18, జులై 2020, శనివారం

సద్గురువులకు ఎందుకు నమస్కరించాలి?

శ్రీరామ.
శ్రీ కంచి పరమాచార్యులవారు మొదలైన సద్గురువులకు ఎందుకు నమస్కరించాలి?

 ఈ క్రింది శ్లోకము మనము నిత్యము పఠించేదే!
శ్లో// గురర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః /గురు:సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః //
(గురువే బ్రహ్మదేవుడు.గురువే విష్ణుమూర్తి, గురువే భగవంతుడైన శివుడు.గురువు ఈ త్రిమూర్తులకన్నా శ్రేష్ఠ తత్వమైన సాక్షాత్తూ పరబ్రహ్మ.ఆ గురువుకు నమస్కరిస్తున్నాను ).
ఈ భావనతో గురువును మనలో ఎంతమంది చూస్తున్నారు?
అయితే గురువును ఈ భావనతో సేవించాలని శాస్త్రం చెబుతున్నది.
ఎందుకోసం?
వారు అనుగ్రహించి మనలను సన్మార్గంలో నడిపించడం కోసం.
మహాభారతం ఉద్యోగ పర్వంలో ఒక శ్లోకం ఈ విధంగా ఉన్నది:
శ్లో// షడేతే హ్యవమన్యన్తే నిత్యం పూర్వోపకారిణమ్/
ఆచార్యం శిక్షితా:శిష్యా:, కృత దారాశ్చ మాతరమ్/
నారీం విగత కామాస్తు, కృతార్థాశ్చ ప్రయోజకమ్/
నావం నిస్తీర్ణ కాన్తారాః, ఆతురశ్చ చికిత్సకమ్//
(విద్య నేర్చుకున్న శిష్యుడు గురువును, భార్య వచ్చిన వాడు తల్లినీ, కామం ఉడిగిన వాడు స్త్రీని, పని పూర్తి అయినవాడు సహాయం చేసిన వారినీ, ఏరు దాటిన వాడు నావను, రోగము నయమైన వాడు నయం చేసిన వైద్యుణ్ణీ,--ఈ అరుగురూ తమకు పూర్వం ఉపకారం చేసిన వారిని విస్మరించి,అవమానిస్తారు),అని.
వీరికి కృతఘ్నతా దోషం సంక్రమిస్తుంది.
అన్ని పాపాలకంటే కృతఘ్నత గొప్ప పాపం.
సూర్యభగవానుడు కృతఘ్నులను హింసిస్తాడు అని "ఆదిత్యహృదయము" లో వాల్మీకిమహర్షి చెప్పారు.
 "కృతఘ్నఘ్నాయ దేవాయ"  (కృతఘ్నులను నశింపజేసే అదిత్యునకు నమస్కారము),అని.
పాపాత్ములను సూర్యభగవానుడు శిక్షిస్తాడు అన్న విషయం వేదము కూడా ఈ విధముగా తెలియజేస్తున్నది.
"అరుణము"  లోని "కశ్యపాదుదితా స్సూర్యా:పాపాన్నిర్ఘ్నన్తి సర్వథా" మొదలైన మంత్రములు, పాపములను చేసిన వారిని సూర్యుడు, కొందరిని చేతులు లేనివారుగాను, కొందరిని కాళ్ళు లేనివారుగాను,
 కొందరిని కళ్ళు లేనివారుగాను, ఈవిధముగా,సంపూర్ణ అవయవములు లేనివారిగా పుట్టించి హింసిస్తాడు.
మంచి నీళ్ళు కూడా లభించని నరకములు అనే స్థానాల్లో జన్మించేటట్లు చేస్తాడు.
స్వేదజములైన నల్లి, దోమ,ఈగ లాంటి జన్మలు, ఉద్భిజ్జములైన చెట్లు చేమలు లాంటి జన్మలు వచ్చేటట్లు చేస్తాడు", అని ఈ మంత్రములకు అర్థము. 
అందువల్ల పాపకర్మలు చేయవద్దని వేదశాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి.
పాపకర్మలు చేయకుండా మనకు తగిన బోధ చేసేది గురువు.
సన్మార్గంలో వుంటూ, తెలియకుండా కృతఘ్నత లాంటి పాపములు చేసినవారిని కూడా గురువు తగువిధముగా హెచ్చరించి వారిని దుష్కర్మ ఫలితాలు అనుభవించకుండా సకాలములో ఉద్ధరిస్తారు.
కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక సత్పురుషుని, శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన  సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.
 అనంతపురంలో  "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు"  అనే వేద విద్వాంసులు ఉండేవారు.
వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు.
సంస్కృతములో కూడా గొప్ప పండితులు.
అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.
మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు,అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు.
వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.
వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.
శ్రీ శాస్త్రిగారు  నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.
 అనేకమంది చేత చండీయాగములు చేయించారు. 
ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి  అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.
నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత  తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు. 
ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.
శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు.
కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు.
అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం  శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.
శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.
కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.
ఇలా పదిరోజులు గడిచినై.
శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.
శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు.
ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.
"నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.
శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.
 మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.
శ్రీశర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు. 
శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.
పది రోజుల తరువాత అదే మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము. 
శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.
సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది.
శ్రీ స్వామివారు వున్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.
శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి నమస్కరించారు.
శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.
" మీరు మీ గురువులను విస్మరించారు.
 మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.
మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.
మీ తాతగారు,మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి  తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.
జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు.
ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి,చిరునవ్వు నవ్వుతూ " ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.
ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది.
స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది.
వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.
అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు", అన్నారు.
శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది. తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము,జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.
ఎంతో సిగ్గు పడ్డారు.
సాష్టాంగ నమస్కారము చేసి తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, శ్రీ పరమాచార్యులవారిని  వేడుకున్నారు.
శృంగేరీ వెళ్తానన్నారు.
ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.
శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.
వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.
శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు.
అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు. 
అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.
దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.
కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.
కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ  శ్రీపరమాచార్యులవారు ఇలా
 కాపాడుతారు. 

శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.

1 కామెంట్‌:

Dr Karanam Nagaraja Rao చెప్పారు...

It is amazing. What you have written is true. I have heard it from Sri Mogili Viswanatha Sarma garu.