17, ఆగస్టు 2020, సోమవారం

జయా - జాయా🌷*

దాదాపు ముప్పైఅయిదు సంవత్సరాల క్రితం శ్రీమఠంలో నవరాత్రి సందర్భంగా సరస్వతి పూజ రోజు జరిగిన సంఘటన ఇది. ఎప్పటిలాగే మహాస్వామివారు త్రిపురసుందరి సమేత చంద్రమౌళిశ్వర పూజ పూర్తీ చేసి ఆరోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతి పూజ మొదలుపెట్టారు. వైదికులొకరు స్వామివారి దగ్గర కూర్చొని చేతిలోని పుస్తకం సహాయంతో మంత్రభాగం చెబుతున్నారు.

సంకల్పము, ఆవాహనము, ప్రాణ ప్రతిష్ట, అంగ పూజ అయిన తరువాత సరస్వతి అష్టోత్తరం చదవడం ఆరంభించారు. ప్రతి నామము చివర నమః తరువాత స్వామివారు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తున్నారు.
ఆ వైదికులు అష్టోత్తరం చదువుతూ,

“ఓం బ్రహ్మజయాయై నమః” అని చెదివారు.

ఈ నామం చేదివిన తరువాత మహాస్వామివారి చేతిలోని పూవు సరస్వతి అమ్మవారి పాదాలను తాకలేదు. ఆలాగే స్వామివారి చేతిలోనే ఉన్నది. మరలా అలాగే అదే మంత్రాన్ని చెదివారు వైదికులు. ఊహు! ఇప్పుడు కూడా స్వామివారు పువ్వు సమర్పించలేదు. అలా ఎన్ని సార్లు నామమును చదివినా మహాస్వామివారిలో కించిత్ చలనం కూడా లేదు.

చేతిలో పువ్వును పట్టుకుని అలా స్థాణువులా ఉండిపోయారు.
ఏం అపచారం జరిగిందో అని అక్కడున్నవారందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు మహాస్వామి వారు చేతిలోని పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం లేదు?

ఈ విషయం శ్రీమఠం మేనేజరుకు చేరింది. విశ్వనాథ అయ్యర్ తొ పాటు ఆయన కూడా పూజ జరుగుతున్నా స్థలానికి వచ్చారు. ఆయన వైదికుణ్ణి ఆ నామాన్ని పలుకమని అడుగగా ఆయన అలాగే నామాన్ని చెప్పాడు “ఓం బ్రహ్మజయాయై నమః” అని.

ఎటువంటి చలనము లేక మహాస్వామివారి చేతిలో పుష్పం అలాగే ఉండిపోయింది. అదృష్టవశాత్తు అక్కడే ఒక సంస్కృత పండితుడు కూడా ఉన్నాడు. ఆ నామాన్ని ఆయన సవరించి దాన్ని ఇలా పలకమని ఆదేశించారు.

“ఓం బ్రహ్మ జాయాయై నమః”

వెంటనే మహాస్వామివారి చేతిలోని పుష్పం అమ్మవారి పాదాలపై పడింది.

ఈ రెండునామాలకి ఉన్న తేడా ఏమిటి అంటే,

“ఓం బ్రహ్మ ‘జాయాయై’ నమః” అంటే బ్రహ్మ పత్ని అయిన అమ్మవారికి ప్రణామములు అని. “ఓం బ్రహ ‘జయాయై’ నమః” అంటే బ్రహ్మను గెలిచిన అమ్మవారికి ప్రణామములు అని అర్థం. మహాస్వామివారు మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధిగా పూజ చేసేవారు కాని, యాంత్రికంగా చేసేవారు కాదు. వారి పూజకట్టులో మడికట్టులో వారికి వారే సాటి కాని వేరొకరు కాదు.

అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం!

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
********************

కామెంట్‌లు లేవు: