21, నవంబర్ 2020, శనివారం

స్త్రీలు_ఎందుకు_వేదాలు_పఠించకుడదు

 స్త్రీలు_ఎందుకు_వేదాలు_పఠించకుడదు..


వేదాలకి అధిదేవత గాయత్రి మాత, వాక్కును ప్రసాదించే దేవి సరస్వతి, వారిరువురు స్త్రీ రూపాలే. మరి స్త్రీలు ఎందుకు వేదం చదవకూడదన్న వాదన వింటుంటాం.

.

 వేదాలు స్వర, మాత్రానుగుణంగా ఉచ్చరింపబడాలి వాటి పూర్తి ప్రభావం ప్రకటింపబడాలి. అంటే పురుషదేహ నిర్మాణానికి, స్త్రీ దేహ నిర్మాణానికి తప్పక తేడా వుంది. వారికున్న నాడీమండల వ్యవస్థ ఆడవారికి సరైన స్వరోచ్చారణకు పూర్తిగా సహకరించదు. పురుషుల వోకల్ ఫోల్డ్స్/కార్డ్స్ 17mm-25mm పొడవు వుండగా, స్త్రీలకు 12.5 Mm-17.5mm దీనివల్ల వారి pitch లో తేడా వుంటుంది. వేద మంత్రాలన్నీ ఉదాత్త, అనుదాత్త, స్వరానుగుణంగా ఆయా స్థాయిలో ఉచ్చరించడం ఈ నిర్మాణం వలన స్త్రీలకు పూర్తిగా సాధ్యపడదు.


 ఈ వేదమంత్రాల స్వరాలు నాభినుండి పలకవలసి వస్తుంది. కావున నమకచమక మంత్రాలలో ఇటువంటి ప్రయోగాలు ఎక్కువ వుండడం వలన వాటికి పొత్తికడుపు మీద ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. వారి శరీరనిర్మాణం ప్రకారం వారికి ఇటువంటి ఒత్తిడి పెట్టడం వలన ఉచ్చారణ చెయ్యగా చెయ్యగా వారి ఋతుకాలం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.


నేడు మనం చూస్తున్న సంగీత థెరపీ వలన రోగులలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడమూ, తక్కువ చెయ్యబడడమూ శాస్త్రీయంగా నిరూపింపబడినది. వేదము, వేదమునందలి ఈ నమక చమక మంత్రాలు ప్రధానంగా శబ్దప్రధానం. వీటి శబ్దప్రకంపనల వలన ఈస్ట్రోజెన్ తదితర హార్మోన్లపై ప్రభావం అధికంగా వుండి కాలక్రమేణా కొన్ని కొన్ని మంత్రాల వలన గర్భస్రావం కూడా జరుగుతుందని ఆడవారు ఆ మంత్రాలు వినరాదు చదవరాదు అని నియమం పెట్టారు.


 వేదమంత్రాన్ని కొంచెం తప్పుగా చదివితే రావలసిన ఫలితాలకు వ్యతిరికంగా దుష్ఫలితాలు కలుగుతాయి. ఆడవారికి గురూపదేశం లేకుండా సరైన ఉచ్చారణ అబ్బదు, కాబట్టి వారికి వేదపఠనం, అందునా మరింత శక్తివంతమైన రుద్రాధ్యాయ, ఆదిత్య, సౌర సూక్తాలు వద్దని చెప్పారు. నేటి సాంకేతిక పరిజ్ఞానం చెబుతున్న దాని ప్రకారం ఆడవారికి మెనోపాజ్ వరకు వారిని చాలా శక్తివంతమైన హార్మోన్లు కాపాడతాయి. ఒకసారి ఆ సమయం వచ్చాక వారికి వ్యాధినిరోధక శక్తి తక్కువ అవుతుందని పరిశోధనల ద్వారా నిరూపించారు. వారికున్న రక్షణాత్మక కవచాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం కొద్దీ వారికి కొన్ని పనులు నిషేధించారు, అందులో ముఖ్యంగా ఇటువంటి వేదనాదాన్ని ఉచ్చరించడం.


నేటి యుగధర్మ ప్రకారం ఆడవారికి ద్విజత్వం సిద్ధించదు, ఎందుకంటె వారికి ఉపనయన సంస్కారం లేదు కనుక. కావున వారికి గాయత్రి మంత్రోచ్చారణ కానీ వేదపఠన కానీ వద్దని చెప్పారు. ద్విజులంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అన్న విషయం అందరికీ తెలుసు. వేదం పఠించడం వలన శరీరంలో చక్రం ఉత్తేజితం వలన, ఉచ్చారణాక్రమం వలన ఎక్కువగా ఉష్ణం ఉత్పన్నమవుతుంది. అది ఆడవారి శరీరానికి మంచిది కాదని వారిని చదవద్దని వారిస్తారు. కొందరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినట్టు ఇందులో ఆడవారిని తక్కువగా ఎక్కడా చూడమని చెప్పలేదు. ఆడదంటే ఆదిశక్తి అని కొలిచిన ధర్మం మనది. వేదం చదవద్దని చెప్పిన మన ధర్మశాస్త్రాలు వారికి మరెన్నో సౌలభ్యాలు కలుగచేసాయి.


1. వారు వేద వ్యాఖ్యానాలు మనసులో పూర్తిగా చదివి తత్త్వం తెలుసుకోవచ్చును. మనకు పూర్వం కూడా ఎందరో నారీమణులు వేదార్ధాన్ని, వేదంగాలను నేర్చిన వైనం వినే ఉన్నాము.


2. వారు సౌందర్యలహరి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంటి ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు, వివిధ దేవతల శ్లోకాలు, దివ్యప్రబంధాలు, పురాణ ఇతిహాసాలు, భజనలు, కీర్తనలు తప్పక చదవమని చెబుతుంది శాస్త్రం


 3. వారు మాత్రమే చెయ్యగలిగిన ఎన్నో శక్తివంతమైన ఫలవంతములైన వ్రతాలు చెప్పబడి ఉన్నాయి.


4. ఆత్మ విచారం ఇత్యాది గొప్ప ఆధ్యాత్మిక సాధనలు నిషిద్ధం కావు. ఇలా ఎన్నో దైవపూజలకు వారికి అధికారం వుంది. కేవలం వేదం చదవరాదన్న నియమం వలన వారు ఏ రకంగాను కూడా పురుషులకన్నా తక్కువ స్థాయిలో చూడలేదు.


                        ఇట్లు 

                          మీ

         అవధానుల శ్రీనివాస శాస్త్రి

కామెంట్‌లు లేవు: