సావడి కబుర్లు - 6
వందేమాతరం
మిత్రులు బిఎస్ శర్మ గారు తాను చదివిన మోక్ష సాధన మార్గము అనే గ్రంథం గురించి చెప్తూ, దైవ మీమాంసను వీడి, దేహ మీమాంసను పట్టుకోవడం అజ్ఞానమని, బార రహితమైన ఆత్మపై నిలకడ కలిగి ఉండడమే మోక్షం అని ఆ గ్రంధంలో వివరించిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రతి మనిషి విజ్ఞతతో ఒక్క క్షణం ఆలోచిస్తే, అందులోని ధర్మ సూక్ష్మం అర్థం అవుతుంది. అటువంటి పుస్తకాలు నేటి సమాజానికి ఎంత అవసరం కూడా తెలుస్తుంది.
“దైవ మీమాంస” అంటే దేవుని గురించి తర్కించడం, “దేహ మీమాంస” అంటే శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఆలోచించడం. ఇవి రెండూ మనసును బాహ్య ప్రపంచంలోనే బంధించి ఉంచే ప్రక్రియలు. ఈ రెండింటిని అధిగమించి “బార రహితమైన ఆత్మ” (నిర్మలమైన, నిర్వికల్పమైన చైతన్యం)పై నిలకడ కలిగి ఉండడమే మోక్షానికి మార్గం. ఈ విధమైన సాధన ఆధునిక సమాజానికి చాలా అవసరం.
దేవుని స్వరూపం మాటలకతీతం. తర్కంతో ఆయనను పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. దేవుడు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అనే ప్రశ్నలు మానవుల మనసుకు కలగడం సహజం. కానీ ఈ ప్రశ్నలు కొన్ని కొన్ని సార్లు వాదోపవాదాలకు, విభేదాలకు దారితీస్తాయి. అవి సాధనకు కాకుండా అపోహలకు దారి తీస్తాయి. ఎందుకంటే దేవుని స్వరూపము మాటలుకు అతీతం. ఇటువంటి వాదనల వలన ఆయనని దర్శించడం సాధ్యం కాదు సరికదా, అటువంటి చర్చలు వక్ర భాష్యాలకి దారి తీస్తాయి. అందుకే మన మహర్షులు దేవుడిని తెలుసుకోవడం కాదు దైవత్వాన్ని అనుభవించడం ముఖ్యం అంటారు.
ఇక దేహమీమాంకు వస్తే, దానికి ప్రధాన కారణం అహంకారం. అసలు మనిషి నేను అంటే ఈ శరీరం అని ఆలోచించడమే అజ్ఞానం. అదే అన్ని బాధలకి కారణం. మన అసలు స్వరూపం ఆత్మ అని తెలుసుకుంటే ఏది శాశ్వతమో తెలుస్తుంది. శరీరంతో అనుబంధం బంధనం, ఆత్మతో అనుబంధం విముక్తి.
అలాగే మొదట్లో ప్రస్తావించినట్లు, బారారహితమైన ఆత్మ అంటే, రాగద్వేషాలకు అతీతంగా ఎటువంటి తర, తమ వాసనలు అంటని చైతన్యం. ఇది సాధించాలి అంటే మొదట నేను ఎవరు అనే ఆత్మ విశ్లేషణ జరగాలి. అది జరగాలి అంటే వైరాగ్యభావనతో కూడిన ధ్యానం కావాలి. అందరూ వైరాగ్యం అంటే జీవితం నుంచి దూరంగా పారిపోవడం అనుకుంటారు, అది తప్పు, అసత్యంపై ఆసక్తి తగ్గడమే వైరాగ్యం. అప్పుడే ప్రశాంతమైన మనసుతో ఆత్మ దర్శనం జరుగుతుంది. అదే బారరహిత ఆత్మ దర్శనం.
ప్రస్తుత సమాజంలో మనిషి భయము ఒత్తిడి, విరక్తి, విసుగు, అసంతృప్తి,. లాంటి మానసిక పరిస్థితులను అనుభవిస్తున్నాడు. దానికి కారణం బాహ్య విషయాలపై అధిక ఆసక్తి కలిగి ఉండడం, అంతర్ముఖత లేకపోవడం. ఇటువంటి మానసిక పరిస్థితులను అధిగమించాలి అంటే జీవుడు బ్రహ్మమే అనే భావన మనసులో కలగాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది.
అసలు మనిషి జీవితానికి లక్ష్యం ఏమిటి? కుటుంబము, సుఖాలు, ధనము, కీర్తి ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడా ఏదో ఒక వెలితి కనిపిస్తుంది. అదేమిటి అని ఆలోచిస్తే, మనకి సంతృప్తి కలిగించే సమాధానం ఒకటే, అది ఆత్మజ్ఞానం.
అదేమిటో తెలుసుకోవాలి అనిపించినప్పుడు ఇటువంటి మహా గ్రంథాల అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. అవి మనసుకు శాంతిని ఇస్తాయి, జీవన లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. నిజమైన ఆనందం అంతర్గతంలోనే ఉందని బోధిస్తాయి.
నేటి సమాజానికి ఇలాంటి మోక్ష సాధన గ్రంథాలు కేవలం ఆధ్యాత్మిక గ్రంథాలుగా మాత్రమే కాదు, జీవన మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి. ఇవి మనిషిని బాహ్య ప్రపంచం నుండి అంతర్గత చైతన్యానికి తీసుకెళ్లి నిజమైన స్వరూపాన్ని తెలియజేస్తాయి.
ఈ భావాన్ని వివేక చూడామణిలో
*మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం*
*న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే ।*
*న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః*
*చిదానంద రూపః శివోఽహం శివోఽహం ॥*
నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తం కాదు, చెవులు కాదు, నాలుక కాదు, ముక్కు కాదు, కళ్ళు కాదు, ఆకాశం కాదు, భూమి కాదు, అగ్ని కాదు, గాలి కాదు. నేను చిదానంద స్వరూపుడిని. శుద్ధ చైతన్యం, ఆనంద రూపం. నేను శివుడిని. నిర్గుణ, నిర్మల, నిత్యమైన ఆత్మని అంటారు.
ఈ శ్లోకం దేహ మీమాంసను వ్యతిరేకిస్తుంది, దైవ మీమాంసను దాటి ఆత్మ స్వరూపాన్ని చూపిస్తుంది. నేను అంటే ఆత్మ నే అని నిశ్చలమైన భావాన్ని ప్రస్పుటంగా చూపిస్తుంది.
చివరిగా, భౌతికమైన ఈ దేహాన్ని (మానసికంగా) వదిలి, బాహ్య ప్రపంచానికి సంబంధించిన భావాలను దాటి, మనసును నియంత్రించుకుని దానిని అధిగమించి నేను అంటే ఆత్మ అని తెలుసుకున్న వారికే ముక్తి లభిస్తుంది.
*ఓం అసతోమా సద్గమయ,*
*తమసోమ జ్యోతిర్గమయ,*
*మృత్యోర్మా అమృతంగమయ*
*ఓం శాంతిః శాంతిః శాంతిః:*
మృశి
(దశిక ప్రభాకరశాస్త్రి)
9849795167
03.04.2026
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి