19, ఏప్రిల్ 2025, శనివారం

రామాయణం

 🐄🌷🏹🪔🛕🪔🏹🌷

*🌹శుక్రవారం 18 ఏప్రిల్ 2025🌹*


             *రామాయణం*


ఒకసారి చదివినంత మాత్రాన 

మన సమస్త పాపాలని తీసేస్తుంది...


    *వాల్మీకి రామాయణం*

           *12 వ భాగం*              


శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు.. “గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. 

ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క-పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. 

ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది,అది అమృతంతో సమానమైన క్షీరాన్ని(పాలు) ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి, ఆశ్రమంలోకి వెళ్ళారు.


అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో... “అయ్యా! మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా, మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జరుగుతున్నాయా, మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా, మీరంతా సంతోషంగా ఉన్నారా?” అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు.


సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు “నాయనా! నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా (రాజధర్మం అంటె, ఎంత పన్ను ప్రజల దగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చెయ్యకుండా, ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి), సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా, శత్రువులను జయించావా, నీ మంత్రులు నీకు సహాయపడుతున్నారా?” అని పలు విషయాలని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు.. “ఇక నేను వెళతాను” అన్నాడు.


అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు.........```


*సత్క్రియాం తు భవాన్ ఏతాం ప్రతీచ్ఛతు మయా కృతాం |*

*రాజన్ త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||*```


“ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్టుడివి, కనుక నా ఆతిధ్యం తీసుకోవాల”న్నాడు.


“మీరు నాకు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి, ఇక మీరు శ్రమతీసుకోవద్దు” అని విశ్వామిత్రుడు అన్నాడు.


“అలా కాదు మీరు నా ఆతిధ్యం స్వీకరించాల్సిందే!” అని వశిష్ఠ మహర్షి అన్నారు.


“సరే, మీ ఇష్టం!” అని విశ్వామిత్రుడన్నాడు.


అప్పుడు వశిష్ఠ మహర్షి శబళ ని పిలిచి, “చూశావా మన ఆశ్రమంలోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజుగారు వచ్చారు, నువ్వు ఆయనకి, ఆయన అక్షౌహిణీ సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి” అన్నారు.*


ఆ శబళ ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి, చెఱకు కర్రలు, తేనె, పానీయములు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది.


శబళ సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు, అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు, ‘మళ్ళీ మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో’ అని ఆవురావురుమని తిన్నారు. ఒక గోవు ఉత్తర క్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ శబళ మీద వ్యామోహం పెరిగింది, ఆ శబళని తన సొంతం చేసుకోవాలని అనిపించింది. అప్పుడాయన ఆ వశిష్ఠ మహర్షితో...```


*“గవాం శత సహస్రేణ దీయతాం శబలా మమ |*```


“నేను మీకు ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబళని ఇవ్వండి” అన్నాడు.


అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, “నేను నీకు శబళని ఇవ్వలేను” అన్నారు.


విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు... “రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటే అవి రాజుకే చెందుతాయి. రాజు దగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను” అని అన్నాడు.


“నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కాని ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది, నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉంది, కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను” అని వశిష్ఠ మహర్షి అన్నారు.


*రేపు…13వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

కామెంట్‌లు లేవు: