2, డిసెంబర్ 2020, బుధవారం

ఇంద్రియ అవగాహన

 *ఇంద్రియ అవగాహన.....*


పిల్లలకు మనం కుళ్ళిపోయిన ఆహారం పెడతామా..? పోనీ మనం తింటామా..? కుళ్ళిపోయిన, విషాహారం తింటే మన వ్యవస్థ కూడా చెడిపోయి, ఆనారోగ్యం వస్తుంది. వాంతులు, విరోచనాలు అవుతాయి. మరి మనం మన ఇంద్రియాలకు పెట్టే ఆహారం కూడా అలాంటిదే. ఇంద్రియాలు బయట ఉంటాయి, మనస్సు లోపల ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనస్సు ప్రపంచాన్ని చూస్తోంది. మనం బయట జరిగే కుళ్ళును, చెడును ఇంద్రియాల ద్వారా మనస్సుకు అందిస్తున్నాము. అందుకే మనస్సు చెడిపోయి, బయటకు అదే చెడును పంపిస్తోంది. ఆ కారణంగానే మానవుడు నేరాలు చేస్తున్నాడు.


మనిషి విన్నదానికంటే చూడటం ద్వారానే ఎక్కువ గ్రహిస్తాడు, విన్నది గుర్తుండకపోయినా, చూసినది మాత్రమే మనస్సులు చెరగని ముద్ర వేస్తుందని ఆధునిక పరిశోధనలు చెబుతున్నాయి. మరి మనం రోజూ ఏమి చేస్తున్నాం.. మన మీడియా ఏమి చూపెడుతోంది. ఒక నేరం ఎలా జరిగింది అనేది మనకు అవసరమా.. కానీ క్రైం వాచ్, హత్యలు నేరాలు మొదలైన ఎన్నో కార్యక్రమాల పేరుతో మనకు టి.వి.చానెల్స్ లో కనిపించేవి నేరాలు, ఘోరాలే.


అసలు నేరం ఎలా చేస్తే మనకెందుకు.. వాడు తప్పించుకోవడానికి ఏమి చేసాడో మనకెందుకు.. కానీ మీడియా చేసే పని ఏంటంటే, వాడు చేసిన నేరాన్ని మళ్ళీ పాత్రలతో చూపించి, వాడు ఏమి చేయడం వలన 'క్లూ' దొరికిందో కూడా చెబుతుంది. అంటే పట్టుబడకుండా నేరాలు ఎలా చేయాలో చెబుతుంది. తాను చూసే విషయాల్లో ఇదంతా అనవరమైన చెత్త. అదే మనస్సులోకి వెళుతోంది.


ఇక మీరు చూసే సినిమాలు/ధారవాహికల సంగేతి సరేసరి. అందులో సగటున వారానికి ఒక అత్యాచార సంఘటన చూపిస్తారు. మీ మరియు మీ పిల్లల మనస్సులోకి అత్యాచారం అనేది ప్రతివారం పంపుతుంది సీరియల్. అదేగాక మద్యపానం, ధూమపానం, స్త్రీలను హింసించడం, ఏడిపించడం అనేవి ప్రతి సీరియల్లోనూ, సినిమా లోనూ కనిపిస్తాయి. మీరు పురాణాలు చూస్తే, అందులో కథానాయకుడు (హీరో) మరియు ప్రతినాయకుడు (విలన్) మధ్య తేడా స్పష్టంగా ఉంటుంది.


రామాయణం తీసుకోండి. రాముడు స్త్రీలను కామంతో చూడడు, మద్యం సేవించడు, ధూమపానం చేయడు, ధర్మానికి కట్టుబడతాడు. రావణుడు దీనికి పూర్తిగా విరుద్ధం. కనిపించిన ప్రతి స్త్రీని ఎత్తుకువచ్చి అత్యాచారం చేసాడు, మద్యపానం, ధూమపానం, పరులను హింసించడం, ఋషులను ఏడిపించడం అతని లక్షణాలు.


కానీ ఇప్పటి సినిమాల సంగతి చూడండి. కథానాయకుడు మరియు ప్రతినాయకునికి మధ్య బేధం లేదు. ఇద్దరు అమ్మాయిలను ఏడిపిస్తారు, మద్యం సేవిస్తారు, ధూమపానం చేస్తారు, 'రూల్స్' అతిక్రమిస్తారు. వాళ్ళిద్దరికీ తేడా ఏముంది.. ఏమీ లేదు. కథ చివరలో కథానాయకుడి చేతిలో ప్రతినాయకుడు ఓడిపోతాడు. మీ పిల్లలు సినిమాలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. అయినా ఎవరిని తీసుకుంటే ఏమిటి.. ఇద్దరు అంతే. అందుకే చాలా మంది పిల్లలు నేరస్థులుగా మారుతున్నారు...


*|| ఓం నమః శివాయ ||*

కామెంట్‌లు లేవు: