18-35-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అll ఇక తామసధైర్యమును పేర్కొనుచున్నారు-
యయా స్వప్నం భయం శోకం
విషాదం మదమేవ చ |
న విముఞ్చతి దుర్మేధా
ధృతిస్సా పార్థ! తామసీ ||
తా:- ఓ అర్జునా! ఏ బుద్ధిచేత దుర్బుద్ధియగు మనుజుడు నిద్రను, భయమును, దుఃఖమును, సంతాపమును (దిగులును), మదమును విడువకయుండునో - అట్టి ధైర్యము తామసమైనది.
వ్యాఖ్య: - ధైర్యము గొప్పసుగుణమే. కాని అది దుర్విషయములందు వినియోగింపబడునపుడు నిష్ఫలమైపోవును. తమోగుణయుతుడు ఒకానొక ధైర్యమవలంబించి తన అతినిద్రను, భయమును, దుఃఖమును, దిగులును, మదమును వదలకయే యుండును. ధైర్యమను గొప్ప సుగుణము అట్టి నిద్రాభయాది నికృష్టవస్తుసంపాదనమున వినియోగింపబడుటచే నిరర్థకమైపోయినది. కాబట్టి ఆ ధైర్యమునే సద్వస్తుసంపాదనమునకు, సచ్ఛీలసముపార్జనకు, మోక్షప్రాప్తికి, దైవకరుణను సంపాదించుటకు వినియోగించుట ఉత్తముని ధర్మమైయున్నది. వాల్మీకికి అపారధైర్యము, పట్టుదల కలదు. కాని మొట్టమొదట ఆ ధైర్యమును, పట్టుదలను దుర్వృత్తులందు, పరమహింసాకార్యములందు ఉపయోగించి విఫలుడయ్యెను.
కాని మహనీయుల సాంగత్య ప్రభావముచే తిరిగి ఆ ధైర్యమునే రామనామజపమందును, దైవధ్యానమందును వాడుకొని ధన్యుడయ్యెను.
“దుర్మేధా” - అనిచెప్పుటవలన అతనికి మేధ (తెలివి) యున్నప్పటికిని దానిని వక్రమార్గమున ప్రవేశపెట్టెనని భావము.
"స్వప్నమ్” - (నిద్ర) ఇచట నిద్రయని చెప్పినచోట "అతినిద్ర' యని భావించుకొనవలెను. ఏలయనిన మితనిద్ర సర్వులకును అవసరమే అయియున్నది.
ప్ర:- తామసధైర్య మెట్టిది?
ఉ:- ఏ ధైర్యముచే దుర్బుద్ధిగలవాడు నిద్రను, భయమును, శోకమును, దిగులును, మదమును విడువకయుండునో అది తామసధైర్యమని చెప్పబడును.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి