2, డిసెంబర్ 2020, బుధవారం

నిర్వాణషట్కము

 దశిక రాము**


**జగద్గురు ఆదిశంకర విరచితము**

**నిర్వాణషట్కము**

**ఆత్మషట్కము**

4వ శ్లోకము. 

విశ్లేషణ : శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

4వ శ్లోకము :

**న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం।**

**న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞా।**

**అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా।**

**చిదానంద రూపః శివోహం।శివోహమ్॥**

అర్ధము :
పుణ్యపాపాలు, సుఖదుఃఖాలు నాకులేవు. నాకు మంత్రము, క్షేత్రములు, వేదములు, యజ్ఞములతో పనిలేదు. నేను భోజనాన్ని కాను, భోజ్యమును కాను, భోక్తను కూడా కాను.
నేను చిదానందరూపుడైన శివుడను! శివుడను తప్పా వేరవరినీ కాను॥

విశ్లేషణ :
జీవునికి, భగవంతుడికి ఉపాధికి సంబంధించిన అనేక భేదములు యున్నప్పటికీ "చైతన్యాంశ" మాత్రము యిరువురుకి సమానమే కావునా జీవేశ్వరులిరువురును ఒకటే! పరమాత్మకు వున్న లక్షణాలే జీవాత్మకు కూడా వున్నాయి.

పాపపుణ్యాలు, సుఖదుఃఖాలు, మంత్రపఠనాలు, క్షేత్రదర్శనాలు, వేదాధ్యయనాలు, యజ్ఞయాగాదులు ఇత్యాదివి జీవుడు కల్పించుకున్నావే గాని నిజంగా జీవాత్మకు వాటితో సంబంధంలేదు, వాటి అవసరం అంతకన్నా లేదు కారణం పరమాత్మే జీవాత్మ కాబట్టీ! 

కొంచెము ఆలోచిస్తే వీటి వలన కలిగే సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు, ఆనందం, అనుభూతి మనలోనే వుంది గాని వాటిలో లేదు. కారణం ఇవి కొందరికి కలిగించిన అనుభూతి వేరొకరికి కలిగించక పోవచ్చు. అలాగే వాటిద్వారా పొందిన ఫలితం, అనుభవించిన కొన్నాళ్ళకు పోయి దానియందు విసుగు పుట్టవచ్చు. అప్పుడు ఆనందము, సౌఖ్యం కోసం ఇంకో కొత్తమార్గాన్ని వెతుక్కుంటాము. అక్కడ దొరక్కపొతే అసహనం, కోపము కలిగి అశాంతికి లోనౌతాము. 

అంటే మునుజులు పొందుతున్న ఆనందము, అసహనం, కోపము వారిలోనే వున్నాయి కానీ బయట లేదన్న విషయము బోధపడుతుంది. ఒకవేళ ఆ సుఖము వస్తువులోనే వుంటే, అది అందరికీ, అన్నివేళలా ఆనందాన్ని కలిగించాలి కదా! మనుజులలో నున్న అజ్ఞానమే బాహ్య వస్తువులందు సుఖభ్రాంతికి కారణము. 

మానవుడు గాఢనిద్రలో నున్నప్పుడు, బాహ్యవస్తువులను మరచి, వాటియందు ఆసక్తిని విడచి, దుఃఖములను కూడా మరచి, తనయందే ఎంతో సుఖాన్ని అనుభవిస్తున్నాడు కదా! 

జీవుడు జ్ఞానముతో చేసే కర్మను యజ్ఞమని అంటారు. యజ్ఞము చేయువాడు, హోమమొనర్చు ద్రవ్యములు, హుతమొనర్చు అగ్ని కూడా పరబ్రహ్మస్వరూపములే, ఇక్కడ యజ్ఞఫలితం కూడా బ్రహ్మార్పణమే అన్ని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. అందుకే యోగులు బ్రహ్మమనే అగ్నితో, ఆత్మచేత ఆత్మనే ఆహుతి చేస్తారు. జ్ఞానులు అలాంటి జ్ఞానమునే ఉపదేశిస్తారు. ఈ శ్లోకంలో ఆది శంకరులు బోధించింది అదే! 

చిదానంద రూపః శివోహమ్! అన్నదే జీవుని అసలు స్వరూపము!!

🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**

కామెంట్‌లు లేవు: