శిశువులకు కలుగు రోగములు -
పసివారికి కలుగు రోగములను బాల రోగములు అని పిలుస్తారు . బాలురకు కూడా పెద్దవారి వలే సమస్త రోగములు కలుగును. కాని మరికొన్ని వ్యాధులు గ్రహదోషములు వలనను , మాతృకా దోషముల వలనను కూడా కలుగుచున్నవి. గ్రహాదుల వలన కలుగు వ్యాధులు కాక సామాన్యముగా కలుగు రోగములు 22 రకాలుగా ఉండును. అని శార్ఙ్గధరుడు వివరించెను . ఇప్పుడు మీకు వాటి గురించి సంపూర్ణముగా వివరిస్తాను .
• వాతజము -
వాతప్రకోపము చేత దేహమున పాలు దోషమును పొందినప్పుడు ఆ పాలను తాగించుట చేత శిశువు కంఠస్వరం మరియు శిశువు క్షీణించడం , మలమూత్ర , అపాన వాయువు నిరోధము కలుగుట వంటి సమస్యలు ఉత్పన్నం అగును .
• పిత్తప్రకోపం -
పిత్తప్రకోపం చెందుట చేత పాలు దోషం పొంది ఆ పాలు సేవించుట వలన సర్వదా చెమటపట్టుట , మలము బురద వలే వెడలుట , కళ్లు ఉబ్బు , సర్వాంగముల యందు వేడి కలిగి ఉండును.
• శ్లేష్మజము -
శ్లేష్మ వికారముచే చెడిన పాలను త్రాపుట చేత చొల్లు కారుట , అతినిద్ర , ఒడలు బరువు వంటి సమస్యలు కలుగును.
• ధంతో భేదము -
శిశువులకు కొత్తగా దంతములు మొలచునప్పుడు జ్వరం , భేదులు , వాంతులు , దగ్గు , తలనొప్పి కలిగి ఉండును.
• దంతఘాతము -
5 , 7 , 8 సంవత్సరముల వయస్సున దంతములు రాలుట చేత జ్వరం వంటి ఉపద్రవములు కలుగును.
• దంత శబ్దము ( దంత హర్షము ) -
శిశువులు నిద్రలో ఉన్నప్పుడు పళ్లు కోరుకుట
• అకాల దంతము -
శిశువులకు పండ్లూడు కాలమునకు ముందుగానే పండ్లు జ్వరాల వంటి ఉపద్రవాలు కలుగును.
• అహి పూతనము -
క్షుద్రరోగము . శిశువులు నిద్రించు సమయమున పక్క మీదనే మలమూత్రములు విసర్జించగా ముడ్డిని తుడవకగాని , కడగక ఉండటం వలన ముడ్డి యందు దురద కలిగి వ్రణము ఏర్పడును .
• ముఖపాకము -
శిశువుల నోరు పండినట్లు ఉబ్బుట .
• ముఖస్రావము -
శిశువుల నోట చొల్లు కారుట .
• గుదపాకము -
శిశువుల ముడ్డి పండి వ్రణం ఏర్పడుట .
• ఉపశీర్షకము -
శిశువుల కపాల స్థానమున వ్రణము ఏర్పడి జ్వరం వంటి ఉపద్రవాలు కలుగును.
• మహావిసర్పి -
శిశువుల శరీరం నందు వాతాదిదోషము వికారం పొందుట వలన మహాపద్మము అనే విసర్పి రోగము పుట్టును . ఇది చాలా తీవ్రంగా ఉండును. గుదస్థానము నందు ఎర్రటి తామర వలే ఉండును . హృదయము మొదలు శిరస్సు వరకు వేదనాభరితముగా ఉండును.
• తాలుకంటకము -
శిశువుల దవడల యందు శ్లేష్మ ప్రకోపము చేత ముండ్లవలే గరగరలాడుచుండి కఫము పడుట .
• విచ్ఛిన్నము -
తాలు పాకము . - శిశువుల దవడల యందు పల్లము పడుట చేత శిశువు పాలు త్రాగక నీళ్ల వలే మలము , విసర్జించునప్పుడు కడుపునొప్పియు , నేత్ర కంఠముల యందు వికారం , తాగినపాలు గొంతు దిగక కక్కుట వంటి సమస్యలు కలుగును.
• పారిగర్భికము -.
తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చు పాలను శిశువు తాగుటచేత శిశువుకు ఆ దోషమున దగ్గు , అగ్నిమాంద్యము , వాంతులు , కండ్లమబ్బు , అరుచి , భ్రమ , కాళ్లు చేతులు సన్నం అగుట , కడుపు పెరుగుట మొదలగునవి కలుగును. ఈ సమస్య తల్లి గర్భముతో నుండకుండా ఉన్నను ఆమె పాలు తాగినను కొందరికి కలుగును.
• దౌర్బల్యము -
శిశువుల శరీరముకు దుర్బలత్వము కలుగుట.
• గాత్రశోషము -
ఏ దోషము వల్లనైనా శిశువు శరీరం కృశించుట .
• శయ్యా మూత్రము -
వాత వికారముచే శిశువు రాత్రియందు గాని పగటి యందు గాని పక్కపైన మూత్రమును పలుమార్లు విడుచును.
• కుకూనము -
చంటి పాల దోషముచే శిశువుల కనురెప్పల యందు దురద కలిగి దానిని నలుపుట చేత సూర్యుని తేజస్సు చూడనీయక పలుమార్లు కన్నీరు కార్చును .
• రోదనము -
పిల్లలు సదా ఏడ్చుచుండును.
• ఆజగల్లి -
శ్లేష్మ ప్రకోపము చేత శిశువు ల శరీరమున పెసరగింజల వంటి కురుపులు కలిగి వేదనాయుక్తమై శరీరం పాలిపోయినట్లు ఉండును. పైన చెప్పిన విధముగా 22 రకాలుగా శిశు సంబంధ దోషములు కలుగును. సరైన పద్ధతిలో సమస్యని గుర్తించి చికిత్స చేయవలెను .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి