7, సెప్టెంబర్ 2020, సోమవారం

పితృకర్మలు

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి. 

నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి, పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి కృతజ్ఞత చూపడము మానవత్వము.   విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి.

మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కీర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి.  వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి.  మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.  అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.

మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.

కాని ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలా మంది ఈ కార్యక్రమాలు చేయలేక పోతున్నందుకు వారిలో వారు భాధపడుతున్నారు.  అనేక మంది వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు.

కొంత మంది స్వదేశం వచ్చినప్పుడో లేక స్వగ్రామం వచ్చినప్పుడో, ఏ కాశీలోనో ఏ గయలోనో పితృ తర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుందని అనుకుంటారు.  అది పొరపాటు.  ఎందుకంటే పుణ్య నదులలో పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే కాని అవి పూర్తిగా సమాప్తం కావు. కాబట్టి పుత్రులు తామున్నంత వరకు పితృకార్యాలు (మాసికం, ఆబ్దీకం) చేయాలి. అలా చేయలేని పరిస్థితులలో ఆ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయించిన కూడా ఫలితం లభిస్తుంది.

మాసికాలు, ఆబ్దీకాలు ఒక్క మన తల్లి తండ్రులకు మాత్రమే గాక మగ పిల్లలు లేని బంధువులకు మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చును.

ఉదా : మావయ్య, అత్తయ్య, తాత, బామ్మ, అమ్మమ్మ, అన్న, వదిన, తమ్ముడు, భార్య, కొడుకు, పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న మొదలగు వారికి కర్మలను నిర్వహించినచో వారు మోక్షమార్గం పొందగలరు.

తీర్థయాత్రలకి వెళ్ళలేని వారు కనీసం తీర్థయాత్రలు చేసిన వారిని చూసిన, సేవించినా కూడా పుణ్యం కలుగుతుందని పురాణాలలో చెప్పబదింది.  అలాగే మాసికాలు, ఆబ్దీకాలు స్వయంగా పెట్టలేని వారు తగు వ్యక్తుల సహాయ సహకారాలతో పెట్టించటం కూడా స్వయంగా పెట్టినంత ఫలితానిస్తుంది.  ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం, సంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్దిని ఆయుక్షేమాన్ని, సుఖ శాంతులను పొందగల్గుతారు.

ఒకసారి భీష్ముడు తన తండ్రికి పితృకర్మ తలపెట్టాడు. పరమనిష్ఠతో పితృకర్మలు సమర్పిస్తున్న కుమారుడి శాస్త్రబద్ధతకు మురిసిన ఆయన తండ్రి శంతనుడు స్వయంగా పిండాన్ని అందుకోవడానికి దిగివచ్చాడు.  పిండాన్ని తనకు ఇవ్వమని కుమారుడిని అడిగాడు. ‘శాస్త్రాలు ఒప్పుకోనందున నేను పిండాన్ని నీ చేతుల్లో పెట్టలేను’ అని భీష్ముడు అన్నాడు.  పిండాలను భూమిమీదనే పెట్టాలని శాస్త్రాలు నియమాన్ని విధించాయి.

పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.

నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మానవులు, తమ పితృ దేవతలను ఉద్దేశించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ.  శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేశించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని(భోక్తలకు భోజనము ), యామాన్నము గాని (బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము(బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.

అశ్రద్ధ అనగా నాస్తికత్వ బుద్ధి చే పితృదేవతలు లేరని, అనేవారి పితరులు రక్తము త్రాగుదురు(భోజనము అందక) పితృ దేవతలను ఉద్దేశించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.

మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.

మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధీకులు, స్నేహితులలో అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదములలో మరణించిన వారికి ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సంధర్భముగా మనము త్రుప్తి పరుస్తాము.   అంతే కాక మన ఇంట్లో పని చేసి మరణించిన వారికి కూడా మనము ఈ శ్రాద్ధ కర్మలు ద్వారా తృప్తిపరుస్తాము.

అపుత్రస్యగతిర్నాస్తి: అంటే వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించబోవని సాధారణంగా నిస్సంతువులు నిరంతరం దుఖిఃస్తుంటారు. సంతానం లేకపోతే ఉత్తమ గతులు సంప్రాప్తించవని భావించడం, ఆ క్రమంలో నిరంతరం దుఖిఃంచడం వ్యర్థం.  సృష్టికి పునరుత్పత్తి అనేది అవసరం కాబట్టి దానిని కొనసాగించడం కోసం తన తదనంతరం వారసులు ఉండాలని అందరూ భావిస్తుంటారు.  వాస్తవానికి వారసులు అంటే సంతానం అని మాత్రమే కాదు.  చేసే పని ఏదైనప్పటికీ దానిని అందుకొని కొనసాగించే వారసుడిని పొందాలనేది అపుత్రస్యగతిర్నాస్తిః యొక్క వాస్తవిక అర్థం.

పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్దతో అర్పించేదే శ్రాద్ధం.  ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.  వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు.  పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయటం సంతానం తప్పని సరి విధి.  శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు.  వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు.

శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది.  ఆదర్శ పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతతి వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది.  అన్ని దానాలలోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది.  అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.

కొంత మంది వివిధ కారణాలతో తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు. ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు.  ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు.  ఇది నిజము.

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు.  మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ.  వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం.   కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము.  ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు.  అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.

ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది.  ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు.  ఉదాహరణకు, ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది.  వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు.  ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది.  కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.

ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది.  మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే.
********************

కామెంట్‌లు లేవు: