21, నవంబర్ 2020, శనివారం

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

 శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం


తిరుప‌తి, 2020 నవంబ‌‌రు 19: సిరుల‌త‌ల్లి శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న పుష్కరిణిలో ఉద‌యం 11.52 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం(చక్రస్నానం) ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు. 


ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి పల్లకీ ఉత్సవం ఆలయంలో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా వాహన మండపానికి వేంచేపు చేశారు. 


తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 9.00 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 


అమ్మవారికి శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు :


ఈ సందర్భంగా 112 గ్రాములు బ‌రువుగ‌ల బంగారు పతకం, 249 గ్రాములు బ‌రువుగ‌ల ప్లాటినం లక్ష్మీ పతకం, దశావతారముల బిళ్లలు కలిగిన ప్లాటినం చైను సారెతో పాటు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.


శోభాయ‌మానంగా స్న‌ప‌న‌ తిరుమంజ‌నం


 వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.


నెమలి ఈకలు, యాలకులు, నెల్లి, ఫైనాపిల్, బ్లాక్ క్యాన్ బెర్రీ, లిల్లీ, తులసి, ఆర్కాడ్ పూలతో రూపొందించిన మాలలు, కిరీటాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. 


తిరుపూర్ కు చెందిన దాతలు ఈ మాల‌ల త‌యారీకి విరాళం అందించారు. సేలంకు చెందిన కళాకారులు ఈ మాలలను రూపొందిచారు. 


ఆకట్టుకున్న ఫలపుష్ప మండపం:


టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్, గ్రీన్ ఆపిల్, రోజా, సంపంగి, ఆరు రకాల కట్ ఫ్లవర్స్ తో వాహన మండ పాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. 


కాగా రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరుగనుంది.

కామెంట్‌లు లేవు: