16, అక్టోబర్ 2023, సోమవారం

నవగ్రహా పురాణం🪐* . *55వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *55వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*రాహుగ్రహ జననం*


కశ్యప పత్నులు - అదితీ , దితి , దనూ , వినత , కద్రువ , సింహిక , కాల మొదలైన వాళ్ళు ఆశ్రమంలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు.


*"మనందరం తల్లులమయ్యాం కానీ , సింహిక మాత్రం ఇంకా మాతృత్వానికి నోచుకోలేదు !"* అంది దను. 


*"ఎలా కలుగుతారు దనూ , దానికి పిల్లలు ? మన సింహిక మరీ నెమ్మది ! సంతానం. కరుణించమని మన అదితిలాగా దేవుణ్ణి అడగదు ! మనలాగా పతి దేవుణ్ణి అడగదు !”* దితి నవ్వుతూ అంది.


దితి మాటలకు అందరూ నవ్వారు.


*"సరే ! ఆ మాత్రం నేనూ అడగగలను. ఎవర్ని అడగాలో చెప్పండి. అడిగి పిల్లల్ని కని , నా శక్తి చూపిస్తాను !"* సింహిక ఆవేశంగా అంది. *"చెప్పండి ! ఎవర్ని అడగాలి ? దేవుణ్ణా ? లేక పతి దేవుణ్ణా ?”*


*"ఆ దేవుణ్ణి ప్రార్థించినా , 'పతి దేవుణ్ణి ప్రార్థించు సాధ్వీ' అంటాడు. కాబట్టి కనిపించే దేవుడూ , కరుణించే దేవుడూ పతి దేవుడు ఉన్నారుగా ! ఆయన్నే అడుగు !”* కాల నవ్వుతూ అంది.


అందరూ నవ్వారు. చిరునవ్వు నవ్వుతూ అదితి సింహికతో ఇలా అంది. *“మన పతిదేవుడు మహా తపశ్శక్తి సంపన్నులు. భగవంతుడిని ప్రార్థించే అవసరం ఉంటే ఆయనే చెప్తారు. ఆయననే అర్థించు , సింహికా ! నీకు మాతృత్వం సిద్ధిస్తుంది !".*


కశ్యప ప్రజాపతి నదీతీరంలో చెట్టు క్రింద ధ్యాన నిష్ఠలో ఉన్నాడు. సింహిక వచ్చి , ఆయన ముందు కూర్చుంది. కశ్యప ప్రజాపతి నిమీలిత నేత్రాలతో సమాధిలో ఉన్నాడు.


సింహిక కొన్నిక్షణాల పాటు ఆయన ధ్యానం ముగించడం కోసం నిరీక్షిస్తూ కూర్చుంది.


*"స్వామీ !”* అంది , ఇంకా వేచి చూసే ఓపిక నశించిన సింహిక.


కశ్యప మహర్షి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. సింహికను ప్రశ్నార్థకంగా చూశాయి.


*"సింహికా ! ఏమిటి ఇలా వచ్చావు ?"* కశ్యపుడు అడిగాడు.


*"మిమ్మల్ని... మిమ్మల్ని...వరం కోరటానికి వచ్చాను...”* అంది సింహిక కొద్దిగా తడబడుతూ.


*"వరమా ?”* కశ్యపుడు చిరునవ్వు నవ్వాడు. 


*"ఇవ్వాలి , తప్పకుండా ! ఇస్తారా ?" .*


*"ఇస్తాను , సింహికా అడుగు !"* కశ్యపుడు నవ్వాడు.


*"నాకు... నాకు... పుత్రుడు కావాలి..."* 


*"కోరదగిన కోరికే !"* కశ్యపుడు నవ్వాడు.


*"నా పుత్రుడు మహాశక్తిమంతుడై ఉండాలి ! మహా బలశాలి అయి ఉండాలి ! చూడగానే అందరూ భయపడేలా భీకరంగా ఉండాలి !"* సింహిక ఉత్సాహంగా అంది. 


*"భీకరంగా ఉండాలా ? ఎందుకు సింహికా ? మళ్ళీ ఆలోచించుకొని , అడుగు !"*


కశ్యపుడు సూచించాడు. *"మళ్ళీ ఆలోచించను ! మళ్ళీ అడగను ! నాకు భయం గొలిపే భీకరాకారుడైన పుత్రుణ్ణి ఇవ్వండి !"* సింహిక మొండిగా అంది.


*"సరే... ఇలా దగ్గరగా రా !"* అన్నాడు కశ్యపుడు. సింహిక అతని దగ్గరగా జరిగింది. 


కశ్యపుడు తన హస్తాన్ని ఆమె శిరస్సు మీద ఉంచాడు. *"వరమిస్తున్నాను ! నువ్వు కోరిన పుత్రుడు త్వరలో నీ ఒడిలో ఆడుకుంటాడు !"*


సింహిక గర్భవతి అయింది. ఆ శుభవార్తని ఆనందంగా అక్కచెల్లెళ్లందరికీ చెప్పింది.


*"సింహిక తల్లికాబోతోంది , స్వామీ !”* అంది అదితి కశ్యప ప్రజాపతితో. *“సంతానం కోసం తహతహలాడిపోయింది. పాపం ! చక్కటి కొడుకు కలగాలని దీవించారు కదా !"*


కశ్యపుడు నవ్వాడు. *"నీ చెల్లెలు చూడచక్కని కొడుకు కావాలనలేదు. చూడగానే భయం కలిగించే వికారరూపుడు కావాలంది. అడగరాని వరాన్ని అడగరాని సమయంలో అడిగింది , సింహిక , మండే అగ్నిలాంటి ముఖంతో , భయభ్రాంతుల్ని చేసే బాలుడు ఆమెకు జన్మిస్తాడు !"*


*"అయ్యో... అలాగా...”* అదితి నిరుత్సాహంతో అంది.


*"సింహిక కోరికకు మూలకారణం దైవేచ్ఛ అని నాకు అనిపిస్తోంది ! విచారించాల్సిన అవసరం లేదు !"* అన్నాడు కశ్యపుడు తేలిగ్గా. 


సింహికకు నవమాసాలు నిండాయి. సకాలంలో ఆమె ఎర్రటి దేహకాంతితో ధగధగలాడే బాలుణ్ణి ప్రసవించింది.


సింహికా తనయుడి బారసాలకు దక్ష దంపతులతో బాటు , ఇంద్రాదులూ , నారదుడూ , బ్రహ్మ దేవుడూ విచ్చేశారు.


బాలుడి ఆవిర్భావ కారణాన్ని బ్రహ్మ కశ్యపుడికి వివరించాడు. నవగ్రహాలలో 'ఒకడుగా నెలకొనడానికీ , పూజలు అందుకుని , ప్రాణుల మీద తన ప్రభావం చూపడానికీ జన్మించాడనీ , సుశిక్షితుడిగా రూపొందించమనీ చెప్పాడు. *"భవిష్యత్తులో బాలకుడు పరిగ్రహిస్తాడు ; పరిత్యజిస్తాడు. త్యజించడం అతని లక్షణంగా ప్రాచుర్యం పొందుతాడు. ఆ కారణంగా బాలుడికి 'రాహువు' అని నామకరణం చేయి !"* అన్నాడు బ్రహ్మ. 


బ్రహ్మదేవుడి ఆనతిని పాటిస్తూ కశ్యప ప్రజాపతి సింహిక కుమారుడికి 'రాహువు’ అని పేరు పెట్టాడు.


కశ్యపాశ్రమంలో , తల్లి సింహిక పోషణలో , మిగిలిన పండ్రెండుగురు తల్లుల పాలనలో రాహువు వృద్ధి చెందుతున్నాడు. కశ్యపుడు సకాలంలో రాహువుకు విద్యాబోధన ప్రారంభించాడు.


*"ఇప్పటి దాకా మీరు ఎనిమిది గ్రహాల జన్మ గాథలు విన్నారు. ఇక , తొమ్మిదవ గ్రహమైన కేతువు ఆవిర్భావం గురించి తెలుసుకుందాం...”* నిర్వికల్పానంద ఉపోద్ఘాతం. రూపంలో అన్నాడు.


*"గురువుగారూ , రాహువు గురించీ , కేతువు గురించీ ఎవరు ఏది చెప్పినా - ఆ ఇద్దరికీ అతి సమీప సంబంధం ఉన్నట్టుగా తోస్తూ ఉంటుంది. రాహువు లాగే కేతువు కూడా కశ్యప ప్రజాపతి కుమారుడేనా ?”* విమలానందుడు అడిగాడు.


*"అడగాల్సిన ప్రశ్నే అడిగావు విమలానందా ! అయితే దీనికి ఇదమిత్థంగా అవునని కానీ , కాదని గానీ సమాధానం చెప్పలేం. ఎందుకంటే కేతుజననం గురించి పురాణాల్లో , ఇతిహాసాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కశ్యప ప్రజాపతి కుమారుడుగా ఆయన పత్ని దనూదేవికి 'కేతుమంతుడు' అనే కుమారుడు జన్మించాడు. మహాభారత కాలంలో ఆ కేతుమంతుడే 'అమితౌజుడు'గా జన్మించాడని చెప్పబడింది. దనూ కశ్యప దంపతుల పుత్రుడైన కేతుమందుడే 'కేతుగ్రహం' అనే భావన కూడా ఉంది. అందుకే రాహు కేతువులు సోదరులుగా కలిసి మెలిసి ఉండేవారనీ అనుకోవడం జరిగింది.*


*"అయితే అష్టాదశ పురాణాలలో ఒకటైన విష్ణు ధర్మోత్తర పురాణంలో కేతువు గురించి ఐతిహ్యం మరొక విధంగా ఉంది. ఆ పురాణం ప్రకారం - బ్రహ్మదేవుడు మృత్యు దేవతను సృష్టించాడు. భూభారం తగ్గడానికి వీలుగా ప్రాణుల్ని సంహరించ మంటాడు. ఆమె తిరస్కరించి రోదిస్తుంది. వేడిగా నిట్టూర్చుతుంది. ఆ నిట్టూర్పు పతాకాకారంలో అగ్నికీలగా వెలువడుతుంది. తద్వారా కేతువు పుట్టాడు. కేతువుగా , ధూమకేతువుగా ఉంటాడని బ్రహ్మ శాసిస్తాడు...”.*


నిర్వికల్పానంద శిష్యులకు అర్ధం కావడానికన్నట్టు ఆగాడు.


*"కేతువు జన్మ వృత్తాంతంలో మరొక అంశాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలి. అది క్షీరసాగర మథనం తర్వాత మోహిని ద్వారా దేవ దానవులకు జరిగిన అమృత వితరణ సన్నివేశం. ఆ సన్నివేశంలో రాహువు ఒక్కడే దేవతగా మారు వేషంలో అమృతం స్వీకరించినట్టు వర్ణించబడింది.*


*"స్కంద మహాపురాణంలో మరో విధంగా ఉంది. 'తదా రాహుశ్చ కేతుశ్చ ద్వావేత దైత్య పుంగవౌ , దేవానాం రూపమాస్థాయ అమృతార్ధం త్వరాన్వితా ఉపవిష్ణా తదా పంక్త్యాం దేవానామమృతార్ధినౌ"* - అంటే రాహువు , కేతువూ అనే దైత్యపుంగవులు అమృతం కోసం దేవతల రూపాలు ధరించి , దేవతల పంక్తిలో కూర్చున్నారు - అని అర్థం..."


*"అలా అయితే ఏ అభిప్రాయాన్ని మనం స్వీకరించాలి, గురువు గారూ ?”* చిదానందుడు అడిగాడు.


*"ఏదైనా తీసుకోవచ్చు !"* శివానందుడు తేలిగ్గా అన్నాడు.


నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“ఆ అభిప్రాయం సరైంది కాదు , శివానందా ! - నీకు నచ్చిన ప్రతిపాదనను నువ్వూ , చిదానందుడికి నచ్చింది అతనూ స్వీకరిస్తే - విషయంలో అభిప్రాయభేదం శాశ్వతంగా ఉండిపోతుంది. సూక్ష్మంగా ఆలోచించి , పురాణాలలోని భిన్నమైన ప్రతిపాదనల మధ్య సమన్వయం సాధించి , ఏదో ఒక ప్రతిపాదనను స్వీకరించాలి. ఆ ప్రతిపాదన యుగయుగాలుగా వేళ్ళు తన్నిన విశ్వాసానికి విఘాతం కలిగించకుండా ఉండాలి. మనం 'కేతువు' జన్మవృత్తాంతంలో ఆ సమన్వయ పద్ధతిని పాటించి , రెండు అభిప్రాయాలనూ కలిపి , ఒక్కటిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం !".*


*"బాగుంది గురువుగారూ... మీరన్న ఆ సమన్వయాన్ని ఎలా సాధిస్తారు ?"* విమలానందుడు అడిగాడు.


*"ఎలా సాధించగలమో ప్రత్యేకంగా వివరించకుండా కేతువుకు అటు కశ్యప ప్రజాపతితోనూ , ఇటు మృత్యువుతోనూ సంబంధం కొనసాగిస్తూ ఆయన జన్మ - వృత్తాంతం చెప్పుకుందాం... వినండి. ఒకప్పుడు ప్రాణులకు మరణాలు లేని కారణంగా భూభారం అమితంగా పెరిగిపోయింది. భూదేవి ప్రమాదాన్ని శంకించింది...”* నిర్వికల్పానందం ప్రారంభించాడు.


*రేపటి నుండి కేతుగ్రహ జననం ప్రారంభం*

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: