30, అక్టోబర్ 2023, సోమవారం

వేదబాహ్యులు

వేదబాహ్యులు – 3 చివరి పార్టు

భగవద్గీతలో చార్వాకదర్శనం

.

భగవద్గీత 16 వ అధ్యాయం, దైవాసురసంపద్విభాగ యోగం లో అసుర దైవ లక్షణాలను వివరిస్తూ కృష్ణుడు చార్వాకభావాలను అసురులకు ఆపాదిస్తూ ఇలా అంటాడు – “అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు. జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టాయని వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు. ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు. (వికీ సోర్స్)


పై వాక్యాలు చార్వాకవాదానికి ప్రతివిమర్శగా రాసారని ఇట్టేపోల్చుకోవచ్చును.  “అప్పుచేసైనా నెయ్యి తిను” అని ప్రక్షిప్తం చేసినట్లుగానే “ఈ జగత్తుకు కారణం కామమే” అని చార్వాకులు అన్నట్లు ప్రచారించారు. దీనికి ఆధారంగా  చార్వాకమతానికి చెందినదని చెప్పబడే  “kāma evaikaḥ puruṣārthaḥ” (కామం మాత్రమే పురుషార్ధం) అనే వాక్యాన్ని చూపుతారు. ధర్మార్ధకామ మోక్షాలను పురుషార్ధాలుగా చెప్పటం బ్రాహ్మణీయభావజాలం. తదుపరి జన్మ, మోక్షం లాంటి భావాలను అంగీకరించక, స్వేచ్ఛాజీవనాన్ని ప్రవచించిన చార్వాకులు పురుషార్ధాలు అనే చట్రాన్ని అంగీకరించి ఉంటారా అని  Battacharya ramkrishna ప్రశ్నిస్తారు.


మహాభారతం వనపర్వంలో (33:57) చిన్నప్పుడు తండ్రి ఒడిలో కూర్చుని ఒక బ్రాహ్మణుడు చెప్పే బార్హస్పత్య సూత్రాలను ఏపనీ లేకపోయినా ఏదో పనికల్పించుకొని వెళ్లి వినేదానినని ద్రౌపతి ధర్మరాజుతో చెబుతుంది.  (వనపర్వం నీతిం బృహస్పతిప్రొక్తాం భరాతౄన మే ఽగరాహయత పురా/తేషాం సాంకద్యమ అశ్రౌషమ అహమ ఏతత తథా గృహే)

.

ఆరుగురు గురువులు

BCE 5 వ శతాబ్దానికి చెందిన మగధరాజైన అజాతశత్రు ఒకరోజు రాజభవనం మిద్దెపై కూర్చుని తాత్వికచర్చ చేయటానికి సరైన సన్యాసి ఎవరున్నారు అని తన మంత్రులను అడగగా వారు- అజితకేశ కంబళ, పూరన కస్సప, మఖలి గోశాల, పకుధకచ్ఛాయన, సంజయబేలత్తిపుత్త, నిగంత్తనాతపుత్త అనే ఆరుగురి పేర్లు చెప్పి;  వీరందరూ చాలాకాలంగా సన్యాసిజీవనాన్ని గడుపుతున్నారని, ప్రతిఒక్కరు తమదైన తాత్విక సంప్రదాయాన్ని నెలకొల్పి దానికి గురువులుగా ఉంటూ దాన్ని ప్రచారం చేసుకొంటున్నారని చెప్పారు. అదే సమయంలో అజాతశత్రు వ్యక్తిగత వైద్యుడైన జీవకుడు, ఆసమయంలో  రాజగ్రుహలో సమీపంలో బసచేసి ఉన్న బుద్ధుని వద్దకు అజాతసత్రుని తీసుకొని వెళ్లాడని బౌద్ధ గ్రంథం Samannaphala Sutta లో ఉంది. 

.

1. అజిత కేశకంబళ

.

BCE 6 వ శతాబ్దానికిచెందిన అజిత కేశకంబళ  మొట్టమొదటి భౌతికవాది. ఇతను బుద్ధుని సమకాలీనుడు.  ఇతనికి పూర్వం ప్రాచీనభారతీయ సాహిత్యంలో భౌతిక వాద ఛాయలు ఉన్నప్పటికీ ఒక వ్యక్తిగా అజితకేశకంబళ పేరు ప్రాచీన భారతవేదాంత గ్రంధాలన్నింటిలో కనిపిస్తుంది. ఇతడు చెప్పినబోధనలకు సంబంధించిన వివరాలు నేరుగా దొరకవు.  బౌద్ధ పాలి, జైన ప్రాకృత రచనలలో ఇతని గురించిన ప్రస్తావనలు విరివిగా లభిస్తాయి.  వారు ఇతని సిద్ధాంతాన్ని స్మశానవైరాగ్యంగా అభివర్ణించారు. బౌద్ధ, జైన మతాలు అజితకేశకంబలను వారికి పోటీ దారునిగా చూసిన కారణంగా వారి వ్యాఖ్యలు అంత విశ్వసనీయమని భావించలేం. (రి. Studies on Carvaka/Lokayata by Battacharya ramkrishna pno28 )


అజితకేశ కంబళ బుద్ధుని కంటే వయసులో పెద్ద. ఇతను మనిషివెంట్రుకలతో చేసిన కంబళి వేసుకొని తిరిగేవాడు.  Anguttara Nikaya (3.135) లో బుద్ధుడు అజితకేశ కంబళునిగురించి ఇలా అన్నాడు-“ఇతను వేసుకొనే వెంట్రుకల దుస్తులు చాలా అసౌకర్యం. వేసవిలో వెచ్చగా, శీతాకాలంలొ చల్లగా, దుర్వాసనవేస్తూ, దురదలు కలిగిస్తూ ఉంటాయి ” (The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann pn 221)


మగథ రాజైన అజాతశతృతో అజితకేశకంబళి చేసిన సంభాషణ Sāmañña-phala-sutta లో ఇలా ఉంది.  


“ఓ మహారాజా! దానాలు, బలులు, నైవేద్యాల వల్ల ఏ ఫలితమూ లేదు.  మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు.  ఈ లోకము లేదు పర లోకమూ లేదు”. 


పై వాఖ్యలోని చివరిభాగం మహాభారతంలో కనిపిస్తుంది.  భీష్ముడు యుధిష్టిరునితో “కొంతమంది  “ఈ లోకము లేదు పర లోకమూ లేదు” అని భావిస్తారు. అటువంటి నాస్తికులను నమ్మరాదు” అంటాడు.  (శాంతిపర్వం131.13)


దాదాపు అదే వాక్యం భగవద్గీతలో కూడా కనిపిస్తుంది (4.40)

సంశయంలో పడ్డవాడికి “ఈ లోకము లేదు పర లోకమూ లేదు”. సుఖం కూడా లేదు.


సమాధానం ఇవ్వకతప్పని వాదన చేసాడు అజితకేశకంబళ.  దానికి ఒక చోట అలాంటి వారిని నమ్మరాదని, మరో చోట వారు సంశయవాదులని, వారికి సుఖం ఉండదని  మహాభారతం ద్వారా బ్రాహ్మణవాదులు సమాధానం ఇచ్చారు.  అజితకేశకంబళ చేసిన భావవాదపు శక్తి అది. 


Dlgha Nikaya 2.23 లో అజితకేశకంబల ఇతర  ప్రవచనాలు    ఇలా ఉన్నాయి


1. మంచి చెడు కర్మలంటూ ఏమీ లేవు.

2. స్వర్గ నరకాలు ఏమీ లేవు. 

3. తల్లి దండ్రి అంటూ ఎవరూ లేరు.  వారికి చేసే మంచి చెడులకు ఫలితాలు ఏమీ ఉండవు

4. మరణించాక మరుజన్మ, ఆత్మ  అంటూ ఏమీ ఉండవు.  ఈ దేహంలోని మట్టి మట్టిలో, నీరు నీటిలో, గాలి గాలిలో, వెచ్చదనం నిప్పులో, ఆలోచనలు శూన్యంలో కలిసిపోతాయి. 

5. మూర్ఖుడు, జ్ఞాని చనిపోయాకా ఒకేలా మట్టిగా మారతారు. 

6. శవాన్ని నలుగురు స్మశానానికి మోసుకెళతారు.  కొన్నాళ్లకు పావురంరంగులోకి మారి వెలిసిపోయిన ఎముకలు మాత్రమే స్మశానంలో మిగులుతాయి. 

6. చనిపోయిన వ్యక్తిపేరిట దానదర్మాలు చేయటం అవివేకం 

అజిత కేశకంబళి   నెలకొల్పిన సంప్రదాయం CE 6 వ శతాబ్దపు చార్వాకుల వరకూ కొనసాగి ప్రశ్నించటం, వాదించటం, ధిక్కరించటం ఈ దేశ సంస్కృతికి, బహుళత్వానికి వెన్నుగర్ర అని నిరూపించింది. 

.

2. పూర్ణ కాశ్యప/పూరన కస్సప

.

పూర్ణకాశ్యపుని గురించిన ఆధార గ్రంథాలు లభించవు.  జైన బౌద్ధ రచనలలో ఇతనిని విమర్శిస్తూ చేసిన కథనాల ద్వారా ఇతను వేదాలను తిరస్కరించి, దిగంబరంగా సంచరిస్తూ,  భౌతికవాదాన్ని ప్రవచించాడని అర్ధమౌతుంది.  ఇతను- ఒక గృహబానిస అని, ఇంటినుండి పారిపోగా, దారిలో దొంగల దోపిడీకి గురయి కట్టుబట్టలుకూడ కోల్పోయి దిగంబరంగా సంచరిస్తూ, అందరిని అపహాస్యం చేస్తూ చివరకు నిరాశతో, దుఃఖితుడై చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడని బుద్ధ ఘోషుడు తన “సుమంగళ విలాసిని” అనే గ్రంథంలో పేర్కొన్నాడు (రి. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya pn 513) 


పూర్ణ కాశ్యపుడు చాన్నాళ్ళు గృహస్థుగా జీవించాడని, సన్యసించాక తనకు వచ్చే భిక్షాన్ని నాలుగుభాగాలు చేసి మూడుభాగాలు బాటసారులకు, కుక్కలకు, కాకులకు, చేపలకు పంచి నాలుగోభాగాన్ని తను తినేవాడని  - “భాగవతీ సూత్ర”  అనే జైన గ్రంథంలో  కనిపిస్తుంది. 


పూర్ణ కాశ్యప బోధించిన వాటిలో ముఖ్యమైన అంశాలు-యజ్ఞయాగాదులు, కర్మకాండలు , పాపపుణ్యాలు, స్వర్గనరకాలు లేవు.  మంచి చేస్తే పుణ్యం రాదు, చెడు చేస్తే పాపం అంటదు. దానధర్మాలు అర్ధరహితం. ఈ ప్రపంచం నియతిజనితం (ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అనే వాదన /Every thing is born  of destiny). 


15 వ శతాబ్దపు జైనపండితుడు గుణరత్న తాను రచించిన “తర్క రహస్య దీపిక” అనే గ్రంథంలో పూర్ణ కాశ్యపుడు ప్రవచించిన నియతివాదాన్ని  ప్రస్తావించాడు.  పాలిరచనల్లో చెప్పిన పూర్ణ కాశ్యపుని బోధనలు రెండువేల ఏండ్ల తరువాత కూడా ఉటంకించబడటం భౌతికవాద దృక్ఫథపు బలంగా భావించాలి. 

3. మఖలి గోశాల (చూడుడు అంతర్ధానమైన ఆజీవిక మతం వ్యాసం. మొదటి కామెంటు లింకులో )

.

4. పకుధ కచ్ఛాయన /ప్రకృత కాత్యాయనుడు

.

పకుధ కచ్చాయన భౌతికవాది. ఇతను కర్మవాదాన్ని అంగీకరించలేదు. ప్రకృతిలో భూమి, నీరు, అగ్ని, గాలి తో పాటు జీవితము, సుఖ, దుఃఖాలు కూడా ఉంటాయని చెప్పాడు. ఈ ఏడు అంశాలు స్థిరమైనవి, మార్పులేనివి ఒకదానిని మరొకటి ప్రభావితం చేయలేనివి అంటాడు. భౌతిక అంశాలతో పాటు అభౌతికాలైన  జీవితము, సుఖదుఃఖాలను చేర్చటం అనేది కచ్ఛాయన సిద్ధాంతంలోని ప్రత్యేకతగా భావించాలి. 

.

5. సంజయబేలత్తిపుత్త

సంజయబేలత్తిపుత్త స్పష్టమైన భౌతిక వాది.  గోచరమైనవి తప్ప మిగిలినవాటిని నమ్మరాదని ప్రవచించాడు. ఇది కొంతమేరకు చార్వాకుల వాదం.  ఇతను ఏ సమకాలీన సిద్ధాంతాలను అంగీకరించనూ లేదు ఖండించనూ లేదు. ఈ లోకంలో దేనిమీదా సంపూర్ణమైన అవగాహన  ఉండదని, ఒకే అంశాన్ని భిన్నవిధాలుగా వ్యాఖ్యానించవచ్చుకనుక, ఇది మంచి, ఇది చెడు, ఇది సరైనది, ఇది తప్పు అని వాదులాడుకోవటం అర్ధరహితమని ఇతను అభిప్రాయపడ్డాడు.    ఇది  ఒక రకంగా సంశయవాదం. (skepticism). బుద్ధుని వద్ద శిష్యులుగా చేరకముందు సరిపుత్త,  మహామొగ్గల్లన లాంటివారు సంజయవద్ద కొంతకాలం శిష్యరికం చేసారు. 

.

6. నిగంత్తనాతపుత్త

.

జైన మతానికి చెందిన 24 వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు బౌద్ధసాహిత్యంలో నిగంత్తనాతపుత్త గా చెప్పబడ్డాడు.  నిర్గ్రంథులతో (దిగంబరులు) చేతులు కలిపిన నాత వంశీకుడు అని అర్ధం.  ఇతని నిజజీవిత పేరు వర్థమాన. సైన్యాద్యక్షుడైన తండ్రిపేరు సిద్థార్ధ, తల్లి త్రిశల. వైశాలి సమీపంలో ఇతను BCE 557 లో జన్మించాడు. ఇతనికి జైన మహావీర అనే బిరుదు కలదు.  ఇతని తల్లిదండ్రులు పార్శ్వనాథుని బోధనలను ఆచరించేవారు. వారు సల్లేఖవ్రతం (Fast onto death) చేపట్టి మరణించాకా, వర్ధమాన మహావీరుడు తన ముప్పై ఏండ్లవయసులో ఇంటిని విడిచిపెట్టి శ్రమణ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతని బోధనలు జైన ధర్మానికి  చెందినవి. 

.

***

పాయాసి

.

ఇతను ఒక రాజు.  బౌద్ధ, జైన, బ్రాహ్మణవాద మతాలకు వివిధ కాలాలలో వివిధ రాజుల ఆదరణ లభించి అవి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.  చార్వాక వాదానికి ఏ రకమైన రాజాదరణ లభించలేదు కానీ పాయసి అనే రాజు భౌతికవాదాన్ని కొన్ని జుగుప్సాకర ప్రయోగాల ద్వారా పరీక్షించి వాటి నిగ్గు తేల్చాలని చూసినట్లు కొన్ని బౌద్ధ జైన రచనలలో కనిపిస్తుంది. 

ఆత్మ లేదు అని చార్వాకులు చెప్పారు.  ఆత్మ ఉందాలేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి పాయాసి- ఒక దొంగను పెద్ద ఇత్తడి పాత్రలో ఉంచి దానిమూతను తగరంతో అతికింపచేసాడు.  ఆ పాత్రలో దొంగచనిపోతే ఆత్మ ఏ విధంగా బయటకు వెళుతుందో చూడాలనుకొన్నాడు.  మరొక ప్రయోగంలో పెద్దపాత్రలో ఉంచిన వ్యక్తి  బరువు చనిపోకముందు చనిపోయాకా ఏమైనా తేడా ఉందా లేదా అని కూడా పరీక్ష చేసాడు. ఈ ప్రయోగాలన్నీ దేహాత్మవాదం  నిగ్గు తేల్చటానికే.   

.  

ముగింపు

బౌద్ధజైనాలు చార్వాకులను అంగీకరించకపోవటానికి కారణం వారు పునర్జన్మను, నైతిక, ధార్మిక జీవనాన్ని విశ్వసించారు. ఈ లోకంలో తర్కం వెర్రితలలు వేయకుండా కొన్ని మతగ్రంథాలను ఏర్పరచుకొని వాటి ఆధారంగా ఒక పరిధి విధించుకొని జీవించటం ఉత్తమజీవనం అని నమ్మారు.   వారికి చార్వాకుల తర్కం విచ్చలవిడితనంగాను, వితండవాదంగాను కనిపించింది.  ఆకారణంగా బౌద్ధ, జైనులు  చార్వాక సిద్ధాంతాన్ని తిరస్కరించి తమ గ్రంథాలలో చార్వాకసిద్ధాంతాలను ఖండించారు. 


కూర్మపురాణం  (CE 550-800)  బౌద్ధులు, జైనులు, పంచరాత్రలు, కాపాలికులు, పశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది.  పంచరాత్ర కల్ట్ మొదట్లో వేదబాహ్యంగా  ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది. 


పదిహేనవ శతాబ్దంలో ఆంధ్రదేశంలో బౌద్ధులు, చార్వాకులు, జైనులే కాక పాషండులు, కాపాలికులు, పాశుపతులు పేర్లతో నాస్తికులు ఉన్నారని శృంగార నైషద పద్యంలో  (7-127)   శ్రీనాథుడు చేసిన వర్ణనను బట్టి   తెలుగునేలపై ప్రాచీన  వేదబాహ్య జీవనవిధానాలు  నిన్నమొన్నటి వరకూ మనుగడ సాగించాయని, ఇక్కడి ప్రజలు సాంస్కృతికంగా వైవిధ్యాన్ని కలిగిఉండేవారని అర్ధమౌతుంది. 

***


భిన్న ప్రాచీన భారతీయ దర్శనాలు ఒకదానినొకటి కబళించే శతృశిబిరాలుగా లేవు. వేరు వేరు సంప్రదాయ శాస్త్రాలుగా సమాంతరంగా మనుగడ సాగించాయి.  ఇవి ఒకదాని లోపాలను మరొకటి ప్రశ్నించుకొంటూ ఒకదానినొకటి పూరించుకొంటూ సాగాయి తప్ప ఒకదానినొకటి తొలగించుకోలేదు. అగ్నివేషుడు, కౌటిల్యుడు, వాల్మీకి, వ్యాసుడు   లాంటి వారు తాము నమ్మిన విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ  అప్పటికి ప్రచారంలో ఉన్న అన్ని దర్శనాలను తమరచనలలో ఉటంకించారు. వాటిలోని అసంబద్దతలను ఖండించారు. వైరుధ్యాలను కలిగిఉండటం మానవ మేథ యొక్క భిన్నపార్శ్వాల ఆవిష్కరణగా  చూసారు. 


బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు

1. Bhattacharya, Ramakrishna. Studies on the Carvaka/Lokayata

2. The historical buddha, The times, Life and Teachings of the founder of Buddhism, Hans Wolfgang Schumann 

3. Lokayata a Study in Ancient Indian Materialism, Debiprasad Chatopadhyaya

4. దర్శనకర్తలు – దర్శనములు by చర్ల గణపతిశాస్త్రి

5.Lokāyata/Cārvāka: A Philosophical Inquiry  Pradeep P. Gokhale 

6. History and Doctrines of THE AJIVIKAS, AL Bhasham

7. ON  HINDUISM Wendy Doniger

8. చార్వాక దర్శనం – డా. కత్తి పద్మారావు

9. ఆస్తికత్వము  by వారణాసి సుబ్రహ్మణ్యం

10. అయోధ్యా కాండము, శ్రీమతి శ్రీమత్తిరుమల పెద్దింటి వెంకట సీతమ్మ

కామెంట్‌లు లేవు: