14, సెప్టెంబర్ 2020, సోమవారం

శివామృతలహరి

      శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

శా||
నింగిం బాజెడు స్వర్ణదీజలములన్ నీరార్చలేనయ్య నిన్
లింగా! బిల్వదళాలకై వృథివి గాలింపంగలేనయ్య ! చే
రం గాదయ్య రసాతలమ్ము మణులేరన్ - హృత్ప్రసూనమ్మునన్
సింగారించెద తావ కాంఘ్రి యుగళిన్ శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం;( నాకు అర్ధమైన వరకు)

ఎక్కడో నింగిలో పై ప్రవహించే ఆకాశ గంగను తెచ్చి నీకు లింగాభిషేకము చేసే శక్తి నాకులేదు.
బిల్వ దళాలను తో పూజ చేద్దామంటే,వాటికోసం దేశమంతా వెతకటం నావల్ల కాదు.
పోనీ నిన్ను మణులతో పూజిద్దాం అంటే మణులకోసం రసాతల లోకానికి నేను చేరలేను.( నాగరాజయిన వాసుకి ఏలే పాతాళ లోకం. అక్కడ అత్యంత విలువైన మణులు ఉంటాయని ప్రతీతి).
ఇవన్నీ చెయ్యలేను గానీ ఒక్క పనిని మాత్రం చేయగలను స్వామీ, అదేమిటంటే
నా హృదయం అనే పుష్పంతో నీ యొక్క పాద పద్మములను అలంకరించి పూజించ గలను.
కరుణించి నన్నేలుకో స్వామీ శ్రీ సిద్ధ లింగేశ్వరా!

కామెంట్‌లు లేవు: