12, ఆగస్టు 2023, శనివారం

ఆత్మకు చావుపుట్టుకలు లేవు

 📌ఆత్మ అంటే ఏమిటో చాలామందికి అసలు తెలియదు. దాదాపు ఈ భూ ప్రపంచం మీద పుట్టిన వారిలో 99% మందికి తెలియదు. దాదాపు చాలా మంది ఆత్మ అంటే తెలుసు అంటారు.


అది ఏమిటి అంటే కొందరు దయ్యమని, మరికొందరు భూతమని ఇలా దానికి లేని రూపాలను దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన ఆత్మ స్వరూపాన్ని, ఆత్మ యొక్క అర్ధాన్ని, చివరకు ఒక వ్యర్ధ పదంగా మారుస్తున్నారు.


తెలియకపోతే తెలియనట్లుండాలి, అంతే కాని ఎవడో ఒక తెలివితక్కువ వెధవ వాడికి తెలిసిన ఒక అజ్ఞాన మాటను పట్టుకొని అందరికి అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సబబుకాదు.


ఇంకో విషయం ఏమిటంటే ఈ ఆత్మ అనే పదాన్ని, పుట్టిన ప్రతి ఒక్కరు వారి నోటి నుండి ఉచ్ఛరించి ఉంటారు.


అజ్ఞానులైతే, వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులలో భయాలు కలిగినప్పుడు, అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకొనినప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు,


కాని ఇది అజ్ఞానంతో ఆలోచించడం. మరి కొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన లేక వేదవేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన, అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారు ఉండరు.


వారికి మాత్రమే ఈ ఆత్మ స్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు... “ఎవరో ఒక మహాపురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును.


మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో, చూచినవరిలో,

చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా యెరుగరు.”


సరే కాని, నిజానికి ఆత్మ అంటే దైవమా? లేకదయ్యమా? 


ఇది తెలియాలి, మరీ ముఖ్యంగా

అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.


ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంధంలో లిఖించబడింది, ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంధమే లేదు,


కాని సరిగా దాని అంతరార్ధాన్ని తెలుసుకోలేక సమతమవుతూ దాని అర్ధాన్ని సరిగా గ్రహింపలేక దానికి నానార్ధాలు చెబుతూ చాలామంది వారు confuse అవడమే కాక అందరిని confusion లోకి నెట్టేస్తున్నారు.


ఈ ఆత్మ అంటే నిజానకి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే అది ఏమిటో దాని తత్వము ఏమిటో అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు! అంతే తప్ప మత గ్రంధాలలోని సూక్ష్మమైన రహస్యాలను సైతం బోధించేవాళ్ళకు కూడ అది ఎలా ఉంటుందో తెలియదు.


చూసిన వారు చెప్పిన దానిని, చూడని వారు కొద్దిగా దానిని అవగతం చేసుకొని తెలుసుకుంటున్నారు. 


ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు... “గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడంచేతగాని,

చాల శాస్త్రాల అధ్యయనం చేయడం వలనగాని, ఎన్నో గూడార్థాలు మహాత్ములవద్ద వినడం వలన గాని అత్మప్రాప్తి జరుగదు. ఆ ఆత్మకోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన నిధి ధ్యానములు చేసే వ్యక్తికే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది.


అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. ఆత్మ మనోబలం లేనివారికి, అజాగ్రత్తపరులకు, శాస్త్రవిరుద్దమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే ధృడంగా శ్రద్ధ వుంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మ పదంతో ఐక్యం పొందగలదు.”


ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంధాలు ఏమి బోధించాయో కూడ తెలుసుకుందాం...


భగవద్గీత: శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపినాడు... ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను, ఆత్మ

ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే.


ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు.

ఆత్మకు చావుపుట్టుకలు లేవు. ఇది జన్మ లేనిది.

నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబడినను ఇది చావదు.


ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు, మార్పులేనిదనియు, శాశ్వతమైనది, సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది, స్తిరమైనది

మరియు సనాతనమైనది.


ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు

లేనిది.📍

కామెంట్‌లు లేవు: