*జయతాచ్ఛంకరోగురుః-१६*
మహాభాగవతములో లీలావతికై నారదుఁడు చేసిన భగవత్తత్త్వ బోధను లీలావతి గర్భగత స్థితిలోనున్న శిశువు (ప్రహ్లాదుఁడు) విన్నాడని వ్యాసమహర్షి పేర్కొన్నదానిని ఆధునిక వైజ్ఞానికులు తొలుత విశ్వసింపలేదు. కాని వైద్యశాస్త్రమున ఒక భాగమైన GYNAECOLOGY ఈనాడు Embryo Genesis అంశముగా గర్భస్థ శిశువునకు గ్రహణశక్తి ఉంటుందని పేర్కొనడముతో ఇప్పుడు వ్యాస వాక్యము సత్యమైనదిగా ప్రసిద్ధము. పుట్టనిండా నీరు నిండితే పుట్ట నిలవదని వైజ్ఞానిక అభిప్రాయము. కాని పుట్ట నీళ్ళు నిండినా నిలిచియుంటుందని "...యద్వల్మీకః అపా సంభారో భవతి...' అని వేదము పేర్కొన్నది. ఇందుకు నిదర్శనముగా మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి గర్భాలయము కనిపిస్తుంది. అలాగే, హోమాగ్నుల మహిమ వలన వర్షాలు, సంతానము కలుగుతాయని మన ఋషులు పేర్కొన్నారు. అందుకు ఉద్గీథవిద్య - 'అగ్నౌ.... వృష్టేరన్నమ్ తతః ప్రజాః ' అని తెలిపింది. ఆధునిక వైజ్ఞానికులు ఈ విషయమున ఇంకా సాధించవలసినది చాలా ఉన్నది. ఆంజనేయస్వామి బాల్యమున సూర్యుని అందుకునే యత్నమను హనుమచ్చరితములో కనపడే ఘటన ఇంత కాలానికి ఆదిత్య L1 తో యథార్థమని నిరూపితము. ప్రకృతిగతమైన పరిజ్ఞానముతో ఉన్న వైజ్ఞానికులు ప్రకృతి మూలమైన మహాప్రకృతికి ఆధారమైన పరబ్రహ్మము నుంచి ఏర్పడు మహద్విషయాలను నిరాకరింౘుట అసమంజసము. పరిశోధనలతో ఎంత నిరూపింౘుకోగలిగితే అంత విషయము మాత్రమే నేటి వైజ్ఞానికులకు అవగతమగును. తక్కినదంతయు భవిష్యత్తు అన్వేషణలకు శేషముగా భావింౘుటయే తరుణోపాయము.
నానారూప విలాస భరితమైన జగత్తులో మానవరూపమొకటి. సృష్టి నుంచి లయము వరకు జగత్తునకు పరిమితి. పుట్టుక నుండి మరణముదాక జీవితమునకు అవధి. జగత్తుకైనా జీవితానికైనా ఆరంభానికి ముందేమిటి? అంతము పిదప ఉండేదేమిటి? అను ప్రశ్న నేటి వైజ్ఞానికులకు ఇంకా కొఱుకుడుపడని విషయమే. ఇంతటి గహనమైన విషయాన్ని సులభంగా 'పునరపి జననమ్' అని వాక్రుచ్చినారు శ్రీ శంకరభగవత్పాదాచార్యులవారు. విశ్వాసమే ప్రధానముగా అనుష్ఠానమును అనుసరింౘుట వలన ఆధారము ద్యోతకమగునని మన ఆర్షగ్రంథముల బోధ. ఆధారము లభింపనిదే విశ్వసింపరాదని ఆధునిక వైజ్ఞానిక ప్రపంచమంటుంది. ఈ మాట భారతీయ సనాతన వారసుల మనస్సులను వ్యాకులమొనర్చినది. ఇందువలన భారతీయ సంస్కృతి ఆచారము విద్యా అలౌకిక యోగసాధన అనుష్ఠాన నైష్ఠికత అత్యద్భుత పారమార్థిక స్థితి దూరమై అజ్ఞానము నిస్పృహ నిర్వేదము క్రమ్మినాయి. జడతరమైన జటిల పరిస్థితిలో నిర్దేశనము లేని దుర్దశలో సమన్వయము లేని సమాజ గమనములో ఆత్మసంతృప్తి లేని ఆధ్యాత్మిక మార్గములలో సంశయాత్ములమై సంకటార్తులమై సారహీనులమై యున్న మనలకు లోకాతీతమును లోకగతమును ఏకీభావమున భావింపవలెనని జీవేశ భేద రహిత అద్వైతస్థితిని అనుగ్రహించి అనునయించి అనుసరించి అవధరింపఁజేసిన మహా మహితాత్ములు శ్రీ శంకరభగవత్పాదాచార్యులవారు. వారిని వారి సిద్ధాంతమును వారు ౘూపిన మార్గమునకు విశ్వసించి ఆచరింౘుటయే నేటి కాలమునకు నిశ్శ్రేయప్రదమైన కర్తవ్యము.
*వందే గురు పరంపరామ్*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి