6, సెప్టెంబర్ 2023, బుధవారం

బసవ పురాణం - 24 వ భాగము....

 🎻🌹🙏బసవ పురాణం - 24 వ భాగము....!!


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


    🌹దీపదకళియారు కథ:🌹


🌸కాంచీపురంలో దీపదకళి అనేమహాభక్తుడు ఉండేవాడు. ఒకనాడు అతడు పొరుగూరుపోయి తిరిగి వస్తుండగా ఒక జీర్ణాలయం కనబడ్డది. 


🌿అది చూచి దీపదకళి ఎంతో బాధపడ్డాడు. దిక్కులేని వానిలాగా శివుడు ఇక్కడున్నాడే. ఈయనకు నైవేద్యాలు భోగ భాగ్యాలు అటుంచి కనీసం దీపారాధన కూడా లేకుండా పోయిందే అని విచారించాడు. 


🌸వెంటనే తన ఇంటికి పోయి ఆస్తిమొత్తమూ అమ్మి శివునికి రమణీయమైన దేవాలయం కట్టించాడు. ఆలయం చుట్టూ మనోహరమైన ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశాడు. 


🌿స్వామికి నిత్యధూప, దీప నైవేద్యాలు జరిగేటట్టు చేశాడు. ఈ విధంగా కొంతకాలం భోగం నడిచింది. క్రమంగా ధనం అయిపోయేసరికి భోగభాగ్యాలు తగ్గిపోయాయి. 


🌸అప్పుడు తానే కాళ్ళకూ చేతులకూ గజ్జెలు కట్టుకొని నర్తిస్తూ దీపం వెలిగించి భోగాలు జరిపాడు. కొంత కాలానికి ఆ ధనం కూడాఅయిపోయింది. అప్పుడు దీపారాధనమే కష్టమయింది.


🌿 క్రమంగా చెట్టుకొమ్మలు తెచ్చి వెలిగించి దీపాలవలె చేశాడు. కొంతకాలానికి చెట్టు కొమ్మలు కూడా సేకరించే ధనం లేకపోయింది. అప్పుడు గడ్డిని వెంటిగా చేసి వాటిని నూనెతో తడిపి దీపారాధన చేశాడు. 


🌸గడ్డి నూనె కూడా అయిపోయింది. అప్పుడు ఇంట్లోగల సమస్త వస్త్రాలూ కాగడాలుగా చుట్టిస్వామికి కైంకర్యం చేశాడు. చీరెల దివిటీలు కూడా అయిపోయాయి. చివరకు ఏమీ మిగలలేదు.


🌿 అప్పుడు దీపదకళియారు తన జుట్టును పొడవైన జడగా అల్లి దానికి నూనె రాసి, వెలిగించి స్వామి ముందు కాగడా పట్టాడు. జడ క్రమంగా తగలబడుతూ తలవరకూ వచ్చింది. 


🌸అప్పుడు శివుడు ప్రత్యక్షమై ‘దీపదకళీ! నీ భక్తికి మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’ అన్నాడు. ‘స్వామీ! నాకే కోరికలూ లేవు. నీవు ఇట్లా దిక్కులేనివాడిలా ఈ నిర్జన ప్రదేశంలో ఉండటం నాకిష్టంలేదు. 


🌿వెండి కొండగల మహానుభావుడివి. నీవిక్కడ ఉండకూడదు అన్నాడు.శివుడు దీపదకళి కోరికను మన్నించి దేవాలయాన్ని శివలింగాన్ని, మొత్తాన్ని పెకలించుకొని దీపదకళితో సహా కైలాసానికి వెళ్లిపోయాడు.


🌷నాట్యనమిత్తండి కథ🌷


🌸(బసవన్న చెన్నబసవనికి చెప్పిన కథ)పూర్వం కంచిలోపల నాట్య నిమిత్తండి అనే మూఢ భక్తుడు ఉండేవాడు. ఒకనాడాయన శివాలయానికి పోయాడు. 


🌿అక్కడ ఏకామ్రనాథుని విగ్రహం చూచాడు. శివమూర్తి తాండవ భంగిమలో ఉన్నాడు కదా! అది చూచి నాట్యనమిత్తండి భయపడి పూజారిని పిలిచి ‘అయ్యా! స్వామివారికి జడ ముడి వీడిపోయింది.


🌸 శరీరం వంకరలు తిరిగింది. తల వాలిపోయింది. ఎందువల్ల? అని ప్రశ్నించాడు. పూజారి నవ్వి ‘‘అదా! నీ శివుడికి వాయురోగం వచ్చిందయ్యా! అందుకని వంకరలు తిరిగాడు’


🌿 అని ఎగతాళి పట్టించాలని చెప్పాడు పూజారి. నాట్యనమిత్తండి నిజమేనని నమ్మి దుఃఖించసాగాడు. ‘ఆలస్యమైతే శరీరమంతా ఇలాగే కొంకర్లు పడుతుంది. అప్పుడు నీ శివునికే కష్టం. 


🌸నాకు దీనికి మందు తెలుసు. డబ్బిచ్చి బాగుచేయించుకో’ అన్నాడు పూజారి. అప్పుడు నాట్యనమిత్తండి ఇంటికి పోయి తన సమస్త సంపదనూ అమ్మివేసి తెచ్చి పూజారికి ఇచ్చాడు. 


🌿పూజారి విగ్రహానికి కొంచెం ఆముదం పూసి వాయుతైలాదులు మర్దన చేశాడు. ఇకపో అన్నాడు. నాట్యనమిత్తండి మళ్లీ కొద్ది రోజులకు వచ్చి చూచాడు. శివవిగ్రహం అలాగేంది. 


🌸అయ్యో! శివుడికి రోగం కుదరలేదు. ఈ ఆకులవల్లా, తైలాలవల్లా ప్రయోజనం శూన్యం. ఆత్మత్యాగమే దీనికి మార్గం అని నిశ్చయించుకొని నాట్యనమిత్తండి బలిదానానికి పూనుకున్నాడు. 


🌿అప్పుడు శివుడు ప్రత్యక్షమై ‘నమిత్తండీ! నీ భక్తికి మెచ్చాను. వరం కోరుకో అన్నాడు. నాకే కోరికలూ లేవు స్వామీ! మీ శరీరం వంకరలు పోవడం నేను సహించలేను అని మనవి చేశాడు నమిత్తండి.


🌸శివుడు చిరునవ్వు నవ్వి అది వంకరలుపోవడం కాదనీ తాండవలీల అని వివరించాడు.నాట్యనిమిత్తండి శివుని ముఖంగా తాండవలీలకు వివరణం విని సంతోషించాడు. 


🌿శివుడు తన వెంట దివ్య విమానంలో నాట్యనమిత్తండిని కూడా కైలాసానికి తీసుకొనిపోయాడు.ఉడుమూరి కన్నప్ప కథ(బసవన్న చెన్న బసవనితో)పూర్వం శ్రీకాళహస్తి ప్రాంతంలో అరణ్యంలో ఉడుమూరి కన్నప్పడు అనే శివభక్తుడు ఉండేవాడు. 


🌸ఒకనాడు కన్నప్పడు వేటకు వెళ్లి అలసిపోయి ఒక చోట పడుకున్నాడు. అప్పుడతనికి కల వచ్చింది. అందులో రుద్ర చిహ్నాలతో ఒక తపసి కనపడి కొంచెము ముందుకుపో. నీకు లింగమూర్తి కనపడుతాడు. 


🌿అతడే నీకు ప్రాణలింగంగా భావించుకో’ అని చెప్పి అదృశ్యమైనాడు. కన్నప్పనికి మెలకువ వచ్చింది. లేచి కొంత ముందుకు పోయాడు. కలలో తపసి చెప్పినట్లే అక్కడ ఘన లింగమూర్తి కనిపించాడు. 


🌸అది చూచి ముగ్ధ్భావనతో కన్నప్పుడు ఇలా అన్నాడు.శివా! నీవు ఒంటరిగా ఇక్కడ ఉండటానికి కారణం ఏమిటి? అన్నదమ్ముళ్ళతో దెబ్బలాడి వచ్చావా? చెప్పు. నీ అలుక తీరుస్తాను....సశేషం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: