10, నవంబర్ 2020, మంగళవారం

భీమేశ్వర జ్యోతిర్లింగము

 *🚩భీమేశ్వర జ్యోతిర్లింగము🚩*


భీమేశ్వర జ్యోతిర్లింగం గూర్చి ప్రార్థనా శ్లోకంగా ఒకమాట చెప్తారు.


యం డాకినీశాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ!


సదైవ భీమాదిపదప్రసిద్ధం, తమ్ శంకరం భూతహితం నమామి!!


ఇక్కడ ఉండే శంకరుడిని భీమలింగము అని పిలుస్తారు. శివాష్టోత్తరంలో ‘భీమః’ అన్న నామము ఉన్నది. ‘భీమః’ అనే నామం విష్ణుసహస్రనామ స్తోత్రంలో కూడా ఉన్నది. ఇది చాలా చిత్రాతిచిత్రమయిన స్వయంభూలింగము.


లింగపురాణం వాయువు పేరును ‘ప్రభంజనః’ అని పేర్కొంది. ఆయన గట్టిగా వీస్తే పెద్దపెద్ద వృక్షములు కూడా కూకటి వేళ్ళతో క్రిందపడిపోతాయి. ఆయన ప్రభంజనుడు. అటువంటి వాడికి శంకరుడు ‘నీవు జీవులలో ఉండి వాళ్ళ కార్యములన్నీ నిర్వర్తించాలి’ అని చెప్పాడు. వెంటనే వాయువు జీవులలోకి వెళ్ళాడు. ప్రభంజనుడై వాయువు  శరీరములు నిలబడడానికి పది రకములయిన కర్మలను లోపల ఉండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చెయ్యకపోతే బ్రతుకే లేదు.


పూర్వకాలమునందు సహ్య పర్వత శిఖరముల మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ రాక్షసుని పేరు కర్కటుడు. ఆయన భార్య పేరు పుష్కసి. ఈ రాక్షస దంపతులకు ఒక రాక్షసి పిల్ల పుట్టింది. ఆమె పేరు కర్కసి. పెరిగి పెద్దదయి యౌవనంలోకి వచ్చింది. తగిన సంబంధం చూడాలి. విరాధుడు అనేవాడిని ఈమెకు తగిన వరునిగా నిర్ణయించి పెళ్ళి చేశారు. కొంతకాలమునకు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వచ్చి ఆ విరాధుడిని సంహరించాడు. ఈవిడకి వైధవ్యం వచ్చింది రాముడి పట్ల వైరం ఉన్న కుంభకర్ణుని పట్ల మక్కువ పెంచుకుంది. ఈ విషయం తెలుసుకుని కుంభకర్ణుడు ఈమె దగ్గరికి వచ్చాడు. కదళీ వనంలో వున్న ఆమెను స్వీకరిస్తానని చెప్పి ఆమెను బలాత్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆవిడకి కుంభకర్ణుడి వల్ల ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టినవాడు అపారమయిన బలవంతుడు అవాలని ఆమె కోరుకుంది. తన కొడుకు తన భర్త విరాధుడిని, కుంభకర్ణుని సంహరించిన రాముడిని సంహరించగల శక్తిమంతుడు కావాలని ఆమె కోరిక. అందుకని ఆ పిల్లాడిని ‘భీమః’ అని పిలవడం ప్రారంభించింది. భీమః అంటే గొప్పబలం ఉన్నవాడని అర్థం.


వాడు పెరిగి పెద్ద రాక్షసుడు అయ్యాడు. వాడు ఒకనాడు తల్లిని “నాన్నగారు ఎక్కడ” అని అడిగాడు. అపుడు ఆమె తన కథను కొడుక్కి చెప్పి ఈ రాముడు ఇప్పుడు అవతార పరిసమాప్తి చేసి విష్ణువుగా ఉన్నాడు. నీవు విష్ణువును సంహరించాలి’ అని చెప్పింది. విష్ణువు గురించి లోకములనన్నింటిని వెతికి వెతికి విసిగిపోయాడు. ఎవడయినా భగవంతుని పాదములు పట్టుకున్న వాడు ఉన్నట్లయితే వాని తలకాయ తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇలా భక్తులన్దరినీ చెణకుతూ వెళ్ళిపోతుండగా ఒకానొకప్పుడు కామరూప రాజ్యమును పరిపాలిస్తున్న సుదక్షిణుడు అనే రాజును ఓడించి తీసుకు వచ్చి కారాగారంలో పెట్టాడు.


సుదక్షిణుడు పార్థివ లింగం పెట్టి రోజూ లింగార్చన చేస్తూండేవాడు. మనస్సుతోనే ఆయన అన్నీ సృష్టించి శివపూజ చేస్తుండేవాడు. అలా చేస్తుంటే అక్కడ ఉన్న కాపలాదారులు వెళ్ళి ఈవిషయం రాజుకు చెప్పారు. వీడికి ఎక్కడ లేని కోపం వచ్చి నాకన్నా గొప్పవాడు ఎవడు? ఇప్పుడే ఈ లింగమును కత్తితో నరికేస్తాను అని చంద్రహాసం తీసి శివలింగం మీద కొట్టబోతుండగా సుదక్షిణుడు పరమేశ్వరా! నీవు ఆవిర్భవించి వీనిని సంహరించు అని ప్రార్థన చేశాడు.


ఎప్పుడయితే తన చేతిలో ఉన్న చంద్రహాసమును విసిరాడో అంతటా నిండి నిబిడీ కృతమయి ఈ కన్నులకు కనపడని పరమాత్మ సాకార రూపమును పొంది పార్థివ లింగంలోంచి బయటకు వచ్చి నేను నా భక్తుల జోలికి వెళ్ళే వాళ్ళని ఉపేక్షించను అని ఉత్తరక్షణం వాడిని కుత్తుక మీద పొడిచి సంహారం చేశాడు. ఆ సందర్భంలో పరమేశ్వరుడే తన పేరు ‘భీముడు’ అని చెప్పుకున్నాడు. భీముడు అనగా అద్వితీయ పరాక్రముడు.


ఇందులో తెలుసుకోవలసిన రహస్యం ఒకటి ఉన్నది. ఆ రాక్షసుని కక్ష విష్ణువు మీద. ఇక్కడ పరమశివుడు వచ్చాడు. యథార్థమునకు విష్ణురూపం రావాలి కదా! అయితే శివరూపంతో వచ్చి ఎందుకు చంపాడు? అంటే భగవంతుని రెండు పేర్లు చెప్తారు – వామదేవ, వాసుదేవ. వాసుదేవ అంటే శ్రీమన్నారాయణుడు. వామదేవ అంటే పరమశివుడు. ఈ రెండు పేర్లలో మారిన అక్షరములు ‘మ’ ‘సు’. ఇప్పుడు ‘సు’ పక్కన ‘మ’ పెట్టండి. ‘సుమ’ అవుతుంది. ‘సుమం’ అంటే పువ్వు. పువ్వు అనగా జ్ఞానం. జ్ఞానం కలిగి తెలుసుకుంటే ఆ వామదేవుడు వాసుదేవుడు, వాసుదేవుడు వామదేవుడు అవుతారు. నామములు, రూపములు మారాయి. తత్త్వరీత్యా ఉన్నది ఒక్కటే పదార్ధం. శివలింగమును పూజించి రాముని జోలికి వెళ్ళినా, రావణాసురుని పది తలలు తెగిపోతున్నప్పుడు శివస్వరూపం ఆపదు. శివ స్వరూపం జోలికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదములు పట్టుకున్నా, శ్రీమహావిష్ణువు వచ్చి శంకరుడు చేసే ప్రళయమును ఆపడు.   ఉన్నది ఒక్కటే పదార్థము. ‘ఏకోదేవః సర్వభూతాంతరాత్మా స్రవభూతాభివాసః సాక్షీచేతోకేవలోనిర్గుణస్యా’ అంది వేదం. ఆ ఉన్న ఒక్క పదార్థము అవసరమును బట్టి రూపమును మారుస్తుంది.  భీమః –  ఏమి కోరుకుంటున్నారో అటువంటి శక్తి ఏదయినా ఇవ్వగలిగిన వాడు.  ఆ స్థితిలో వచ్చి రాక్షససంహారం చేసి తన భక్తుడయినవాడికి రాజ్యాధికారం ఇచ్చి, తదనంతరం మోక్షమునిచ్చినవాడు.


ఒక్కసారి వెళ్ళి ఆ భీమశంకర జ్యోతిర్లింగం దగ్గర నిలబడి ‘డాకిన్యాం భీమశంకరం’ అని ఒక్క నమస్కారం చేస్తే భీముడు శంకరుడు శుభం చేస్తాడు. ఒక్క నమస్కారం చేస్తే ఆ పరమాత్మ  ఎటువంటి దుఃఖములు రాకుండా కాపాడి రక్షిస్తాడు.

కామెంట్‌లు లేవు: