18, ఆగస్టు 2020, మంగళవారం

*పోలాల అమావాస్య - పూజ*

మనము, మన సంతానం ఆయురారోగ్యాలతో ఉండటానికి కారణం మన గ్రామ దేవతల కరుణా 
కటాక్షాలే! అందుకే మన పెద్దలు గ్రామ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పండుగల రూపాలలో ఎన్నో అవకాశాలు కల్పించారు. మరి అటువంటి గ్రామదేవతలలో పోలేరమ్మ ఒక ముఖ్యమైన దేవత. 

పోలాల అమావాస్య నాడు భక్తి శ్రద్ధలతో జరుపుకుని, అమ్మవారుగా కొలవబడే పోలేరమ్మ వారిని 
పూజించు తారు.

పోలాల అమావాస్యనాడు పోలేరమ్మ ఆరాధన ఉత్తరాంధ్ర, ఒరిస్సాలలో  మహాళయపక్షములు అయిన చివరి రోజు అనగా భాద్రపద అమావాస్యనాడు చేస్తారు. మిగిలిన వారు శ్రావణమాసంలో అమావాస్యనాడు పోలేరమ్మను ఆరాధిస్తారు. ఆరోజున కొందరు మహిళలు తమ సంతానము ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని 3,5,9,11 బేసిసంఖ్యలో పిల్లపాపలతో కళకళలాడే ముత్తైదువల ఉన్న ఇళ్ళకు వెళ్ళి ఆ ముత్తైదువల చేతుల మీదుగా బియ్యం, కూరలు వగైరా జోగిరూపంలో సంగ్రహించి తమ ఇంటికి తీసుకు వచ్చి కొన్ని బియ్యపు (బియ్యం, కొబ్బరి కలిపి రుబ్బి) పిండితో నీటిలో ఉడికించి, అందులో బెల్లం వేసి హారది, మరియు తమకు జోగిరూపంలో దొరికిన పెసరపప్పు మరియు బియ్యం కలిపి పొంగలి (పప్పు హారది) చేసి, తొమ్మిదిరకాల కాయగూరలతో అందులో కంద, చామ తప్పనిసరిగా ఉండేవిధంగా కలగాయ పులుసు చేసి అవి పోలేరమ్మకు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని ఇంట్లో పిల్లలతో సహా అందరూ ఆరగించుతారు.

 పొలాల అమావాస్య ముందు రోజు ఒక కంద మొక్క  (తల్లీ,పిల్ల మొక్కలు ఒకే కుదుటలో ఉండాలి).
ఇంకా  ఒక వరిదుబ్బు కూడా కందమొక్కతో కలిపి ఉంచడం ఉత్తరాంధ్రలో ఆనవాయితీ. ఆ కందమొక్క వీలయితే చిన్న కుండీలో ఉంటే మంచిది. పూజ అయినతరువాత మన మిగిలిన మొక్కలతో పెరుగుతుంది. మరల తరువాత సంవత్సరం అదే మొక్కను లేదా ఆ మొక్క పిల్లలు పూజకు ఉపయోగపడతాయి. (ఏదైనా కందమొక్క, దాని పిల్లమొక్క ఉండాలి) మిగతా పూజ సామాను అంతా అందరికీ తెలిసినవే; పసుపు, 
కుంకుమ, పూలు, కొబ్బరి కాయ ఒకటి, పసుపు కొమ్ములు రెండు, అరడజను అరటి పళ్ళు.

 కందమొక్కను పూజా మందిరంలో పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు 
వినాయకుని, పసుపు గౌరమ్మని, చేసుకుని తమల పాకుల్లో కంద మొక్క దగ్గరగా పెట్టుకోవాలి. 
నైవేద్యానికి పళ్ళు, కొబ్బరి కాయతో పాటు అమ్మ వారికీ వడ పప్పు, పానకం, చలిమిడి, ఆడ 
సంతానం కలవారు గారెలు, మగ సంతానం కల వారు బూరెలు సిద్దం చేసుకోవాలి. ఈ బూరెలు, గారెలు సంగతి ఎలా ఉన్నా పాలహారది (బియ్యం,కొబ్బరితో రుబ్బిన పిండితో పాలలో ఉడికించి, బెల్లము వేయబదినది), పప్పుహారది (బియ్యం, పెసరపప్పు ఉడికించి బెల్లము వేసినది). కలగాయపులుసు ముఖ్యము.  మూడు దారం పోగులకు పసుపు రాసి పసుపు కొమ్ములు (నడుం విరగకుండా ఉన్నవి, చిన్నవి) కట్టి ఉంచుకోవాలి.  తల్లి, పిల్లలకు అందరకూ సరిపడిన చిన్న పసుపుకొమ్ములు విరగకుండా ఉన్నవాటితో ఈ తోరాలు కడతారు.

ఇక పూజా విధానం ఇతర పూజల లాగానే. ముందుగా ఆచమనం చేసుకుని, సంకల్పం చెప్పుకుని గణపతి పూజ చేసుకుని అమ్మ వారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పసుపు అమ్మ వారిని, కంద మొక్క లేక కంద పిలకని, కుంకుమతో పుష్పాలతో పూజించి, దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి, అక్షతలు చేత పట్టుకుని, వ్రత కథ చదువుకుని, కొన్ని అక్షతలు అమ్మ వారి మీద, కొన్ని కుటుంబ సభ్యుల అందరి మీద జల్లు కోవాలి. పసుపు కొమ్ము కట్టిన ఒక దారం అమ్మ వారి దగ్గర ఉంచి, ఇంకో దారం పూజ చేసిన స్త్రీ మెడలో కట్టు కోవాలి. పిల్లలకు కూడా ఆ పసుపుకొమ్ము తోరం కట్టాలి. తీర్థ ప్రసాదాలు భక్తి తో స్వీకరించాలి.

 *వ్రతకథ*

అనగా అనగా ఒక ఊర్లో ఓ ఇల్లాలు. ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు, పోతున్నారు.   పోలాల అమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోచుకుందామని ఎవర్ని పేరంటానికి పిలిచినా రామని అంటున్నారు . ఈ విధంగా బాధపడుతున్న ఆ ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం కలగడం, చనిపోవడం జరిగినధి . ఆ పిల్లను తీసుకుని స్మశాసంలో సమాధి చేయడానికి వెళ్ళింది. అప్పుడు పోలేరమ్మ అక్కడకు వచ్చింది. ఆ ఇల్లాలిని ఇలా అడిగింది. "ఈ ఊర్లలో వాళ్ళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు . పాలేర్లు కల్లు తెస్తారు . వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు . నువ్వెందుకు శవాన్ని ఇక్కడ సమాధి చేస్తున్నావు?" అని  ప్రశ్నించింది. ఆ ఇల్లాలి ఇలా అంది "అమ్మా! పోలేరమ్మ తల్లీవేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు" అని బాధ పడింది. అప్పుడు పోలేరమ్మ తల్లి  "ఓ ఇల్లాలా! క్రిందటి జన్మలో పొలలమావాస్య నాడు నీవు పేరంటాళ్ళు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టావు. పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూశావు. మడి , తడి లేకుండా అన్నీ ఎంగిలి చేశావు.  అందుకే నీకు పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయారు".  అనిచెప్పింది . తన అపరాధాన్ని తెలుసుకున్న ఆ ఇల్లాలు పోలేరమ్మ తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది. ఆ ఇల్లాలు  ఆ వ్రత విధానం తనకు తెలుపమని వేడుకోగా పోలేరమ్మ ఇలా తెలిపింది.  పొలలమావాస్యనాడు  . గోడను ఆవు పేడ  పాలతో  అలికి, పసుపు కుంకుమతో బొట్టుపెట్టి కంద మొక్క,వరిదుబ్బు కలిపి ఉంచి అకుదురే అమ్మగా భావించి తొమ్మిది వరుసల దారంతో పసుపు కొమ్ము (నడుం విరగనిది) కట్టి, ఆ తోరం ఆ కందమొక్క తల్లికి కట్టి పూజ చేయాలి. తొమ్మిది వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి . ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోలెరమ్మ తల్లి కాపాడుతుందని " చెప్పింది.  ఈ విధంగా ఆ ఇల్లాలు ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానాన్ని తిరిగిపొందింది.
*********************

కామెంట్‌లు లేవు: