికుండగా ఎంత పండితుడవైతే అంతా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది నీమీద జరగబోయే విచారణ. నిన్ను నువ్వే దర్యాప్తు చేస్తావు. కర్కశంగా దర్యాప్తు చేస్తావు. నువ్వంటే నువ్వు కాదు. నీలో ఉన్న అంతరాత్మ చేస్తుంది. అందుకే దానికి ఆ పక్షపాత రహిత ధోరణి. ఆ నిస్వార్ధం. అది ప్రపంచానికి నిజమైన ప్రభుత్వం. అది తప్పొప్పుల విచారణలో బహు క్రూరమైనది. మానవ మనస్సులా అది తనను తానూ మోసం చేసుకోదు. మానవ మనస్సు మొద్దబ్బాయిలాంటిది. తప్పించుకోవడానికి అడ్డదార్లు వెతికే ఖైదీలాంటిది. దేవుడికే లంచమిద్దామని ఆలోచిస్తుంది.


కాని ఆ న్యాయమూర్తి (అంతరాత్మ) లంచం తీసుకోదు. తనకు లంచంగా ఇవ్వజుపిన వాటిని భద్రంగా దాచిపెట్టి శిక్షాకాలం పూర్తయ్యాక ఖైదీకే వడ్డీతో సహా అప్పగిస్తాది. వీటికి వేరు వేరు ఖాతాలు నిర్వహించబడుతాయి. ఒక ఖాతా ప్రాతిపదిక మీద ఇంకో ఖాతా రద్దయ్యే ప్రసక్తే లేదు. ఆ అంతరాత్మ ఎవరో కాదు. స్వయంగా నువ్వే. అక్షరాల నువ్వే. కాని లక్షలాది మంది ఈ సత్యాన్ని తాము బ్రతికుండగా గ్రహించలేరు. ఇదొక పార్శ్వం.


ఒకవేళ బతికుండగానే గ్రహించగలిగితే.. అది అసంభవం కాదు. నూటికో కోటికో ఒక్కరు మాత్రమె ఉంటారు అలాంటివాళ్ళు. వాళ్లకు అంతరాత్మ గ్రాంధిక భావన కాదు. కాలు చెయ్యి ఉండడం ఎంత నిజమో అంతే వాస్తవంగా వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. సాధారణంగా మోక్షం పొందడానికి ఎవరైతే తపన పడతారో, ఎవరైతే భగవంతుడి దర్శనం కోసం తాపత్రయ పడతారో, వారికి అంతరాత్మ దర్శనం కలుగుతుంది. అంతరాత్మ దర్శనమిచ్చినప్పుడు మనిషి దిగ్భ్రాంతి చెందుతాడు.


ఎందుకంటే ఆ మహా మహనీయ తేజోమూర్తి దర్శనం మన పరిభాషలో వర్ణింప సఖ్యం కానటువంటిది. ఆ భగవత్ స్వరూపం తానే అని తెలుసుకోవడం వల్ల దిగ్భ్రాంతి చెందుతాడు, ఎంతో గగుర్పాటుకు లోనవుతాడు. ఆ అంతరాత్మ దర్శనం ముగిసిన తరువాత తిరిగి మరల ఈ లోకంలోకి వచ్చినపుడు ఒకరకంగా మానవుడు దుఃఖిస్తాడు. ఎందుకంటే.. లక్షల కోట్లాది సంవత్సరాల వయసు గల ఆ సనాతన ధర్మమూర్తి నువ్వేనా స్వామి.. నువ్వు అసలు లేనే లేవనుకున్నాను ఇంతకాలమూ.


కృష్ణుడు రాముడు అంతా బోగస్ అనుకున్నాను స్వామి.. నిన్నిక్కడే పెట్టుకొని ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. నాలోనే ఉన్నావని తెలుసుకోలేకపోయాను స్వామి. అని ఆ దేవదేవుడైన అంతరాత్ముడి దర్శనం పొందిన తర్వాత తానూ వేటికి భయపడదు సరికదా పాపాలకు పడే శిక్షల నుండి తప్పించుకుందామనే ఆలోచన శాశ్వతంగా అంతరించిపోతుంది. తండ్రి మాట మీద బడికి వెళ్ళడానికి సిద్ధమయ్యే బుజ్జి కొడుకులా తప్పులకు శిక్ష అనుభవించడానికి ఆనందంగా సిద్దపడుతాడు.


ఈ దర్శనంతో క్రూరమైన, ఒంటరి, నిర్మానుష్య న్యాయస్థానం అనుకున్నది కాస్తా హఠాత్తుగా నాన్నగారి ఆఫీసులా మారిపోతుంది. ఇది ఇంకో పార్శ్వం. అలా ఆ పరమాత్ముడి దర్శనంతో అన్నీ సమస్తం పటాపంచలు. అది కలిగాక వెయ్యి నాస్తిక(అంటే దేవుడే లేడు) గ్రంధాలు చదివినా ఏ మార్పు ఉండదు. లక్షమంది నాస్తికుల మధ్య ఉన్న ప్రభావం ఉండదు. అందరిలోనూ తానే కనిపిస్తాడు అంటే అంతటా తను తన అంతరాత్మనే దర్శిస్తాడు.


ఆ స్థితిలో మనిషి మెయిన్ రోడ్డు మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అంతా అంతరాత్మే. స్కూటర్లు, కార్లు, బస్సులతో సహా మనుషులంతా అంతా నేనే అనిపిస్తుంది. ఆ స్థితిలో అతడు తనని తానే పూజించుకునే అవకాశం కూడా వుంది...


*|| ఓం నమః శివాయ ||*

కామెంట్‌లు లేవు: