14, సెప్టెంబర్ 2020, సోమవారం

పెరుగు , మజ్జిగ , వెన్న ఉపయోగాలు - వాటిని సేవించువారు పాటించవలసిన నియమాలు .

   ఆవుపెరుగు మిక్కిలి జిడ్డుగా ఉండును. శ్లేష్మాన్ని కలుగచేయును . రక్తం చెడగొట్టును . గ్రామాల యందు పాడిపంటలు విశేషముగా ఉన్నను మనుష్యులు రోగాలబారిన పడుటకు ముఖ్యకారణం పెరుగు తీసుకొను విషయంలో నియమాలు పాటించకపోవడమే ప్రధాన కారణం. రాత్రి యందు పెరుగు ఉపయోగించుట మంచిది కాదు.

          పెరుగు ప్రీతికరమైన పదార్థం కావడం మూలాన పిల్లలు , పెద్దలు మితిమీరి సేవించెదరు. అందువలన రక్తం చెడి రక్తపిత్త రోగం , విసర్పి కలుగును. విసర్పి అనగా శరీరం నందు రక్తం చెడి మాంసం , చర్మములతో కలిసి సర్పం పాకే విధముగా తొందరగా శరీరం అంతా గుడ్లగుడ్లగా ఉండును. ఇది తరచుగా చిన్నపిల్లలకు వచ్చును. కుష్టు , పాండురోగం , పచ్చకామెర్లు మొదలగు వ్యాధులు వచ్చును. పెరుగు వేడిచేయును . అదే దానికి కొంచం నీరు కలిపి మజ్జిగలా చేసుకుని తాగితే చలువచేయును . అందుకే వేసవికాలం నందు పెరుగు తీసుకోరాదు . శీతాకాలం , వర్షాకాలం నందు పెరుగు పగలు తీసుకోవచ్చు .

              మూత్రం బొట్లుబొట్లుగా పడు వ్యాధి నందు , రొంప, చలిజ్వరం , నోటికి రుచి లేకపోవటం , శరీరం కృశించి ఉండు రోగములు కలిగి ఉండువారు పెరుగు వాడటం మంచిది . పెరుగు శుక్రాన్ని పెంచును.

  పెరుగు తీసుకొనువారు పాటించవలసిన నియమాలు -

 * పెరుగుతో కోడిమాంసాన్ని భుజించరాదు .

 * పెరుగుతో నిమ్మపండు భుజించరాదు .

 * పెరుగుతో అరటిపండు భుజించరాదు .

 * పెరుగు వేడివేడి అన్నంతో పాటు తినరాదు.

 * పెరుగు రాత్రి పూట భుజించరాదు .శరీరంలో కఫం వృద్ధిచెందును. మరియు జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి.

    పగలు పెరుగు భుజించువారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవలెను.

 * తేనె - పెరుగు = మంచి రుచి కలుగును.

 * ఉసిరిక పచ్చడి - పెరుగు = శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను పోగొట్టును .

 * నెయ్యి - చక్కెర - పెరుగు = వాతాన్ని తగ్గించును , ఆహారాన్ని జీర్ణం చేయును .

 * చక్కెర - పెరుగు = దప్పిక, తాపాన్ని హరించును .

 * పెసరపప్పు - పెరుగు = రక్తంలోని వాతాన్ని హరించును .

  మజ్జిగ ఉపయోగాలు -

 
    పెరుగునకు నాలుగోవ భాగం నీరు కలిపి బాగుగా మజ్జిగ తయారుచేయవలెను. దానిలో వెన్న తీయరాదు. ఇటువంటి మజ్జిగని ఉదయం , మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుచున్న ఏ వ్యాధితోను బాధపడరు. బాగుగా చిక్కగా ఉండి వెన్నతీయని మజ్జిగ పుష్టిని కలుగచేయును . కఫాన్ని కలిగించును. శ్రమను , దప్పికను పొగొట్టును. బాగుగా చిలికి వెన్నతీసిన మజ్జిగ తేలికగా జీర్ణం అగును.

          శరీరంలో వాతం పెరిగినపుడు మజ్జిగలో శొంటి, సైన్ధవలవణం లేదా ఉప్పు కలిపి లొపలికి తీసికొనవలెను. శరీరంలో పైత్యం పెరిగినపుడు మజ్జిగతో పంచదార కలిపి వాడవలెను. శరీరంలో కఫం ఎక్కువైనప్పుడు శొంటి, పిప్పిళ్లు , మిరియాల చూర్ణం కలిపి మజ్జిగతో కలిపి తాగవలెను .

                మన శరీరంలో జఠరాగ్ని మందగించి ఆకలి లేనపుడు మరియు వాత వ్యాధుల్లో మజ్జిగ అమృతంగా పనిచేయును . విషం , వాంతులు , నోటి నుండి నీరు కారుట, విషమజ్వరం , పాండువు , రక్తవిరేచనాలు , మేథస్సు, మొలలు , భగన్దరం , అతిసారం , ప్లీహానికి సంబంధించిన వ్యాధులు , ఉదరరోగం , బొల్లి , కుష్టు , క్రిములను మొదలయిన వాటిని మజ్జిగ సేవించుట వలన పోగొట్టుకోవచ్చు.

          మజ్జిగ భూమిపైన పోసిన అక్కడ ఉన్న గడ్డిపోచలు , పచ్చిక వంటివి మాడిపోయి మరలా మొలవవు. ఇదే సూత్రం మొలలు వ్యాధికి సంక్రమించును. మొలల వ్యాధిలో మొలకలు ఊడిపోవుటకు మజ్జిగ సేవనం తప్పనిసరి . మజ్జిగ తాగుట వలన వాత, శ్లేష్మములచే ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి రక్తప్రసరణ సాఫీగా జరుగును. దీనివలన శరీరపుష్టి పెరుగును . మజ్జిగ తాగుట వలన 80 రకాల వాతరోగాలు నయం అగును.

  మజ్జిగలోని రకాలు -

  * పెరుగును కవ్వముతో చిలికి అందు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ.

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి అందు వెన్నను సగం మాత్రమే తీసివేసిన మజ్జిగ .

 * పెరుగును చక్కగా కవ్వముతో చిలికి వెన్నను ఎంతమాత్రం తీయకుండా ఉంచిన మజ్జిగ.

     కఫం ఎక్కువ ఉన్నప్పుడు , అగ్ని మందగించినప్పుడు మిక్కిలి బలహీనంగా ఉన్నప్పుడు వెన్నను పూర్తిగా తీసివేసిన మజ్జిగ వాడవలెను.

      పైత్యం ఎక్కువ అయ్యి , అగ్నిమాంద్యం ఉన్నప్పుడు బలం మధ్యమంగా ఉన్నప్పుడు సగం వెన్న తీసిన మజ్జిగను వాడాలి.

     వాతం ఎక్కువుగా ఉన్నప్పుడు వెన్న అసలు తీయని మజ్జిగని వాడవలెను.


  వెన్న ఉపయోగాలు -

   
         ఆవు వెన్న బలం కలిగించును. జఠరాగ్ని పెంచును. వాతం మరియు పిత్తాన్ని పోగొట్టును రక్తదోషాలను, క్షయరోగం, మొలలు , దగ్గు పోగొట్టును . చిన్నపిల్లలకు అమృతం వలే పనిచేయును . బక్కచిక్కి ఉన్నచిన్నపిల్లలకు ఉదయాన్నే తేనె , ఆవు వెన్న , పంచదార కలిపి తినిపించిన బలం కలుగును. క్షయరోగులు బాగా చిక్కి శల్యం అయినపుడు ఈ ప్రయోగం చాలా బాగా పనిచేయును .

          గేదె పెరుగు బలకరం . మిక్కిలి చమురు కలిగి ఉండును. వాతం , శ్లేష్మం కలుగచేయును . మధురంగా ఉండును. పచ్చిపాలు తీసిన వెన్న సేవించిన కండ్లకు మంచిది . ఎల్లప్పుడూ అప్పటికప్పుడు తీసిన వెన్న మంచిది . నిలువ వెన్న చాలా రోగములను తెచ్చిపెట్టును. కావున విడిచిపెట్టవలెను.

   
   గమనిక -

           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.

           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.

            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.

      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.

            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .

                 కాళహస్తి వేంకటేశ్వరరావు

             అనువంశిక ఆయుర్వేద వైద్యులు

                         9885030034

కామెంట్‌లు లేవు: