17, ఆగస్టు 2020, సోమవారం

" మహాభారతం పూర్తయ్యె నిచట "

- తెలుగువారి హృదయ దర్పణం గా " మహా భారతం" పేరొందింది.
"తింటే గారెలు తినాలి..వింటే భారతమే వినాలి" అనే నానుడి కూడా ప్రసిద్ధం.
అరణ్య పర్వ శేష రచన ద్వారా  తెలుగులో మహాభారత కథకు..కావ్యానికి  పరిపూర్ణత..సమగ్రతను కల్పించిన ఘనత మహాకవి ఎఱ్ఱనకు..ఆయన జన్మస్థలియైన  ప్రకాశం జిల్లా కు దక్కుతుంది.

సంస్కృతములో వేదవ్యాస మహర్షి " జయ " మనే  పేరుతో రచించిన మహాభారత గాథను తెలుగులో కవిత్రయం గా పేరొందిన నన్నయ,  తిక్కన ,  ఎఱ్ఱన  అనుసృజన చేసి తెలుగు జాతికి గొప్ప కానుకగా అందించారు . తెలుగులో మహా భారతం ఆది కావ్యం.
మహాభారతాన్ని రచించిన ఈ  ముగ్గురు మహాకవులు   నదీ తీర ప్రాంతాలతో సంబంధం ఉన్న వారే కావడం విశేషం . నన్నయ్య కవిత్వం  గోదావరి గంభీర నడకను సంతరించుకుంది.
11 వ శతాబ్ది కి చెందిన నన్నయ
తన  ప్రభువైన రాజరాజనరేంద్రుని ఆదేశంతో  తెలుగులో ఆది కావ్యమైన  మహాభారత రచనకు శుభ శ్రీకారం చుట్టాడు. ఆది కవిగా శాశ్వత కీర్తిని సముపార్జించుకున్నాడు .
 ఆది పర్వం ,  సభాపర్వం పూర్తిగా తెనిగించిన నన్నయ్య లేఖిని అరణ్యపర్వం నాల్గవ ఆశ్వాసం  141వ పద్యం " శారద రాత్రు లుజ్వల లసత్తర తారక హార పంక్తులం " అనే పద్యంతో  ఆగిపోయింది.
  ఆ తరువాత 13వ శతాబ్దిలో పెన్నా నదీతీర వాసి..మనుమ సిద్ధి ఆస్థాన కవి యైన కవిబ్రహ్మ  తిక్కన సోమయాజి   పూనుకుని హరిహరనాథ స్తుతితో విరాట పర్వము నుండి ప్రారంభించి స్వర్గారోహణ పర్వం వరకు గల పదిహేను పర్వాలను తానొక్కడే రచించాడు.
పెన్నా నది ప్రవాహ పరవళ్లు తిక్కన కవిత్వంలో  చూస్తాము .
 ఆ తరువాత 14వ శతాబ్దంలో గుండ్లకమ్మ నది తీర వాసి..అద్దంకి రెడ్డి రాజుల ఆస్థాన కవి.. ప్రబంధ పరమేశ్వరుడును నైన   ఎఱ్ఱన మహాకవి   అరణ్య పర్వం లోని శేషభాగాన్ని  పూర్తి చేసేందుకు పూనుకున్నాడు.
 అరణ్య పర్వం 4 వ ఆశ్వాసం లో 142 వ పద్యం " స్ఫుర దరుణాంశు రాగరుచి బొంపిరివోయి నిరస్త నీరదా వరణములై " అనే పద్యంతో ప్రారంభించి అరణ్య పర్వం లోని 5,6,7 ఆశ్వాసాలను పూర్తి చేసి  మహాభారతానికి ఒక సమగ్ర ఆకృతిని కలుగ చేసాడు.
ఈ విధంగా గోదావరీ తీరాన ప్రారంభమైన మహాభారత రచన పెన్నా నదీ తీరాన ఉధృత స్థితిని అందుకుని గుండ్లకమ్మ తీరంలో ప్రశాంతతను పొందింది.
మహాభారతాన్ని నన్నయ తిక్కనల శైలిలో నడిపి తన ప్రత్యేకతను కూడా  ఎఱ్ఱన  చాటుకున్నాడు.
ఈ విధంగా మహాభారతాన్ని తెలుగులో పూర్తి చేసిన ఖ్యాతి ఎఱ్ఱన  గారికి..ప్రకాశం జిల్లా కు దక్కింది.
నన్నయ్య ,తిక్కన , ఎఱ్ఱన ఈ మువ్వురూ  కవిత్రయం గా తెలుగు వారి గుండెల్లో కొలువై ఉన్నారు.
ఈ ముగ్గురు మహా కవులు తెలుగు నేలపై జన్మించడం   తెలుగువారి అదృష్టం గా..పూర్వ పుణ్య ఫలంగా భావించాలి.
 ప్రకాశం జిల్లా గుడ్లూరు లో జన్మించి అరణ్య పర్వ శేషంతో మహాభారతానికి సమగ్ర ఆకృతిని  కల్పించిన ఎఱ్ఱన మహాకవిని  సదా స్మరించుకోవాలనే      సదాశయంతో  ఒంగోలులో ఎఱ్ఱన పీఠం ఆధ్వర్యంలో ఒంగోలు ఆర్డిఓ కార్యాలయం వద్ద ఎఱ్ఱన గారి విగ్రహాన్ని 14.11. 1987లో ప్రతిష్ఠించారు.
ప్రకాశం జిల్లా రైస్ మిల్లర్ల సంక్షేమ సంఘం ఎఱ్ఱన విగ్రహాన్ని తయారు చేయించి బహూకరించింది. నాట్యావధాన కళా రూపంతో ఆంధ్రుల కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఎఱ్ఱన పీఠం కార్యదర్శి  డాక్టర్ ధారా రామనాథశాస్త్రి గారు.. అలాగే అప్పటి జిల్లా అభివృద్ధి అధికారి, ఎఱ్ఱన పీఠం శాశ్వత ఉపాధ్యక్షులు కె వెంకట శివయ్య గారు.. కోశాధికారి ఆలపాటి రాధా కృష్ణమూర్తి గారు  ఈ కృషిలో  ప్రధాన పాత్ర పోషించారు. డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు జిల్లా కలెక్టర్ గా..ఎఱ్ఱన పీఠం అధ్యక్షులుగా వ్యవహరించిన సమయంలో ఎఱ్ఱన విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది.
 ఎఱ్ఱన పీఠం ఆధ్వర్యంలో గొప్ప గొప్ప  సాహిత్య సభలను నిర్వహించడంతో పాటు ఎఱ్ఱన పీఠం నిర్వాహకులు  ఎఱ్ఱన సాహిత్య లహరి పేరిట వ్యాస సంకలనాలు వెలువరించారు. ఎఱ్ఱన రచించిన పద్యాలతో విద్యార్థులకు పద్య పోటీలను జరిపి విజేతలకు బహుమతులను అంద చేసారు. అయితే
నేడు అదంతా ఒక చరిత్ర. జ్ఞాపకాల సమాహారం.

"మహా భారతంలో మహిత భావనలు" పుస్తక ప్రచురణ గురించి :
నన్నయ్య , తిక్కన , ఎఱ్ఱనల చేతుల మీదుగా పూర్తి యైన మహాభారతంలోని కొన్ని ముఖ్య విషయాలతో 2016 ఏప్రిల్ 16 న "మహాభారతంలో మహిత భావనలు" పేరిట ఒక పుస్తకాన్ని వెలువరించాను. కవిత్రయం ఫోటోలను ముఖ చిత్రంగా ప్రచురించాను.
2013 ఆగస్ట్ 23 - 24 తేదీలలో గుంటూరు జిల్లా నగరం లోని ఎస్ వీ ఆర్ ఏం కళాశాలలో (శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కళాశాల ) ఏర్పాటైన యూ జీ సీ జాతీయ సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాన్ని మరింత విస్తరించి పై పుస్తకంగా వెలువరించాను.
మరో నాలుగు భాగాలు వెలువడ వలసి ఉంది.
సర్వేశ్వరుని అనుగ్రహంతో సహృదయుల తోడ్పాటుతో మిగిలిన భాగాలను కూడా వెలువరించేందుకు కృషి చేస్తాను.


  ( ఎం. వి.ఎస్ . శాస్త్రి , ఒంగోలు .
సెల్  9948409528)

కామెంట్‌లు లేవు: